Saturday, July 30, 2011

కిరాయి దారుగ వచ్చి ఇల్లే నాదంటున్నవు

నిరంకుశ నవాబును 
ఎదిరించి నిలిచినం
రాక్షస రజాకార్లను 
రణం జేసి గెలిచినం

సాయుధ పోరాటం జేసి
స్వాతంత్ర్యం సాధించినం
 స్వంత రాజధాని తోటి
దర్జాగా బతికినం

అప్పుడొచ్చినావు నువ్వు
అరవులతో పోరుజేసి
చెన్నపురిని కోలుపోయి
సొంత రాజధాని లేక 
టెంటులల్ల నీల్గలేక

సాటి తెలుగు వాడివని
తీయటి మాటలు నమ్మి
దరికి చేర దీసినం
భాగ్యనగర సీమలోన 
చోటు ఇచ్చి పిలిచినం

చుట్టం సూపుగా వచ్చి
భాగస్వామిగా మారి
కళ్ళు తెరిచే లోపుగా 
ఇల్లును నువ్వు కాజేసి 
నాయింట్లో నన్నే ఒక 
కాందిశీకునిగ మార్చి 
బయటికి గెంటేసినావు

మంచిది భాయీ నువ్వు 
నా కళ్ళను తెరిపించినావు 
నీకు నాకు కుదరదింక 
వేరు బతుకు బతుకుదాం 

అన్నానో లేదో మరి 
గగ్గోలుగా అరిచినావు
హైదరాబాదే నాదని 
మొండి కూత కూసినావు

కిరాయి దారుగ  వచ్చి
ఊరు నాది అన్నట్టు 
నా ఊరును వాడుకొని 
ఆస్తులు సంపాదించి 
విడిపోయే రోజోస్తే 
ఇల్లే నాదంటున్నవు

ఇప్పటికైనా భాయీ 
యదార్థాన్ని గుర్తెరుగు 
విచక్షణను మరిచిపోయి
వివాదాలు పెంచబోకు

Friday, July 29, 2011

యెడ్యారప్ప రాజీనామా, జన్‌లోక్‌పాల్ బిల్లు, తెలంగాణా ఉద్యమం

యెడ్యారప్ప రాజీనామా చేయకుండా మొరాయించడానికి, కేంద్రప్రభుత్వం జన్‌లోక్‌పాల్ కాకుండా జోక్‌పాల్ బిల్లు ఆమోదించడానికి, రాజగోపాల్ & కో తెలంగాణా వ్యతిరేకించడానికి గల సారూప్యత ఏమిటి?

మొదట చదవగానే ఏంటీ అర్థం లేని ప్రశ్న అనిపించొచ్చు. కాని అలోచించి చూస్తే మూడు విషయాలకు కూడా అంతర్గతంగా వుండే కారణం ఒక్కటే అని ఇట్టే తెలిసిపోతుంది.

యెడ్యారప్ప పై కర్నాటక రాష్ట్ర లోకాయుక్త హెగ్డే అత్యంత అవినీతి పరుడుగా సాక్ష్యాధారలతో నిరూపిస్తూ ఇచ్చిన రిపోర్టుతో అతని, గాలి సోదరులు అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టిన వైనం బయట పడింది. ఒక రాజ్యాంగ బద్ధమైన న్యాయస్థానం అంతటి నేరారోపక తీర్పు ఇచ్చినపుడు ఏమాత్రం నిజాయితీ గలవారైనా వెంటనే రాజీనామా చేయాలి.

కాని యెడ్యారప్ప, గాలి సోదరుల దన్నుతో ససేమిరా అన్నారు. బయటికి ఏమి చెప్పినా, అసలు కారణం మాత్రం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ ఆరోపణలపై రాజీనామా అంటూ చేస్తే చాలా కాలం పదవులకు దూరంగా వుండవలసి వస్తుంది. పదవులను ఆధారంగా చేసుకుని ఇప్పటిదాకా సాగించిన దోపిడీకి గండి పడుతుంది. పాత చరిత్ర కూడా తిరగదోడ బడొచ్చు. జైళ్ళకు కూడా వెళ్ళవలసి రావచ్చు.

యెడ్యారప్పే కాదు, ఏ దోపిడీ దారుడైనా తన దోపిడీ శకం ముగుస్తుందని భావించినపుడు తనకు అడ్డొచ్చే వారిపై తీవ్రంగా పోరాడుతాడు. అంతే కానీ, "నేను ఇప్పటిదాకా అన్యాయాలు చేస్తున్నాను, ఇకనుండి బుద్ధిగా వుంటాను" అని చెప్పి దిగిపోడు.   

ఇకపోతే కేంద్ర కేబినెట్. ఎంటటి అవినీతిలో కూరుకు పోయినా, ప్రజలందరూ ఛీకొడుతున్నా కూడా తన పాపాలను కడుక్కోవాలని ఏమాత్రం అనుకోవడం లేదు. అవినీతి వ్యతిరేక ఉద్యమాలను తీవ్రంగా అణచివేయాలని చూస్తుందే తప్ప జన్‌లోక్‌పాల్‌బిల్లు ఆమోదించాలని ఏమాత్రం ప్రయత్నించడం లేదు. పైగా దాన్న్ని అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తుంది. కారణం ప్రతి ఒక్కరు ఊహించగలిగేదే. ఏమంటే ప్రభుత్వం నడిపిస్తున్నది దోపిడీ శక్తులు. ముందే అనుకున్నట్టుగా దోపిడీ శక్తులు అంత సులభంగా దొపిడీపై తమకు సంక్రమించిన హక్కు(?)లను వదులుకోవు. తమ హక్కులను కాపాడుకోవడానికి ఏ పరిణామాలకైనా సిద్ధంగా వుంటాయి. ఎంతటి అణచివేతకైనా పాల్పడతాయి. అనుకే ఏమాత్రం సిగ్గులేకుండా కేంద్ర కాబినెట్ ఒక తూతూ మంత్రం బిల్లు తయారు చేసుకొని ఆమోదించుకుంది, ఏం చేయడం లేదని ఎవ్వరూ అనకుండా.

యెడ్యారప్పకి చివరికి రాజీనామా చేయక తప్పలేదు. కాని కేంద్ర కేబినెట్ అంత సులభంగా తలొగ్గే పరిస్థితి కనపడటం లేదు. దేశవ్యాప్తంగా అవినీతిపై తెలంగాణా ఉద్యమం వంటి మహోద్యమం వస్తే తప్ప అది తలవంచదు.

పై రెండు దృష్టాంతాలు చూసినప్పుడు తెలంగాణా ఎవరు ఎందుకు అడ్డుకుంటున్నారో సులభంగా అర్థమౌతుంది. రష్యన్ బోల్షెవిక్ విప్లవాన్ని భూస్వామ్య శక్తుల ప్రతినిధులైన తెల్ల సైన్యాలు ఎలా చివరిదాకా అడ్డగిస్తూ పోరాడాయో, అవే భూస్వామ్య, పెట్టుబడిదారీ శక్తులు తెలంగాణా ఏర్పాటును అడ్డగిస్తూ అంతిమ పోరాటం చేస్తున్నాయి. ఈ శక్తులు తమ దోపిడీలు అక్రమాలు నిరంతరాయంగా కొనసాగించడానికి ఎలాంటి కుట్రలైనా పన్నగలుగు తాయి. ఎంతమందినైనా కొనడానికి సాహసిస్తాయి. వారు న్యాయ నిపుణులు కావచ్చు, ప్రధాన సచివులే కావచ్చు, ఉద్యమకారులే కావచ్చు.

ఇలాంటి నిర్ణయాత్మక సమయంలో తెలంగాణా ప్రజలు తమ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న దోపిడీ శక్తుల కుట్రలను, కుతంత్రాలను వేయి కళ్ళతో కనిపెడుతూ అప్రమత్తంగా ముందుకు సాగవలసిన అవసరం వుంది. 


Wednesday, July 27, 2011

ఆత్మగౌరవం, స్వపరిపాలన కోసమైతే ప్రత్యేక దేశం ఎందుకు?


ఆత్మగౌరవం, స్వపరిపాలన కోసమైతే ప్రత్యేక దేశం కోరండి, ప్రత్యేక రాష్ట్రం ఎందుకూ? అని కొంతమంది సీమాంధ్ర బ్లాగర్లు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ముందుగా అలాంటి వారిని కోరేది ఏమంటే, ఏది కోరాలో మమ్మల్ని నిర్ణయించు కానివ్వండి, అది కూడా మీరే నిర్నయిస్తానంటే ఎలా?

ఆత్మగౌరవం, ప్రాంతీయ స్వపరిపాలనకు ఇంకా ఈ దేశంలో అవకాశం వుందని భావించినప్పుడు ఇంకో దేశం కోరడంలో ఔచిత్యం ఏముంది? ఒక జాతి యొక్క స్వాతంత్ర్యం స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డప్పుడు మాత్రం తప్పకుండా అలాంటి ఉద్యమాలు రావడం సాధ్యం. అంటే ఒక ప్రాంతం యొక్క ప్రజాస్వామిక హక్కులకు మిగతా జాతి మొత్తం ఏకమై భంగం కలిగిస్తున్నపుడు ఒక రోజు కాకపొతే మరో రోజు అలాంటి డిమాండు తప్పక వస్తుంది.  

కాని తెలంగాణా విషయంలో అలాంటి పరిస్థితి లేదు. మిగతా రాష్ట్రాలు తెలంగాణా పై ఎలాంటి కుట్రలకు గాని అన్యాయాలకు గాని పూనుకోవడం లేదు. పైగా చాలా ప్రాంతాలు, లేదా ప్రాంతాల నాయకులు తెలంగాణా న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించక పోవడానికి తెలంగాణకి ఎటువంటి కారణం లేదు.

ఇక పొతే ప్రాంతీయ స్వపరిపాలన విషయానికి వస్తే తెలంగాణాకి పూర్తీ అన్యాయం జరుగుతుందన్నది ఇప్పటికే సర్వత్రా రుజువైన సత్యం. ఈ విషయాన్ని పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అధికారికంగా గుర్తించినట్టు ప్రకటించడమే కాక పలుసందర్భాల్లో తెలంగాణా ఏర్పాటుకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో పెద్ద పార్టీ అయిన తెలుగుదేశం కూడా 2008 లో తెలంగాణా ఏర్పాటు యొక్క అవసరాన్ని గురించినట్టు ప్రకటించింది. ఆ మేరకు ప్రణభ్ ముఖర్జీ కమిటీకి లేఖ కూడా పంపింది.

పార్టీలే కాదు, తెలంగాణాకి జరిగిన అన్యాయాలను ప్రభుత్వాలు కూడా గుర్తించాయి కాబట్టే GO610 వంటి ఉత్తర్వులు జారీ చేసాయి. అంతెందుకు? శ్రీకృష్ణ కమిటీ కూడా గుర్తించింది కాబట్టే ఆరో సూచనలో భాగంగా రాష్ట్రాన్ని కలిపి ఉంచాలంటే ప్రాంతీయ అభివృద్ధి బోర్డు నెలకొల్పాలని చెప్పింది. కాకపొతే అలాంటి బోర్డు పెట్టడం అది విఫలం కావడం ఇదివరకే జరిగిందనుకోండి! అందుకనే తెలంగాణలో అలాంటి బోర్డులను ఇప్పుడెవ్వరూ నమ్మడం లేదు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాకు మెజారిటీ లేదు. కాబట్టి తెలంగాణా ప్రజా ప్రతినిధులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మెజారిటీ వున్నా సీమాంధ్ర వ్యక్తీ మాత్రమే ముఖ్యమంత్రి గా వుండడం పరిపాటి అయిపొయింది. ఒక వేళ తెలంగాణాకి చెందినా వ్యక్తి ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా వచ్చినా సంవత్సరం తిరిగే లోపే వారిని దించేయడం కూడా పరిపాటిగా మారింది. అదీ ఒకప్పుడు. ఇప్పుడైతే ఆ మాత్రం సౌభాగ్యం కూడా కరువైంది. ఇంతటి ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా జూనియర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు కాని తెలంగాణలో ఎంతమంది సీనియర్ నాయకులు వున్నా ముఖ్యమంత్రి కాలేక పోవడం గమనిస్తే, సీమాంధ్ర లాబీలు ఎలా పనిచేస్తాయో ఇట్టే అర్థమౌతుంది.

దీనంతటిని చూసినప్పుడు రాజకీయంగా తెలంగాణా ఎప్పటికి రాష్ట్రంలో పైచేయి సాధించలేదని అర్థమౌతుంది. పైచేయి సాధించే సీమాంధ్ర పాలకులు తెలంగాణా ప్రయోజనాలకు ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటారన్న విషయం కూడా ఇప్పటికే రుజువైంది.

కాబట్టి తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడం ఒక అనివార్యతగా మారింది. ప్రజలలో వున్నా బలమైన కోరిక గ్రహించిన చంద్రశేఖర్ రావు తెలంగాణా రాష్ర సమితి స్థాపిస్తే, మిగతా పార్టీలు కూడా నిట్టనిలువుగా చీలిపోయి తెలంగాణా ప్రాంతపు కార్యకర్తలంతా పార్టీలకు అతీతంగా తెలంగాణానే సమర్థిస్తున్నారు. ఎంత ఇష్టం లేక పోయినా చంద్రబాబునాయుడు కూడా తన తెలంగాణా ఎమ్మెల్యేలతో ఉద్యమాన్ని నటింప జేస్తున్నాడంటే అది ప్రజల్లో వున్న బలమైన ఆకాంక్ష కారణంగానే. 

మరి ప్రజల్లో వున్న బలమైన బలమైన ఆకాంక్షలను రాక్షసబలంతో అణచి వేయ జూస్తే ఏమౌతుంది? చరిత్రలో లోకకంటకులైన రాక్షసులకు ప్రతి సారీ ఓటమి మాత్రమె మిగిలింది. అంతిమ విజయం ప్రజలకే దక్కింది. ఇప్పుడుకూడా తెలంగాణా ప్రజలని తమ రాక్షసబలంతో అడ్డుకోవాలని ప్రయత్నించే వారికి మొదట్లో విజయం లభిస్తున్నట్టు కనిపించ వచ్చు. కాని అంతిమంగా ప్రజలదే విజయం.


అణచివేతలో కూడా అదికవే నన్నయ!

వేములవాడ భీమకవిని అణగదొక్కిన నన్నయ

రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవులను అణగదొక్కి పైకి వచ్చాడు, చివరికి వారి గ్రంథాలు చించి వేయడం, తగుల పెట్టటం చేశాడు.

ఆధునిక , సమకాలీన తెలంగాణ సాహిత్య చరిత్ర మొత్తం అణిచివేతల లేదంటే అవహేళనల మయం. ఇందుకు ప్రాచీన సాహిత్య చరిత్ర మినహాయింపేమి కాదన్నది వెలుగులోకి వస్తోన్న వాస్తవం. ఇందుకు బీజాలు ఆదికవిగా ప్రచారం చేయబడిన నన్నయ చేతనే నాటబడడం గమనార్హం. క్రీ. శ 11 వ శతాబ్దిలో రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవులను అణగదొక్కి పైకి వచ్చాడని, చివరికి వారి గ్రంథాలు చించివేయడం, తగుల పెట్టటం చేశాడని ఆధునిక యుగ సంస్కర్తగా పేరొందిన కందుకూరి వీరేశలింగం తన ‘ఆంధ్ర కవుల చరిత్ర’ లో విస్పష్టంగా రాశాడు.

తెలంగాణలోని వేములవాడకు చెందిన భీమకవి, నన్నయ కన్నా ముందుగానే 'రాఘవ పాండవీయము' అనే గ్రంథం రాసి, దానిని రాజైన రాజరాజనరేంద్రునికి చూపించి రాజ సన్మానం పొందడం కోసం రాజమహేంద్రవరం చేరాడు. విష్ణు వర్ధనుడిగా పేరొందిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ. రాజసన్మానం పొందకోరిన ఏ కవి అయినా నన్నయ ద్వారా రాజుకు పరిచయం కావలసిందే. దానితో వేములవాడ భీమకవి తన రచన అయిన 'రాఘవ పాండవీయము' ను నన్నయకు అప్పగించారు. ఆది చదివిన నన్నయ భీమకవి కవిత్వం అమోఘంగా ఉండటం, అది వెలుగులోకి వస్తే తన ప్రాభవం తగ్గుతుందని భావించి ఆ గ్రంథాన్ని తగుల బెట్టించాడని వీరేశలింగం వివరించాడు.కందుకూరి వీరేశలింగం రాసిన 'ఆంధ్ర కవుల చరిత్ర' నుండి ఈ ఉటంకింపును చూడండి.

"నన్నయ భట్టారకుడు తాను రచియింప నారంభించిన శ్రీ మహాభారతమును సంపూర్ణముగా నాంధ్రీకరింపలేక పోవుటకు కారణములు పలువురు పలు విధముగా చెప్పుదురు. కొందరు వేములవాడ భీమకవి శాపము చేత గలిగిన మరణము కారణమందురు. మరి కొందరు యధర్వాణాచార్యులు తెలిగించుచుండిన భారతమును తగుల బెట్టించుట చేత గలిగిన చిత్త చాంచల్యము కారణమందురు. ఈ రెండు కారణములో నేది నిజమైనను ఈ కవి పరోత్కర్షమును సహింపజాలని దుస్స్వభావము కలవాడయినట్టూ హింపదగియున్నది.

"ఈయన తోడి సమకాలినుడైన వేములవాడ భీమకవి రాఘవపాండవీయమును కవిజనాక్షిశయములో జేర్చి యొక్క వ్యాకరణ మును చేసి రాజసన్మానమును బొందుటకయి రాజమహేంద్రపురమునకు దెచ్చి విష్ణువర్ధనుని యాస్థాన పండితుండయి యున్న నన్నయ భట్టునకు జూపగా నతడా కవిత్వ ము మిక్కిలి శ్లాఘ పాత్రముగా నుండుట చూచి యోర్వలేక యా పుస్తకములు లోకములో వ్యాపించిన యెడల దన పుస్తకములకు బ్రసిద్ధి రానేరదని యెంచి వానిని తగులబెట్టించినట్లును, అటు మీదట నతడింట లేనప్పుడు భీమకవి వచ్చి అతని భార్యను నీ భర్త ఏమి చేయుచున్నాడని యడిగి యామె తన భర్త రహస్య స్థలమున ఉండి యరణ్య పర్వం రచించుచున్నాడని చెప్పిన మీదట యతనింకను నరణ్యములోనే ఉన్నాడా యట్లే యుండునుగాక అని శపించి తన పుస్తకముల నణగదొక్కేనన్న కోపము చేత నన్నయభట్టు రచించిన ఛందస్సును వ్యాకరణమును భార్య నడిగి పుచ్చుకొని దానిని చించి గోదావరి లో గలిపివేసి తాను చిరకాలము కష్టపడి చేసిన గ్రంథములు పోయినవన్న దుఃఖము చేత బెంగపెట్టుకొని కాలధర్మము నొందినట్లును, అతని శాపము తగిలి నన్నయ భట్టు వనములో మృతి నొందినట్లును, అట్లు నశించిన వ్యాకరణము సిద్ధులలో గలిసిన సారంగధరుడు తన చిన్నతనములో నేర్చుకొని యుండుట చేత మల బాల సరస్వతి యను బ్రాహ్మణునకు జెప్పి నట్లును లోక ప్రవాదము కలిగి యున్నది."

తన కాలం నాటికి బహుళ ప్రచారంలో ఉన్న విషయాన్ని కందుకూరి వీరేశలింగం తన 'ఆంధ్ర కవుల చరిత్ర' లో ఉటంకించారు. ఈ కథనం మీద చారిత్రక చర్చ జరగవలసి ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి ప్రసిద్ధి పొందకుండా, తొలి గ్రంథంగా భావించబడిన తన రచన మహాభారత ఆంధ్రీకరణ కన్నా మరో రచన ముందు వెలుగు చూడకుండా చేసిన కుట్ర ఇందులో దాగి ఉంది. ఆంధ్రుల ఆధిపత్య అభిజాత్యం ఆది కవిగా పిలవబడిన నన్నయ నుంచే ఆరంభమైందని ఈ ఘటన రుజువు చేస్తోంది.
   
- వి.ఆర్.తూములూరి



Curtesy: Namaste Telangana       

Saturday, July 23, 2011

సమైక్యత మార్కు దాడులు



- పెనగంచిప్రోలులో ఆలయం వద్ద దారుణం
- గర్భవతి కడుపుపై కాళ్లతో తన్నిన కర్కశులు
- ఒకరి పరిస్థితి విషమం, పలువురికి తీవ్రగాయాలు
- వాహనంపై జై తెలంగాణ అని ఉండటమే నేరం

యథా నేత.. తథా ప్రజ! ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ ఓ సీమాంధ్ర నేత చేసిన ప్రకటనను.. అప్పుడే ఆచరణలో చూపుతున్నారు! గుడికి వచ్చారన్న భావన లేకుండా తెలంగాణకు చెందిన దళితులపై శివాలెత్తారు. కృష్ణా జిల్లాలోని పెనగంచిప్రోలులో ఉన్న తిరుపతమ్మ దేవాలయానికి వచ్చిన వారిపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. మూడు నెలల గర్భిణీని కిందపడేసి కడుపుపై కాళ్లతో తన్నారు! వారు ప్రయాణించిన వాహనంపై ‘జై తెలంగాణ’ అని ఉండటం చూసి.. మీకు తెలంగాణ కావాల్రా.. అంటూ తరిమితరిమి కర్రలు రాడ్లతో తలలు పగులగొట్టారు. ఈ ఘటనలో గర్భిణీ సహా పలువురు తెలంగాణ దళితులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలో దళితుడికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్న నేతలు.. ఈ దళితులపై దాడికి ఏం సమాధానం చెబుతారు? వైషమ్యాలు పెరిగేంత స్థితికి పరిస్థితిని నెట్టేస్తూ ఏసీ గదుల్లో చర్చలు జరుపుతున్న ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారు?

మీకు తెలంగాణ కావాల్రా...? ఇక్కడికి వచ్చి మా మాటలు వినరారా...? మేమేంటో మీకు తెలియదురా...! అంటూ ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేస్తూ... పరుగులు తీస్తున్నా వదలకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మూడు నెలల గర్భవతిని కిందపడేసి తన్నారు. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయిద్దామని కృష్ణా జిల్లా పెనగంచిపోలులోని తిరుపతమ్మ దేవాలయానికి వెళ్లిన తెలంగాణ ప్రాంత దళితులపై జరిగిన దాడి ఇది! వారు ప్రయాణించిన డీసీఎం వాహనానికి ‘జై తెలంగాణ’ అని ఉండటమే నేరమైంది. మానవత్వాన్ని మరచిన ఆంధ్రోళ్లు.. వారి తలలు పగులగొట్టారు. ఢిల్లీలో దళితుడికి అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెడతున్న సీమాంధ్ర పాలకులు దీనికి ఏం సమాధానం చెబుతారో! తమపై జరిగిన దాడి గురించి బాధిత దళితులు టీ న్యూస్‌కు ఫోన్ చేసి వివరాలు తెలిపారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం దళిత కుటుంబానికి చెందిన గాదె సతీష్ కూతురు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు, మొక్కు సమర్పించేందుకు పెనగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవాలయానికి బంధుమిత్రులు దాదాపు 40 మంది శుక్రవారం వెళ్లారు. ఆలయం వద్ద చిన్నారికి తలవెంట్రుకలు తీసిన తరువాత భోజనాలు చేసేందుకు సత్రాల వద్ద పట్టాలు పర్చుతున్నారు. ఈ సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు ఆ పట్టా తమదేనంటూ దళితులతో గొడవకు దిగారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వారి లారీపై ‘జై తెలంగాణ’ అని ఉండటాన్ని గమనించి.. ‘తెలంగాణ నుంచివచ్చి.. మా దగ్గర అధిపత్యం చేస్తార్రా.. కొడుకుల్లారా’ అంటూ కర్రలు, రాళ్ళతో మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో భయపడిన దళితకుటుంబం.. పరుగులు తీసినా.. వెంటపడి మరీ ‘మీకు తెలంగాణ కావాల్రా..’ అంటూ చితకబాదారు.

పెన్‌పాహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నెమ్మాది వెంకన్న ఆయన తల్లి వెంకటమ్మ, మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలెం గ్రామానికి చెందిన నల్లా నరేశ్, నల్లా అరుణలు గాయపడ్డారు. మూడు నెలల గర్భవతి అయిన అరుణను కింద పడేసి కడుపుపై తన్నడంతో తీవ్ర రక్తవూసావం అయ్యింది. వీరిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పవూతికి తరలించారు. ఆస్పత్రిలో ఉన్న బాధితులతో ‘టీన్యూస్’ ప్రతినిధి మాట్లాడారు. సతీశ్ తల్లి పార్వతమ్మ మాట్లాడుతూ... ‘‘అయ్యా నా మనవడు వెంకన్నను, నరేశ్‌ను, అతని పెళ్లాం అరుణను గర్భవతి అని కూడా చూడకుండా కడుపులో తన్నారయ్యా. ఈ ఆంధ్రోళ్లు నా బిడ్డల తలలు పగలగొట్టారయ్యా. అరుణ గర్భంలోని పిండానికి ఏమయిందోనయ్యా’’అంటూ కన్నీరుమున్నీరయ్యారు. వీరి వద్ద ఉన్న 20 వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు, బంగారు గొలుసును దాడికి పాల్పడిన ఆంధ్రోళ్లు లాక్కున్నారు. దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసినట్లు పెనగంచిప్రోలు ఎస్‌ఐ నాగేంద్రకుమార్ ‘టీన్యూస్ ప్రతినిధి’కి తెలిపారు. గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన ఎస్.నాగరాజు, బి.శ్రీను, కుమ్మరి సత్యనారాయణ, మేడ సాంబయ్యలను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లుగా ఆయన తెలిపారు.నట్లుగా ఆయన తెలిపారు.

Curtesy: Namsthe Telangaana

యుద్ధంలో చనిపోయిన సైనికుడి శవాన్ని సైతం బంధువులకు అప్పగించడం నీతి. అలాంటిది శవాన్ని బంధువులకు కూడా అందకుండా స్మశానానికి పంపించమని ఉత్తరం రాసిన చెత్త వెధవను చెంప మీద కొట్టడం దళితుల మీద అత్యాచారంగా చిత్రించి గుండెలు బాదుకుంటున్న మంద కృష్ణ, గద్దర్, కొందరు సీమాంధ్ర సమైక్యవాదులు దీన్ని ఏమటారో మరి! 

KCR, తెలంగాణా


కొంతమంది సీమాంధ్ర సమైక్య వాదులు ఉదారమైన వాదనలు చేస్తున్నట్టు కనపడుతూనే KCR ని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తుంటారు. ఆయనను ఒక అవినీతి పరుడిగా, ఇంకోలా, ఇంకోలా చిత్రించడం ద్వారా తెలంగాణా ఉద్యమాన్ని చిన్న బుచ్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారికి ప్రతి సందర్భంలోనూ సమాధానాలు చెపుతూనే వస్తున్నా కూడా ఇంకా ఇలాంటి వాదాలు మళ్ళీ మళ్ళీ వినబడుతూనే వున్నాయి.

KCR మిగతా అందరిలానే ఒక రాజకీయ నాయకుడు. ఒక లగడపాటి, ఒక పయ్యావుల, ఒక చంద్రబాబు, ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక చంద్రబాబు, ఒక పొన్నం ప్రభాకర్, ఒక జగన్... వీళ్ళందరికి ప్రజల మీద ఎంత నిబధ్ధత వుందో కేసీయార్‌కి కూడా అంతే వుంది. వాళ్ళందరికీ నిబద్ధత వుంది అని విమర్శకులు భావిస్తే KCR కి కూడా వుందని చెప్ప వలసి వుంటుంది. వాళ్ళకు లేదంటే వారి లాంటి రాజకీయ నాయకుడే అయిన KCR ఒక్కడికే ఎందుకు వుండాలని అనుకోవాలి?

ప్రజల్లో తెలంగాణా ఉద్యమం వుంది కాబట్టే KCR ఉద్యమంలో వున్నాడు. లేకపోతే ఆయన ఏ కాంగ్రేసులోనో, TDPలోనో చేరే వాడు. KCR సర్వసంగ పరిత్యాగిలా మొత్తం జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణా సాధనకే అంకితం చేసాడని ఎవ్వరూ తెలంగాణలో అనుకోవడం లేదు.

అయితే తెలంగాణా వుద్యమంలో KCR పాత్రని కూడా తీసి పారవేయలేం. ఒక కంపెనీలో పని చేసే ఉద్యోగి తన జీతం తీసుకుంటూనే కంపెనీ అభివృధ్ధికి ఎలా తోడ్పడతాడో, KCRకి ఉద్యమంతో వుండే సంబంధం కూడా అలాంటిదే. కంపెనీలో పనిచేసి జీతం తీసుకున్నంత మాత్రాన, ఉద్యోగి కంపెనీ అభివృద్ధి కోసం చేసిన సేవలు గుర్తించకుండా ఉండలేం. అలాగే KCR కి కూడా సొంతలాభం కొంత ఉన్నంత మాత్రాన తెలంగాణా రాష్ట్రం కోసం అతని వంతు కృషిని గుర్తించ కుండా ఉండలేం. ఆయన కొన్ని పొరపాట్లు చేసే ఉండ వచ్చు గాక. కాని ఆయన చేసిన పొరపాట్ల కన్నా ఉద్యమ నిర్మాణంలో ఆయన పాత్ర ఎక్కువగా వున్నప్పుడు దాన్ని తప్పకుండా గుర్తించ వలసిందే. ఇక పోరాపాట్లంటారా, ఏదన్నా పని చేసేవాడే కదా పొరపాట్లు చేసేది?

ఇకపోతే KCR కి తెలంగాణా ఇస్తే మొత్తం కైంకర్యం చేస్తాడన్నట్టు కొంత మంది మాట్లాడు తుంటారు. అక్కడికి ఇప్పుడున్న నాయకులు అంటా పప్పు సుద్దలినట్టు, నోట్లో వేలు పెడితే కూడా కోరక లేనట్టు. మరి వాస్తవం చూస్తె మరోలా వుంటుంది. రాష్ట్రంలో ఇంకోవైపులో ఉన్న నాయకులు ఒక్కొక్కడు లక్షల కోట్లు దిగమింగి రాజకీయాన్ని, వ్యాపారాన్ని ఏకం కాహేసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన వారు. మరి అలాంటి సజీవ మూర్తులను తమ నాయకులుగా కలిగి ఉన్నవారు, తెలంగాణా నాయకుల మీద, వారి పని తీరు మీద అనుమానాలు వ్యక్తం చేయడం అవిటివాడు గూని వాణ్ని ఉద్దేశించి నవ్వినట్టు ఉంటుంది.

తెలంగాణా రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం KCR మాత్రమే పరిపాలిస్తాడనుకుంటే అది సదరు విమర్శకుల అఙ్ఞానం మాత్రమే. అందరిలానే ఆయన పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి. అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఎలా ఎన్నుకుంటారో ఇక్కడా అలాగే ఎన్నుకుంటారు. మొదట్లో అభిమానం ఉండవచ్చు. ఏం, NTR ని అభిమానంతో గెలిపించలేదూ? తర్వాత తర్వాత మాత్రం పని తీరుని బట్టే ఫలితాలు వుంటాయి.

ఏ నాయకున్నైనా కట్టడి చేయాలంటే ప్రజలు అప్రమత్తంగా వుండడం, లోక్ పాల్ వంటి బిల్లులు తేవడం మినహా మరో మార్గం లేదు. విభజన జరగడం వల్ల వచ్చే ముఖ్యమంత్రి కేవలం తెలంగణా అభివృధ్ధి కోసమే నిర్ణయాలు తీసుకో గలుగుతాడు (అందులో తన కమీషన్లపై ఆశ ఉన్నా సరే). అంటే గానీ తెలంగాణా నీటిని మళ్ళించడం, తెలంగాణా ఉద్యోగాలను మళ్ళించడం చేయలేడు కదా?

కాబట్టి ఇలాంటి విమర్శలు చేసేవారు గుర్తించ వలసిన మొదటి విషయం తెలంగాణా అంటే KCR మాత్రమే కాదు. తెలంగాణా ఉద్యమం లో KCR కూడా ఒక భాగం. తెలంగాణా ఉద్యమం KCR ఆపితే ఆగేది కాదు. డిసెంబర్ 2009 లో KCR దీక్ష విరమించినట్టు వార్తలు వచ్చిన వెంటనే ప్రజాగ్రహం పెల్లుబికి KCR దిష్టిబొమ్మలకు శవయాత్రాలు నిర్వహించిన వైనం KCR గాని, సదరు విమర్శకులు కాని మరిచి పోకూడదు.

సమాచార విప్లవం ఉచ్ఛదశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటి ప్రజా ఉద్యమం 1969 లాగా లక్ష్యాన్ని చేరకుండా ఆగుతుందని అనుకునే వారిది కేవలం భ్రమే అవుతుంది.

Friday, July 22, 2011

యాదిరెడ్డీ, నీకు నా ఉద్యమాంజలి

ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కనీ వినీ ఎరగని విధంగా తెలంగాణా ఉద్యమంలో ఆత్మహత్యలు ఒక పోరాట రూపాన్ని సంతరించు కోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇతరుల ప్రాణాలు తీయడం కన్నా తనను తానూ ఆత్మాహుతి చేసుకోవడానికి ఎక్కువ తెగువ అవసరం. తన ప్రాణాన్ని తృణప్రాయంగా తలచిన వాడు ఏమైనా చేయగలడు. కాని తెలంగాణా పోరు బిడ్డలు తమ ప్రాణ త్యాగాల ద్వారా వారి ప్రఘాఢమైన ఆకాంక్షను ప్రపంచానికి తెలియబరుస్తున్నారు తప్ప చీమకు కూడా హాని తలపెట్టడం లేదు.

పరిస్థితులు ఇలా వుంటే సీమాంధ్ర మీడియా మాత్రం ప్రతీరోజూ తెలంగాణా వాదులు నరుకుతున్నట్టుగా, చంపుతున్నట్టుగా అసత్య ప్రచారాలు చేస్తుంది. ఎప్పుడో ఎవరో ఆవేశంలో ఏదో మీటింగులో ఏదో అనడం అంతటా జరిగేదే. సమైక్యాంధ్ర వాదం చేసే పయ్యావుల ఆత్మాహుతి దాడుల గురించి మాట్లాడినపుడు తెలంగాణా వారు ఎప్పుడో 'జాగో భాగో' అని అన్న దాన్ని మరిచి పోకుండా దాదాపు ప్రతి రోజూ, ప్రతి సీమాధ్ర మీడియాలోనూ చర్విత చర్వనంగా ప్రచారం చేస్తుంటారు.

ఈ పక్షపాత మీడియా మాయాజాలంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వ సీమాంద్ర పక్షపాతంతో, తెలంగాణా ప్రజా ప్రతినిధుల అలసత్వంలో, సీమాంధ్ర నాయకుల కుతంత్రాల మధ్యన, కేంద్ర ప్రభుత్వం చేతగాని తనం నేపథ్యంలో మరో తెలంగాణా బిడ్డ నేల రాలాడు. తన గొంతు డిల్లీలో వినిపించడానికి డిల్లీ వెళ్లి మరీ ఉరిపోసుకుని చనిపోయాడు. 

ఎక్కడో న్యూయార్కులోనో, ఆస్ట్రేలియాలోనో ఎవడైనా తెలుగోడు చనిపోతే పుంఖాను పుంఖాలుగా ప్రసారాలు చేసే సీమంధ్ర మీడియా కనీసం యాదిరెడ్డి మరణ వాంగ్మూలాన్ని, దానిలోని వివరాలను ప్రసారం చేసిన పాపాన పోలేదు. తన ఉత్తరంలో తెలంగాణా ద్రోహులని తన పది పేజీల లేఖలో పేరు పేరునా ఉదాహరించిన యాదిరెడ్డిది, ఏదో సాదా సీదా ఆత్మహత్య అని ఎలా అనుకోగలం?

యాదిరెడ్డి మరణం, డిల్లీని ప్రభావితం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయని కుట్రలేదు. ఆంధ్ర ప్రదేశ్ భావంలో యాదిరెడ్డి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిద్దామనే తెలంగాణా వాదుల, ప్రజా ప్రతినిధుల ఆలోచనలకు విరుద్ధంగా చకచకా పావులు కదిపింది. ఏపీ భవన్లో ఉన్న చందర్రావు అనే సీమాంధ్ర తైనాతీతో గలీజు ఉత్తరం ఒకటి రాయించింది. పోస్టుమార్టం చేసిన ఆస్పత్రి నుంచి కనీసం అక్కడున్న ఎంపీలకు, మంత్రులకు కూడా తెలియకుండా ఎకాఎకీ స్మశానానికి తరలించమనే దాని సారాంశం.

దొంగల్లాగా భౌతిక కాయాన్ని స్వంత ఊరు పెద్దమంగళారం తలలించారు. ఆ సమయంలో శంషాబాద్ ప్రాంతం అంటా కరెంటు తీసేశారు. 

తెలంగాణా వాదాన్ని, తెలంగాణా వాదులను చూసి ఇంత అదురుకునే ఈ సమైక్యవాద ప్రభుత్వం ఇంకేన్నాల్లో నిలబడే అవకాశం గాని, అర్హత గాని ఇంకెంతమాత్రం లేదు.

యాదిరెడ్డీ, నీ త్యాగం ఊరికే పోదు. తెలంగాణా రాష్ట్రం వచ్చి తీరుతుంది.


Thursday, July 21, 2011

అన్నన్నా! కసబెక్కడ? పయ్యావులెక్కడ?


పయ్యావుల ఆత్మాహుతి దాడులు చేస్తాడట! ఎందుకు? సమైక్యాంధ్ర కోసం. ఆత్మాహుతి దాడులంటే మనకు తెలిసింది మానవ బాంబులనే గదా! లేక పయ్యావుల దృష్టిలో ఇంకేమైనా వుందా? మరి మానవబాంబు ఎవరి మీద ప్రయోగిస్తాడు? KCR? KTR? హరీష్ రావ్? ఆయన చెప్పలేదు. తెల్లారాక మాత్రం వివరణ ఇస్తూ తాను ఆత్మాహుతి దాడి అన్నది కేంద్రానికి వ్యతిరేకంగా అని చెప్పాడు.

కేంద్రం అంటే ఎవరు? మన్‌మోహన్? చిదంబరం? ప్రణభ్? కాక వీరందరినీ నడిపిస్తున్న సోనియా? లేకపోతే కేంద్ర క్యాబినెట్ మీటింగు జరుగుతుంటే ఏకంగా మధ్యలోకి వెళ్ళి దూకుతాడా? ఏమో, ఆయనకే తెలియాలి మరి!

పొద్దున ఒక పత్రికలో 'పయ్యావుల కసబ్' అని రాయటం చూసాను. అయినా కసబ్‌కీ వీరికీ పోలికేమిటి? ఒకడేమో తిండికి గతిలేక మూడు లక్షల డబ్బులు వస్తే కుటుంబానికేమైనా ఉపయోగ పడతాయేమోనని ఆశపడి టెర్రరిస్టుల వలలోపడి మానవ బాంబుగా మారినోడు. ఇంకోడు ఫ్యాక్షనిస్టు సెటిల్మెంట్లకు, రాజకీయ పైరవీలకు మరిగి పందికొక్కులా బలిసినోడు. తెలంగాణా రక్తాన్ని తేరగా పీలుద్దామనుకునే జలగల గుంపుకు చెందినోడు లేదా నాయకత్వం వహించే వోడు.

మరి వాడికీ, మన నేత గారికి పోలిక పెడితే ఎంత అవమానం? ఈయనముందు కసబెంత? కసబ్ గాడికి తనేంటో, తన పోరాటమెందుకో తెలువదు. మతోన్మాదులు ఏం చెప్తే అది చేసాడు. మరి మన నేతకో! తన ఆరాటం పొరుగు ప్రాంతాన్ని ఎల్లకాలం దోచుకోవడానికి వేసే పూలబాట అని తెలుసు. కాబట్టి మన పయ్యావుల గారిని కసబ్ తో పోల్చి చిన్నబుచ్చకండి. పాపం, బాధ పడతాడు.

Tuesday, July 19, 2011

తెలంగాణ ఉద్యమం - తెహెల్కా అధ్యయనం

‘సమైక్యాంధ్ర’..స్వార్థ రాజకీయ శక్తుల ఆట స్థలం
- అక్కడ విద్యార్థుల స్పందన నామమాత్రం
- విభజనతో తేడా ఉండదనే అభిప్రాయం
- ఉద్యమాల తీరుపై ‘తెహెల్కా’ ప్రత్యేక కథనం


తెలంగాణ ఉద్యమం కోసం ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు తెగించి కొట్లాడుతున్నారు. దశాబ్దాల దోపిడీ, ఆధిపత్యం నుంచి విముక్తి కావాలని ఆరాటపడుతున్నారు. ఈ ఉద్యమంలో ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిక్కచ్చిగా విప్లవిస్తున్నది విద్యార్థి లోకం. మిలిటెంట్ పోరాటస్ఫూర్తితో ముందుకురుకుతున్నది. పోరాడితే పోయేదేమీలేదు పీడన, వివక్ష తప్ప అని లోకానికి ఎలుగెత్తి చాటుతోంది. ఔను.. విద్యార్థులకిది జీవన్మరణ పోరాటం. తెలంగాణలోని విద్యార్థులంతా మన రాష్ట్రం - మన పాలన కోసం విరామం లేకుండా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. ఇప్పుడొక్కటే లక్ష్యం.. జై తెలంగాణ! ఇది ఇక్కడి.. తెలంగాణ విద్యార్థి పరిస్థితి. మరి.. అటుపక్క.. సమైక్య వుద్యమంలో ఏం జరుగుతోంది?.. అక్కడి విద్యార్థులు కూడా ఇక్కడి విద్యార్థులలాగే ఉద్యమిస్తున్నారా?.. సమైక్యాంధ్రప్రదేశ్ కొనసాగాలని కోరుకుంటున్నారా?.. తెలంగాణ వేరైతే ఏవో ఉపద్రవాలు జరిగిపోతాయని ఆందోళన చెందుతున్నారా, దానివల్ల నష్టమేమీ ఉండదు, ఉద్యమాలు అనవసరమని అనాసక్తి ప్రదర్శిస్తున్నారా?.. ప్రముఖ ఆంగ్ల వారపపత్రిక ‘తెహెల్కా’ ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించి విశ్లేషించింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఆకాంక్ష బలంగా ప్రస్ఫుటమవుతుంటే సమైక్యాంధ్ర ఆందోళనలో అలాంటిదేమీలేదని తెహెల్కా ప్రతినిధి సాయి మనిష్ తాజా సంచికలో (జూలై 23, 2011) అభివూపాయపడ్డారు. తెహెల్కా సౌజన్యంతో ఆ కథనాన్ని ప్రచురిస్తున్నాం.


తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన జానా బాయ్ అనే ఓ గిరిజన బాలిక తనను తాను కాల్చుకుంది. 80 శాతం కాలిన గాయాలయ్యాయి. అదే విధంగా, మెహిదీపట్నానికి చెందిన 19ఏళ్ల అరిగె సరిత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ముఖ్యమంత్రి రోశయ్య, చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని తన ఆత్మహత్య నోట్‌లో నిందించింది. తెలంగాణ ఉద్యమ నిజమైన సారథులు విద్యార్థులేననడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇంతటి విద్యార్థి శక్తి కనిపించదు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో తెలంగాణ ఆందోళనకు వ్యతిరేకత నామమాత్రమే. కిందటివారం సమైక్యాంధ్ర సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాజకీయ కారణంతో కాకుండా క్యాంపస్‌కు సంబంధించిన సమస్యలపై నిరసన అది. ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన 250 ఎకరాల భూమిని ప్రైవేటు డెవలపర్లకు అమ్మడాన్ని వారు వ్యతిరేకించారు.

పదవీకాలం ముగిసిపోయిన మాజీ వైస్ చాన్స్‌లర్ బంగళాను ఖాళీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్కడే.. తమ ఫీజుల మొత్తాన్ని తమకు తిరిగి చెల్లించాలంటూ 15 మంది ఓబీసీ విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ ముందు నినాదాలు చేశారు. ‘‘సమైక్యాంధ్ర ఆందోళనలో మేము తర్వాత చేరతాం. ఇప్పుడైతే నా ఫీజు నాకు తిరిగి ఇవ్వాలి’’ అని నర్సీపట్నానికి చెందిన జగదీష్ అన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో, తెలంగాణవ్యాప్తంగా నిరసనలు ఊహించని స్థాయిలో ఊపందుకుంటుంటే,సమైక్య వాదులు  దానికి వ్యతిరేకంగా గొంతు వినిపించేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా సఫలం కావడంలేదు. తెలంగాణ ఉద్యమాన్ని తిప్పికొట్టడంలో, అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. ఆంధ్రా విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండేందుకే ఇష్టపడుతున్నారనడానికి మరో దృష్టాంతం రిటైర్డ్ ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ జాకబ్ శాస్త్రి నిర్వహించిన కార్యక్షికమం.


సమైక్యాంధ్ర కోసం కొందరు విద్యార్థులు తప్ప వేరే గళాలే వినిపించడం లేదనే అభివూపాయంతో భావసారూప్యమున్న అధ్యాపకులతో కలిసి ఆయన సమైక్యాంధ్ర ఫోరమ్ ఏర్పాటు చేశారు. ఒకరోజు ఆయన నిర్వహించిన కార్యక్షికమానికి బస్సు నిండా అధ్యాపకులొచ్చారుగానీ, ఒకరిద్దరు విద్యార్థులు కూడా అందులో పాలుపంచుకోలేదు. సమైక్యాంధ్ర కోసం పకడ్బందీగా బంద్‌లు నిర్వహించాలనుకున్నా ఆ ప్రయత్నాలకూ సీమాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి పేలవమైన ప్రతిస్పందనే వచ్చింది. జూలై 8న గుంటూరుకు సమీపంలోని ఒంగోలులో గుప్పెడు మంది విద్యార్థులే ప్రదర్శన నిర్వహించారు. అదే రోజున గుంటూరులో సమైక్య ఆంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన బంద్ పిలుపును ఎవరూ పట్టించుకోలేదు. విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు తెరిచే ఉన్నాయి. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌కు ఆంధ్రలో ప్రత్యామ్నాయ రాజధాని నగరంగా పేర్కొనే గుంటూరు నగరంలో పరిస్థితి ఇది.

సమైక్యాంధ్ర ఉద్యమం అనేది స్వార్థపర రాజకీయ శక్తులకు ఆటస్థలంగా మారినట్టు కనిపిస్తోంది. అట్టడుగున మారుమూలల నుంచి బలంగా పెంపొందిన తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలవడం అయ్యేపనికాదు. ‘‘లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, జేసీ దివాకర్‌డ్డి లాంటి రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించడానికి ఇక్కడ ఆందోళనలను రేకెత్తిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రానికి మేము వ్యతిరేకమైనప్పటికీ, ఇలాంటి ఆందోళనలు పెద్దగా ఫలితమిచ్చి ఉపయోగపడేవి కావు. అందుకోసం మా అవకాశాలను పోగొట్టుకోవడంలో ఔచిత్యం లేదు’’ అని ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి భాస్కర్ ముద్దా అభిప్రాయపడ్డాడు.ఆంధ్రా ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఉద్యోగావకాశాలను పొందడంలో ముందుంటారు.

వివిధ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఎక్కువ సంఖ్యలో చేరుతుంటారు. సముచిత విద్యా, ఉద్యోగ అవకాశాల దృష్ట్యా వారికి ఆందోళనల్లో పాల్గొనాల్సిన అవసరం కనిపించడం లేదు. సామాజిక శాస్త్రవేత్త సి.లక్ష్మణన్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘సుఖ సంతోషాలతో విలసిల్లే అవకాశాలున్నప్పుడు ఉద్రిక్తతలను రేకెత్తించడంగానీ, ఒక రాజకీయ కారణం కోసం యువతను సమీకరించడంగానీ కష్టతరం- అదెంతటి గొప్పదైనా సరే. విభజన అనేది వారికి పెద్ద తేడాగా ఏమీ అనిపించదు’’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. భవిష్యత్తు ఆందోళనకరమై, వర్తమానంలో వివక్షకు గురయ్యే యువతరం ప్రవర్తనా వేరే విధంగా ఉంటుంది.

వరంగల్‌లో ఓ విద్యార్థి కసితో రాయి విసురుతాడు. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోనూ అలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. ఈ ఆందోళనల్లో చాలామంది ఆర్ట్స్ విద్యార్థులే ఉంటారనుకుంటారు. కానీ, 28 ఏళ్ల వెంకట్ రాథోడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి. లెక్చరర్ ఉద్యోగం కోసం చైతన్య కళాశాలకు వెళితే, వరంగల్‌కు చెందిన వాడినని తెలియగానే జీతం, పని విషయంలో తేడా చూపారని తెలిపాడు. తరగతి గదుల శుభ్రతను కూడా పర్యవేక్షించాలని చెప్పారు. రూ.6వేల జీతానికి రోజుకు 12 గంటలు పనిచేయాల్సి వచ్చింది. ఒకరోజు దానికి వీడ్కోలు పలికి తెలంగాణ ఉద్యమంలో చేరిపోయాడు. మీడియా రంగంలోనూ ఇలాంటి వివక్షే ఉందని జయప్రకాశ్ చెప్పాడు. తెలంగాణ విద్యార్థులు ప్రాంతం ప్రాతిపదికన కొనసాగుతున్న వ్యవస్థాపరమైన వివక్షకు వ్యతిరేకంగా మండిపడుతున్నారు. ఈ పోరాటం తీరే వేరు. మరోవైపు కరంటు షాకులిస్తే శవం మళ్ళీ ఊపిరి పోసుకుంటుందేమో అన్నట్టుగా ఉంది సమైక్యాంధ్ర ఉద్యమం పరిస్థితి. తెలంగాణ విద్యార్థులు ఉద్యమాగ్నికి ఇంధనమవుతున్నారు. దశాబ్దాలుగా కాగడాలుగా వెలుగుతున్నారు.

Curtesy: Namsthe Telangana

Monday, July 18, 2011

TG వెంకటేష్, జాగ్రత్త!



TG వెంకటేష్ సీమాంధ్ర సేన అని ఒక దళాన్ని తయారు చేస్తున్నాడట. అలాగే కోస్తా వారు కూడా దళాలు తయారు చేసుకొమ్మని అతని ఉవాచ. తనకు ఒక రోజు హోం మినిస్టర్ పదవి ఇస్తే తెలంగాణాను కట్టగట్టి అండమాన్ పంపిస్తాడట.

సమైక్యవాదమంటే పొరుగు ప్రాంతంలో ముష్కర మూకలను ఉసిగొల్పి భయభ్రాంతుల్ని చెయ్యడమన్న మాట! పదవుల్ని అడ్డం పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్న ప్రజల్ని జైల్లలో తోసి రాక్షసంగా అణచి వెయ్యడమన్న మాట. సమక్యవాద సిద్ధాంతమే వేరొక ప్రాంతంపై దోపిడీ, గుత్తాధిపత్యాన్ని లక్ష్యాలుగా చేసుకొని ఊపిరి పోసుకున్నప్పుడు వారి ఆలోచనలు ఇంతకన్నా గొప్పగా ఉంటాయనుకోవడం ముర్ఖత్వమే.

టీజీ, బతకడానికి నువ్విక్కడికొచ్చావు గానీ, మేం నీదగ్గరికి రాలేదని తెలుసుకో. అరవయ్యేళ్ళక్రితమే ఆబాల గోపాలం గుత్తపెత్తందార్లకు, వారి తొత్తు సైన్యాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసి మట్టి కరిపించిన జాతి మాది. నువ్వు బిర్యాని పొట్లాలు, సారా ప్యాకెట్లు ఇచ్చి తయారు చేసిన కిరాయి సైన్యాలను ఎంత మందిని పంపుతావో పంపు. నిన్ను, నీ సైన్యాలను మళ్ళీ మావైపు చూడలేని విధంగా బుధ్ధిచెప్పి గూడ్సు బండిలో ప్యాక్ చేసి కర్నూలుకు పంపుతాం జాగ్రత్త!

Saturday, July 16, 2011

ఒక ఉద్యమం, ఒక కాపీ ఉద్యమం

సమైక్యవాదులు తెలంగాణా ఉద్యమాన్ని అవహేళన చేయడానికి ఒక్క రాయి కూడా విసరకుండా వదలరు. తెలంగాణా వారు ఏమి చేసినా వారికి తప్పులాగే కనబడుతుంది. అదే పని వారు చేస్తే మాత్రం అది తప్పు కాదు వారి దృష్టిలో.

తెలంగాణా JACకి కోదండరాం గారిని చైర్మన్ గా పెట్టుకుంటే, ప్రొఫెసర్లేమిటి, పాఠాలు చెప్పుకోకుండా ఉద్యమాలేమిటి అని అడుగుతారు. కాని పోటీగా వారు కూడా ఒక కాపీ JACని ఏర్పరచుకొని దానికి కూడా ప్రొఫెసర్నే చైర్మన్ గా పెట్టుకుంటారు. అయితే ఆ JAC పిలుపునిస్తే ప్రజలెవరైనా కదులుతున్నారా, లేదా అనేది వేరే సంగతనుకోండి.

తెలంగాణా వారు విజయవంతంగా వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తే అదేంటి? రొద్లమీద వండుకు తింటారు! అని ఆశ్చర్యం వెలిబుచ్చుతారు. కాని అదే కార్యక్రం జిరాక్స్ చేసినట్టుగా కాపీ చేసి తమ ప్రాంతంలో నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. ఘోరమైన విషయం ఏమంటే, ఆ కార్యక్రమాలకు ప్రజాదరణ లభించకున్నా కూడా విజయవంతం అయ్యాయని చెప్తూ, తెలంగాణా వారు నిర్వహించిన కార్యక్రమాల ఫొటోలను మక్కీకి మక్కీ తమవిగా పబ్లిష్ చేసి ప్రజలను నమ్మింప చూస్తారు.

గతంలో రాజీమాలు చేయాలని రాజకీయ నాయకులను తెలంగాణా వారు ఘెరావ్ చేస్తే అభ్యంతర పెట్టారు. ఇప్పుడు అవే పనులు వారు చేస్తున్నారు, కాకపోతే వారి నాయకులే రాజీనామాలకు సిద్ధంగా లేరు.

ప్రజల మద్దతు లేకపోయినా దోపిడీలు చేసి సంపాదించిన డబ్బు బలం గలవారు ఇలాంటి ఉద్యమాలను ఎంత కాలం నడపగలరో చూడాలి. ఏ వ్యాపారి అయినా తన డబ్బుకు ఎప్పటికైనా లాభం వస్తుందనుకుంటేనే పెట్టుబడి పెడతాడు. నష్టం తప్ప లాభం లేదనుకున్నప్పుడు అంతే వేగంగా పెట్టుబడులు ఉపసంహరించుకుంటాడు.

Friday, July 15, 2011

వీరీ వీరీ గుమ్మడిపండూ వీరిపేరేమి?

సమైక్యవాదులు ఎంతసేపూ కలిసి వుండాం అంటారే కానీ రాష్ట్రం విడిపోతే ఏం సమస్యలున్నాయో చెప్పండి. కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అంటే చెప్పరు. బహుషా అవి పైకి చెప్పుకోలేని సమస్యలయ్యుంటాయి.

మిగతా సమస్యల మాట ఎలా వున్నా, వారికి ఒక సమస్య మాత్రం వుంటుంది. అదే పేరు సమస్య. విడిపోతే తెలంగాణా రాష్ట్రానికి పేరు 'తెలంగాణా' అని ఇప్పటికే నిశ్చయం. కాని ఆంధ్రా పరిస్థితి అలా వుండక పోవచ్చు.

ఒకప్పుడు ఆంధ్రరాష్ట్రంగా మూడేళ్ళు వున్న రాష్ట్రానికి అదే పేరు గాక మరేముంటుంది అనే ప్రశ్న రావచ్చు. కాని అక్కడే వుంది కీలకం. అప్పుడు రాజధాని కర్నూలులో వుంది. ఇప్పుడు కోస్తా వారు రాయలసీమలో రాజధాని పెట్టడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు TG ఎంత మొత్తుకున్నా.

కాబట్టి రాయలసీమ వారు రాష్ట్రం పేరులో తమ ముద్ర వుండాలని కోరుకోవచ్చు. అప్పుడు ఏం పేరు పెట్టాలి?

సీమాంధ్ర
ఆంధ్ర రాయలసీమ
రాయలసీమాంధ్ర
సీమకోస్తా

ఇలాంటి పేర్లు మరికొన్ని కూడా ఊహించొచ్చు. అయితె సమస్య ఇక్కడితో ఆగిపోలేదండోయ్! ఇప్పుడు కొత్తగా ఉత్తరాంధ్రులు కూడా చైతన్యవంతం అవుతున్నారు. వారికీ identity crisis వుంది. రాష్ట్రం పేరులో తమ ముద్ర వుండాలని వారు కూడా కోరుకోవాలని అనుకోవడంలో తప్పు లేదుకదా? అప్పుడు మరికొన్ని పేర్లు వస్తాయి.

కళింగాంధ్రసీమ
రాయలసీమ కళింగ కోస్తా
కోస్తాసీమకళింగ
సీమాంధ్ర కళింగ
కళింగసీమకోస్తా

ఇలాగన్న మాట! ఈ విధంగా దాదాపు రెండు డజన్లవరకూ పేర్లు చెప్పుకునే అవకాశం వుంది. వాటిల్లో ఏదో ఒకటి నిర్ణయించు కోవచ్చు.

కానీ ఇంతా చేసి ఏదో ఒక పేరు పెట్టినా, 'ఫలానా' వారు దాన్ని ఎంతవరకు ఒప్పుకుంటారన్నదే అసలు సమస్య! మరి వారికి రాష్ట్రం అంటే మేం, మేమంటేనే రాష్ట్రం అని విపరీతమైన నమ్మకమాయె! అందుకని పై పేర్లన్నీ పోయి ఈ క్రింది పేరు పెట్టినా ఆశ్చర్యం లేదు.

గోదావరికృష్ణాగుంటూ

గుంటూ యేమిటి అనకండి. అది అప్పుతచ్చు కాదు అరజిల్లాయే! దానికి అంతకన్నా సీను లేదు మరి!
 

లగడపాటి మాటలు, తెలంగాణా ఏర్పాటు సంకేతాలు

లగడపాటి హఠాత్తుగా జగన్‌పై వ్యాఖ్యలు చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది. అదీ ఎప్పుడో అడుగున పడ్డ YSR హెలికాప్టర్ ప్రమాదం విషయాన్ని బయటకు తీసి, ఆ ప్రమాదం సూత్రధారి జగనే అనీ సూత్రీకరించాడు.

వర్షం వస్తున్నప్పుడు వెళ్ళొద్దని విజయమ్మ అంటే అనుండొచ్చు. ఏ భార్యైనా అలా ఆదుర్దా పడడం సహజం. అంత మాత్రాన ప్రమాదం శంకించిందని కాదు. వాతావరణం బాగా లేనప్పుడు కుటుంబ సభ్యులెవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి మామూలుగా జరిగే సంభాషణలే. అదే విషయాన్ని కొంత ఎమోషనల్‌గా విజయమ్మ వారి పార్టీ ప్లీనరీలొ చెప్పారు.

మరి ఇంత చిన్న విషయం మన మహాఙ్ఞాని అయిన లగడపాటి దీనివెనుక జగన్‌మోహన్ రెడ్డి ఉండొచ్చని ప్రకటించేలా, దానిపై CBI ఎంక్వైరీ కోరేలా ఎందుకు పురి కొల్పింది?

ఎలాగూ కోడిగుడ్డుపై ఈకలు పీకడం మన లగడపాటి గారికి అలవాటేగా అని దీన్ని తీసి పారేయలేం. ఈయన తనను తాను సింబల్‌గా అభివర్ణించుకున్న సమైక్యవాదాన్ని పక్కకు పెట్టి హటాత్తుగా జగన్ వెంట ఎందుకు పడాల్సి వచ్చింది?

ఆలోచించి చూస్తే ఈ విషయం సులభంగానే అర్థమౌతుంది. ఒకవైపు తెలంగాణా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. తెలంగాణాలో రాజీనామా చేసిన ప్రజా ప్రతినిధుల దీక్ష, తెలుగుదేశం ప్రతినిధుల బస్సుయాత్ర, JAC పిలుపునిచ్చిన బంద్‌లూ, రైల్‌రోకోలూ పూర్తిగా విజయవంతం అయ్యాయి.

దీక్ష విజయవంతం అయిన ఉత్సాహంలో కాంగ్రెస్ వారు ఆగస్టు ఒకటిన రెండు మిలియన్ జనంతో హైదరాబదు దిగ్బంధిస్తామని ప్రకటించారు. KCR దీక్షా శిబిరానికి వచ్చి వారికి సంఘీభావం తెలుపడం కూడా వారికి ఊపునిచ్చింది. ఒక్క TRS పార్టీ తలపెట్టీన మహాగర్జన కొరకే రెండున్నర మిలియన్ల ప్రజలు వచ్చిన నేపథ్యంలో, ఈ రెండు పార్టీలు కలిస్తే రెండేం ఖర్మ, ఐదు మిలియన్ల మంది నైనా తీసుకు రాగలరు. ప్రజలు కూడా అదే ఊపు మీద ఉన్నారు. ఇక వీరితో తెలంగాణా తెలుగుదేశం నాయకులు కలిస్తే ఇక చెప్పనవసరం లేదు.

దీనికి తోడు తెలంగాణాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు సార్వత్రిక సమ్మెకు నోటీసు ఇచ్చాయి. అంటే ఆగస్టు ఒకటి తర్వాత తెలంగాణా పూర్తిగా స్థంభించి పోతుందని ఎవరికైనా అర్థం అవుతుంది. ఇప్పటికే తెలంగాణా ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి వున్నారు.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, కేంద్రం తెలంగాణా ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం కాదనలేం. గతంలో కూడా రేపు హైదరాబాదు దిగ్బంధిస్తాం అన్నప్పుడు, ముందురోజు అర్ధరాత్రి కేంద్రం ప్రకటన చేయడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి.

ఇక సమైక్య వాదుల ఉద్యమాలు చూద్దామా అంటే అవి ఉత్తుత్తివే అని తేలిపోయింది. ప్రజల సపోర్టు వాటికి ఎప్పుడూ లేదు. ఇప్పుడు నాయకుల సపోర్టు కూడా కనిపించడం లేదు. జగన్ ప్రభంజనం భయంతో ఒక్క సీమాంధ్ర MP, MLA కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా లేడు.

ఈ నేపధ్యంలో ఇక విడిపోవడం తప్పదని తెలుసుకున్న లగడపాటి తన సమైక్య వాదాన్ని కాస్త పక్కకు పెట్టి, ఆంధ్రా ప్రాంతంలో ముఖ్యమంత్రి పదవికి ఏర్పాట్లు చేసుకునే ఆలోచనలో పడ్డాడని ఆయన తాజా స్టేట్‌మెంటు చూసిన వారికెవరికైనా అర్థమౌతుంది. ఇప్పుడు అధిష్టానం మెప్పు పొందాలంటే జగన్‌ని తిట్టడమే ఉన్న ఏకైక మార్గం అనేది బహిరంగ రహస్యమే కదా! అదే పని లగడపాటి చేయడంలో ఆశ్చర్య మేముంది?

ఎప్పుడూ జోస్యాలు చెప్పే మన సీమాంధ్ర Octopus లగడపాటి రాజగోpaul, ఇలా పరోక్షంగా తెలంగాణా ఏర్పాటుపై జోస్యం చెపుతున్నాడన్న మాట!

Wednesday, July 13, 2011

రాష్ట్రం ఏర్పరచడం కన్నా ప్రత్యామ్నాయం లేదు

ఏకాభిప్రాయం లేకుండా  తెలంగాణా అసాధ్యమని గులాంనబీ ఆజాద్ చెప్పడం ఒట్టి దివాళాఖోరు వాదన. రాష్ట్రాలలో ఏకాభిప్రాయాలు రావు కనుకనే విభజనాధికారాలు పార్లమెంటుకు దఖలు పర్చారు రాజ్యాంగ నిపుణులు. ఒకరు విడిపోతాం అని, ఇంకొకరు కలిసుంటాం అని అన్నప్పుడు విడిపోతామన్న  ప్రాంతం వారి అభిప్రాయాలు తీసుకోవాలి తప్పితే,  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ ప్రాంతంతో సంబంధం లేని ప్రక్క ప్రాంతం వారి అభిప్రాయాలు కాదు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం వీగిపోయినా అది రాష్ట్ర ఏర్పాటుకు ఏవిధంగానూ అడ్డంకి కాదు.

మరి ఈ సంగతి గులాంనబీ ఆజాదుకు తెలియదనుకోవాలా? తెలుసు. మరి అతని వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉంటుంది?

రాష్ట్రం ఏర్పాటు కష్టం అని రాజీనామా చేసిన నాయకులను భయపెట్టి, "రాష్ట్రం ఎలాగూ రాదు, కనీసం పదవులన్నా కాపాడుకుందాం" అని అనుకునేలా ప్రేరేపించడానికి అయివుంటుంది. లేదా తెలంగాణా వారిని ఇలాంటి మాటలతో రెచ్చగొట్టి భయపెట్టి వారి లక్ష్యసిద్ధిని పరీక్షించి ఉద్యమ తీవ్రతని అంచనా వేయడం.

తెలంగాణా ప్రజా ప్రతినిధులు అంత సులభంగా తమ రాజీనామాలు వెనక్కు తీసుకునే పరిస్థితి లేదు. ఇంత జరిగాక తెలంగాణా process మొదలు కాకుండా రాజీనామాలు వెనక్కు తీసుకుంటే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అసలు ప్రజలు చీత్కరిస్తేనే కదా వీరు రాజీనామాలు చేసింది? ఇప్పుడు దాన్ని ఉత్తుత్తి కార్యక్రమంగా ముగించే ధైర్యం వారు చేసే అవకాశం లేదు.

రెండోది సామ దాన బేధ దండోపాయాలలో భాగంగా ఇలాంటి ప్రకటనలు చేయడం కేంద్రం ఉద్దేశం కావచ్చు. తల్లి కూడా తాయిలం అడిగిన కుర్రాడికి వెంటనే ఇవ్వకుండా కాసేపు మారాం చేయించడం ద్వారా పిల్లవాడి కమిట్మెంటును పరీక్షిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ప్రజాప్రతినిధుల కమిట్మెంటును పరీక్షిస్తుండవచ్చు. తెలంగాణా ప్రజలకమిట్మెంటునుఇప్పుడు కొత్తగా పరీక్షించాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. ఎందుకంటే వారు ఇప్పటికే వారు పలుసార్లు పలు సందర్భాలలో తమ స్వరాష్ట్ర ఆకాంక్షను వెలిబుచ్చారు. ఊగిసలాడే మనస్తత్వం ఉండే నాయకుల మీద వారు కొంత ఆశ పెట్టుకొని ఉండవచ్చు.

కానీ ముందే అనుకున్నట్టుగా పరిస్థితి నాయకులు ఏమాత్రం తోక ఝాడించేందుకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఝాడిస్తే తెలంగాణా ప్రజలు వారి వీపు ఝాడించేందుకు సిద్ధంగా ఉన్నారు.

నిజానికి ఇలాంటి పరీక్షలు చేయాలనుకుంటే ఆజాద్ ఆంధ్రా ప్రజల సమైక్య రాష్ట్ర ఆకాంక్ష మీద పరీక్షలు చేస్తే బాగుంటుంది. తెలంగాణాలో ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కావాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు. అదే సీమాంధ్ర ప్రాంతంలో పరిస్థితి అలా లేదు.

కొందరు హైదరాబాదు విడదీస్తే విడిపోయినా ఫరవాలేదంటారు. మరి ఇది ఏ రకమైన సమైక్యత?

ఇంకొందరు కలిసి ఉంటే ఫరవా లేదు, కాని విడి పోతే ఉత్తరాంధ్రకి లక్ష కోట్లు ఇవ్వాలి అంటారు. మరి కలిసి ఉంటే ఏ ప్యాకేజీ లేకపోయినా ఫరవాలేదా?ఇన్నాళ్ళూ కలిసి ఉన్నా ఇప్పుడు ప్యాకేజీల అవసరం వచ్చిందంటే కలిసి ఉండడంవల్ల ఉపయోగం లేనట్టే కదా?

ఇక కొంతమంది రాయలసీమ వారు రాయల-తెలంగాణా కావాలంటారు. అంటే ఇప్పుడున్న సమైక్య రాష్ట్రం అవసరం లేదనే కదా?

వీటన్నిటికి తోడు సీమాంధ్రలోని దళిత బహుజనులు రాష్ట్ర విభజనతోనే తమ బతుకులు బాగు పడతాయని గట్టిగా నమ్ముతున్నారు. గుంటూరు సభే దానికి నిదర్శనం.

ఇవన్నీ కాక చలసాని శ్రీనివాస్, వగైరాల నాయకత్వంలో ఆంధ్రరాష్ట్ర ఉద్యమం కూడా ఉండనే ఉంది.

కాబట్టి తెలంగాణాలో ప్రజలంతా ముక్త కంఠంతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును కోరుతున్నా, ఆంధ్రాలో మాత్రం అందరూ సమైక్యరాష్ట్రం కావాలనే అభిప్రాయంతో లేరనే విషయం అర్థమౌతుంది.

రాజకీయ దృష్టితో చూసినా, తెలంగాణా ఇవ్వకుంటే తెలంగాణాలో వచ్చే ఏ ఎన్నికల్లోనూ ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు సీటు గెలవడం కాదుకదా, డిపాజిట్ తెచ్చుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టమే. అదే తెలంగాణా ఇస్తే మటుకు TRSతో పొత్తు పెట్టుకొని కొన్నైనా సీట్లు గెలుచుకునే అవకాశం దానికి ఉంది. మైనారిటీల భయంతో KCR కాంగ్రేస్ తో కలవ గలడు కాని, NDA తో కలవడానికి అంతగా ఇష్ట పడడు. కాని 2014లోపు తెలంగాణా ఇవ్వక పోతే మటుకు KCR NDA తో కలవక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కాంగ్రేస్ పని తెలంగాణాలో కుక్కలు చింపిన విస్తరే.

ఇకపోతే తెలంగాణా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆంధ్రాలో మాత్రం మిశ్రమ ఫలితాలే వుంటాయి. జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబులతో కాంగ్రెస్ సీట్లను పంచుకోవలసిందే. గోడమీది పిల్లి వాటంగా వున్న చంద్రబాబు, జగన్‌లు కేంద్రం నిర్ణయం ప్రకటించాక "మేం సమైక్యవాదులం" అని అరిచి మొత్తుకున్నా నమ్మేటంత విఙ్ఞత లేనివారు కారు సీమాంధ్రులు. కాబట్టి తెలంగాణా ప్రకటించి నంత మాత్రాన కాంగ్రెస్ ఆ ప్రాంతంలో కొత్తగా కోల్పోయేదీ, ఇవ్వక పోతే బావుకునేదీ ఏమీ వుండదు. పైగా ఆ ప్రాంతంలో ఎన్నికల్లో కుల రాజకీయాలదే పెద్దపీట అన్నది అందరికీ తెలిసిన విషయమే.

వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పరచడం కన్నా కేంద్రంలో వున్న కాంగ్రెస్ పార్టీకి మరో ప్రత్యామ్నాయం లేదు.

Friday, July 8, 2011

బాబు డైరెక్షన్, తెదెపా తమ్ముళ్ళ యాక్షన్

బాబు దర్శకత్వంల తెలంగాణా తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహా రంజుగా యాక్షన్ చేస్తున్నరు. మరి వీరి యాక్షన్ తెలంగాణా ప్రజలు ఏవిధంగ స్వీకరిస్తరో చూడవలసి ఉంది.

మొన్నటిదాకా ప్రజలకు మొఖం చూపలేక మన్నుదిన్న పాముల్లెక్క, ఒడ్డున బడ్డ చేపల్లెక్క ఉన్న వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాలు చేయంగనె ఎక్కడ వెనుక బడి పోతమో అన్నట్టు ఉరుక్కుంట రాజీనామాలు చేసిన్రు. అదీ బాబు పర్మిషన్ తోటి.

ఒకవైపు వీళ్ళతోటి రాజీనామాలు చేయించిన చంద్రబాబు, ఇంకో పక్క పయ్యావుల కేశవ్ ను "జై సమైక్యాంధ్ర" అనమని ఉసిగొల్పుతడు.

ఇన్నాళ్ళు జనానికి మొహం చాటేసిన వీళ్ళు, రాజీనామాలు చేయంగనె ఎప్పుడెప్పుడు ప్రజల దగ్గరికి పోదామా అని ఈన్నావుల్లెక్క ఉరుకులాడుడు మొదలు పెట్టిన్రు. అందుకని బస్సుయాత్ర మొదలు పెట్టిన్రు.

మొదలైతె పెట్టిన్రు గని మనసుల ఏదో అనుమానం, వీళ్ళ యాక్టింగు జనం పసిగట్టి తరిమికొడుతరేమోనని! ఎందుకైనా మంచిదని JAC కాడికి పొయిన్రు. 

శనివారం మీటింగు పెట్టినం,అప్పటిదాక ఆగున్రి అని JAC వాళ్ళు చెప్పిన్రట. వెంటనే వీళ్ళు బాబు దగ్గరికి పొయ్యి మంతనాలు జేసిన్రు. బాబు ఏం పురెక్కిచ్చిండో ఏమో, బయటికొచ్చి JAC మీద సయ్యి మనుకుంట లేచిన్రు.

"మేం రాజీనామాలు చేసినా మమ్మల్ని అడుగకుంట 48 గంటల బందు పెట్టిన్రు. అందుకని మేం JACల కలువం" అని వీరి వాదన.

మరి ఎవర్ని అడిగి వీరు బస్సుయాత్ర పెట్టుకున్నరో అది మాత్రం చెప్పరు. వీళ్ళ కోపానికి అసలు విషయం ఇంకోటి ఉన్నది, JACల కలువాలంటె సమైక్యవాది చంద్ర బాబు పేరు ఎక్కడా ఎత్తవద్దని JAC వాళ్ళు కోరిన్రు.

మరి సహజంగనే రోజూ చంద్రబాబు బూట్లు నాకితె గాని తెల్లారని వీరికి ఆ మాట అంటె కోపం వచ్చుడుల ఆశ్చర్య మేముంది?

కాని వీరికి అర్థం గాని విషయం ఒకటుంది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన వీళ్ళు నెత్తిన రూపాయి పెడితే పావలాకు కూడా అమ్ముడు పోని రకం. రాజీనామాలు చేసినంత మాత్రాన వీల్లు చేసిన లెక్క మొత్తం మరిచిపోయేటంత అవివేకులు కారు ఇప్పటి తెలంగాణా ప్రజలు. అన్ని చూస్తనే ఉన్నరు.

ఎవరు అండమాన్‌కు పోయేది?

డబ్బు మదం నరనరాన ప్రవహిస్తున్న సీమాంధ్ర రాజకీయ బ్రోకర్లు ఇష్టం వచ్చినట్టు పేలుతుంటరు. తెలంగాణా ప్రజలని, ఉద్యమాన్ని అవహేళన చేస్తుంటరు. ఇవి కొంతమంది సమైక్యాంధ్ర అంటూ నీతులు చెప్పే కుహనా సమైక్యవాద మేతావులకు పట్టవు, వారి చెవులకు వినపడవు. కాని ఎప్పుడో ఎక్కడో ఒక తెలంగాణా నాయకుడు ఏదోఒక మాట అనంగనే అదే పట్టుకొని దాశాబ్దాల పాటు విమర్షిస్తుంటరు. ఇలాంటి మేధావులు మేధావుల ముసుగుల దోపిడీదారులను సమర్థించే చెంచాలు మాత్రమే కాని నిస్పక్షపాత వ్యాఖ్యాతలు కారని ముందు గుర్తించవలసి ఉంది.

తాజాగా TG వెంకటేష్ అనే పెద్దమనిషి ఇలాంటి ప్రేలాపనలే మొదలు పెట్టిండు. తెలంగాణా వాదులని,  తెలంగాణా వాదం ప్రచారం చేసే మీడియాని అండమాన్‌ పంపించాలట! మూడున్నర కోట్ల మందిని అండమాన్‌కి పంపించగలడా ఈ పెద్దమనిషి? పైగా ఈయన రాష్ట్రమంత్రి కూడా. ప్రత్యేక రాష్ట్రం అడగడమే ఇతని దృష్టిలో నేరమైతే, అప్పుడే పొట్టి శ్రీరాములు వగైరా నాయకుల్ని అండమాన్‌లో తోసేస్తే, మాకు ఇప్పుడు ఈ సమస్యే అసలు ఉండేది కాదుగా?

చంచల్ గూడాలోనో, తీహార్‌లోనో ఉండాల్సిన వాళ్ళు పదవులు వెలగబెడుతుంటే ఇలాంటి మాటలు కాకపోతే ఇంకేమొస్తయి? టీజీ, నువ్వూ, నీతోటి రాజకీయ బ్రోకర్లు అధికారాన్నడ్డం పెట్టుకుని బొక్కింది, కబ్జాచేసింది అంతా బయటకు తీసే రోజు దగ్గర్లోనే ఉంది. అప్పుడు చూద్దాం, మీరంతా తీహార్‌కు పోతారో, అండమాన్‌కు పోతారో. ఇప్పుడు నువ్వు వెలగబెడుతున్న సీమాంధ్ర ప్రభుత్వం ఇంకెన్నో రోజులు సాగదని ముందు తెలుసుకో.


Thursday, July 7, 2011

విఙ్ఞతతో ఒక నిర్ణయం తీసుకోవల్సిన సమయం వచ్చింది.

గత 55 ఏళ్ళనుంచీ జరిగేది తెలంగాణా అభివ్రుద్ధి కోసం పోరాటమే. తెలంగాణా ప్రత్యెక రాస్త్ర డిమాండ్ లో ఇమిడిఉంది కూడ అదే. తెలంగాణా అభివ్రుద్ధి, స్వయంపాలన, ఆత్మగౌరవం తోనే జరుగుతుందని తెలంగాణా ప్రజలు నమ్ముతున్నారు. 1956 లో అంధ్రప్రదెష్ రాస్త్ర ఏర్పాటు రూపంలో రాజకీయ ఐక్యతే వచ్చిందిగానీ మానసికంగా తెలుగువాళ్ళంతా ఒక జాతి అనేటటువంటి ఐక్యత రాలెదు. భాషాసంస్క్రుతులపైన జరిగిన దాడి, మితిమీరిన వలసలు, ఉద్యగ, వనరుల విషయంలో జరిగిన అన్యాయాలు దీనికి కారణం. ఇది సీమాంధ్రులు అర్థం చేసుకుని, సహ్రుదయంతో విభజనకు అంగీకరిస్తే అందరికీ మంచిది. లేనట్లైతే అసహజ పరిణామాలు ఏర్పడె అవకాశం ఉంతుంది. తెలుగువాళ్ళకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమీ లేదు. మరింత అభివ్రుద్ధ్రికి అవకాశం ఉంటుంది. సమస్యను శాశ్వతంగా కప్పేయాలనుకోడం సరైంది కాదు. విడిపొయినతర్వాత కూడా రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సుహ్రుధ్భవం అవసరమే.

హైదరాబాదు ను అడ్డంకిగా చూపడం కూడా సరికాదు. అదే సమస్య అయినట్లైతే ఇరుప్రాంతాల నాయకులు కూర్చుని చర్చల ద్వారా ఒక అంగీకారానికి రావచ్చు. ఇక్కడ స్థిరపడ్డ సీమాంధ్రులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని తెలంగాణావాళ్ళు మొదటినుంచీ చెప్పుతూనే ఉన్నారు. ఈవిధంగా ప్రతిష్టంభన ఎక్కువ కాలం కొనసాగటం ఇరు ప్రాంతాలవారికీ శ్రేయస్కరం కాదు. విఙ్ఞతతో ఒక నిర్ణయం తీసుకోవల్సిన సమయం వచ్చింది.

తెలుగుదేశం డ్రామా మళ్ళీ మొదలైంది

ఇక్కడ మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉధ్రుతం ఐంది. అందరూ రాజీనామా చేసి ఒక సంక్షోభం స్రుష్టించడం తో ఎక్కడ తెలంగాణా ఇచ్చేస్తారో అని భయపడ్డ చంద్రబాబు సీమాంధ్ర తెలుగుదేశం నాయకులను ఎగదోసి మళ్ళా అక్కడ క్రుత్రిమ ఉద్యమాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

తెలంగాణా పై తీర్మానం పెట్టితే సీమాంధ్ర నాయకులతోటి కూడ అనుకూలంగా ఓటు వేపిస్తామన్న తెలంగాణా తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఏమీ మాట్లడటం లేదు.

చంద్రబాబు ఏమీ చెప్పకుండ ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీకి సమస్యను నాంచే అవకాశం ఉంటుంది. ఇంత చిన్న విషయం కూడ అర్థం కావడం లేదు తెలంగాణ నాయకులకు. ఎంతసేపూ కాంగ్రెస్ తో పోల్చుకుంటారుగానీ ఒక ముఖ్యమైన తేడా వీళ్ళకు కనపడటం లేదు. కాంగ్రెస్ వాళ్ళు తమ అధిస్టానం తో పోరాడుతున్నారు. వీళ్ళు మాత్రం గుడ్డిగా చంద్రబాబును సపోర్ట్ చేస్తూ రాజకీయంగా తమ గొయ్యి తామే త్రవ్వుకుంటున్నారు. చంద్రబాబు పేరు చెపితేనే తెలంగాణా ప్రజలకు వంటికి కారం పూసుకున్నట్టు ఉంటుందని వీళ్ళకు ఇంకా అర్థం కాకపొడం విచిత్రమే.

కుడితిలో పడ్డ కాంగ్రెస్

కేకు చెయ్యాలంటే పిండి మిశ్రమాన్ని కలిపి కావలసినంత సమయం పాటు ఓవెన్ లో పెట్టాలి. ఆ కావలసిన సమయం గంట సేపు అనుకుందాం. మరి గంట కాకుండా పది గంటలు పెడితే? ఇరవై గంటలో, ముప్పై గంటలో పెడితే? అలా ఓ ముప్పై గంటలు పెట్టిన తర్వాత బొగ్గు కాకుండా కేకే కావాలని ఆశిస్తే ఎట్ల ఉంటది?

సరిగ్గా అట్లనే ఉంది మన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అది తెలంగాణా సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఏమాత్రం లేకుండా, ఏళ్ళ తరబడి నానబెట్టి, ఇప్పుడు కూడా పరిష్కరించే ఉద్దేశం లేకుండా ఎలా లబ్ది పొందాలా అని ఆలోచించడమంటే, అది మాడి పోయిన కేకు బాగచేసే ప్రయత్నమే.   

2001 ల కేసీయార్ పార్టీ స్థాపించినప్పుడు, ఆ పార్టీ తెలంగాణా సాధిస్తదని ఎవ్వరూ పెద్దగా ఆశించ లేదు. కాకపొతే తెలంగాణా వాణి గట్టిగా వినిపించే వేదిక ఒకటి దొరికిందని సంబూర పడ్డరు. 

కాని 2004 ల కాంగ్రెస్ తో టీయారెస్ జతకట్టి, ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజేతగా నిలవడంతో ప్రజలల్ల తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై ఆశలు చిగురించినై. తెలంగాణా ఏర్పాటు తధ్యమని నమ్మకం కలిగింది. కాని రాజశేఖర్ రెడ్డి ఒంటెద్దు పోకడలతోటి ఆ ఆశల మీద నీళ్ళు చల్లిండు. తద్వారా 2009 ఎన్నికల వరకూ పరిస్థితి లో ఏమాత్రం పురోగతి లేకుండ పొయ్యింది.

2009 ల ఇంకో అద్భుతం జరిగింది. సమైక్యవాదం నరనరానా జీర్ణించుకున్న నారా చంద్రబాబు సీట్లకు కక్కుర్తి పడి జై తెలంగాణా అన్నడు. ప్రణభ్ ముఖర్జీకి అట్లని ఉత్తరం పంపిచ్చిండు. అంతే కాదు, ఆ ఎన్నికల్ల కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణాకు కట్టుబడి ఉన్నమనే చెప్పి పోటీ చేసింది. ఆ విధంగా రాష్ట్రంల ఒక్క సీపీయం తప్ప తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకించే పార్టీ లేకుంట అయ్యింది. ఆ సీపీయం కూడా తాను తెలంగాణాకి అడ్డంకి కానని చెప్పి మహాకూటమి లో కలిసి ఎన్నికల్లో పాల్గొంది.

అన్ని పార్టీలు తెలంగాణా తెస్తమనే చెప్పడంతోటి తెలంగాణా ప్రజలు ఏ ఒక్క పార్టీనో గెలిపించలేక పోయిన్రు. జాతీయ పార్టీ అని నమ్మకంతో తెస్తే గిస్తే అదే తెస్తుందనే నమ్మకంతో కాంగ్రేసుని గెలిపిస్తే, తాను అన్నానంటే తప్పక చేస్తానని అన్న చంద్రబాబు మాటలని నమ్మి తెలుగుదేశానికి కూడా బాగానే సీట్లిచ్చిన్రు. మధ్యలో సమైక్యవాద పార్టీ అయిన తెలుగుదేశంతో పొత్తు పెట్టున్నందుకు కేసీయార్ బాగనే మూల్యం చెల్లించిండు. అయినా సరే వ్యూహాత్మకంగా చంద్రబాబుతో తెలంగాణా అనుకూల ప్రకటన చేయించడం ద్వారా ఆయన పెద్ద విజయమే సాధించిండు.

2009 లో తెలంగాణా ప్రాంతంలో ఎన్నికల తంతు పూర్తీ కాగానే తెలంగాణా వెన్నులో మొదటి బాకు దిగింది. అది దింపింది రాజశేఖర్ రెడ్డి. ఎన్నికలు పూర్తైన మరుక్షణం నంద్యాల మీటింగులో, రాహుల్ గాంధీ సమక్షంలో, తెలంగాణా విడి పొతే హైదరాబాదుకి వీసా తీసుకుని వెళ్ళవలసి ఉంటదని తొండి మాటలు చెప్పిండు రాజశేఖర్ రెడ్డి.

తెలంగాణా ఉసురే పోసుకున్నడో, తన మాటలకు మూల్యమే చెల్లించు కున్నడో తెలువదు గని,  కొద్ది రోజులకే ఆయన అత్యంత ఘోరమైన పరిస్తితులల్ల కాలధర్మం చేసిండు. ఆ విధంగా తెలంగాణాకు ఉన్న పెద్ద అడ్డంకి తొలిగినట్టయింది. అదును చూసి కేసీయార్ నిరాహార దీక్ష చేసిండు. ఆ సమయంలో ఉవ్వెత్తున లేచిన ప్రజా వెల్లువ చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రక్రియ మొదలయినట్టు ప్రకటించింది.

ప్రకటించి ఇరవై నాలుగ్గంటలు కాకముందే తెలంగాణ వెన్నులో రెండో బాకు దింపిండు చంద్రబాబు. తాను స్వయంగా రెండు రోజుల ముందే అసెంబ్లీలో చెప్పిన మాటలనే పూర్వపక్షం చేస్తూ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిండు. సీమాంధ్ర నాయకుల కుట్రలకు ఎన్టీయార్ ట్రస్టు భవన్ వేదికగా నాయకత్వం వహించిండు. ఇది తెలంగాణా ప్రజల హృదయాల్లో తీరని గాయం రేపింది.ఫలితం, తెలంగాణాలో బలంగా పాతుక పోయిన తెలుగు దేశం పార్టీకి ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం.

ఆ తర్వాత చంద్రబాబు కాని, ఇతర నాయకులు కాని తెలంగాణాల పర్యటించడానికి కూడా వీలు కాలేదు. చెరువులో నుండి బయట పడ్డ చేప పిల్లల మాదిరి తయారయింది తెలంగాణా టీడీపీ వారి పరిస్థితి. 

కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. తాము విధించుకున్న జూన్ 30 డెడ్ లైన్ కూడా ముగియడంతో కాంగ్రెస్ వారికి ప్రజల వద్ద ముఖం నిలపాలంటే రాజీనామాలు తప్ప వేరే గత్యంతరం లేక పోయింది. అలాగే వారు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేసిన్రు. తెలుగుదేశం వారికి కూడా ప్రజల ముందుకు రావడానికి ఇదో గొప్ప సువర్ణావకాశం లాగ కనిపించింది. అనుదుకే కాంగ్రెస్ వాళ్ళకంటే గంట ముందుగానే తమ రాజీనామాలు సమర్పించిన్రు.

ఇప్పుడు ఏదో ఒకటి చేయవలసిన పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానానిది. ఇంత కాలం సమస్యను నాన బెట్టిన ఫలితంగా ఏం చేసినా కాంగ్రెస్ కి లాభించేలా లేదు. నష్టాన్ని తగ్గించు కోవడమే ఇప్పుడు చేయవలసిన పని.

ఇప్పుడు తమంత తాము రాజీనామాలు ఉపసంహరించు కుంటే ప్రజలు కాంగ్రెస్ నాయకులని ఎప్పటికీ క్షమించరు. వారు కనీసం తెలంగాణా ప్రాంతంల తిరగ్గలిగేది కూడా అనుమానమే. అలా అని తెలంగాణా రాకుండా వారు మళ్ళీ ఏం మొఖం పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయగలరు? తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు తెలంగాణా సాధించడం తప్ప వేరే మార్గం లేదు. వారు మళ్ళీ ఈ ప్రాంతంలో పోటీ చేయాలంటే తెలంగాణా అయిన తీసుకు రావాలి లేదా పార్టీ వీడి టీఆరెస్ టికెట్ మీద అయినా పోటీ చేయాలి.

చంద్రబాబుతో తెలంగాణాకు అనుకూలంగా మరో స్పష్టమైన ప్రకటన ఇప్పించకుండా తెలంగాణా తెలుగుదేశం వారు ఎన్నికల్లో గెలవడం కల్ల. అలాంటి ప్రకటన చేసినా గతంలో ఏరుదాటి తెప్ప తగలేసిన బాబుని జనం నమ్మడం కష్టమే. రాజీనామాలు చేసినంత మాత్రాన సమైక్య నాయకుని క్రింద ఉన్న తెలుగు తమ్ముళ్ళను తెలంగాణా వారు నమ్మరు. చంద్రబాబు ప్రకటన కాని, తెలుగుదేశం విభజన కాని అనివార్యంగా జరిగే పరిణామం.

ఇక టీఆరెస్ పరిస్థితికి మాత్రం ఏం ధోకా లేదు. తెలంగాణా రావడం లేటైన కొద్దీ అది మరింత బలపడుతుంది. 2014 ఎన్నకల్లో అది 90 % అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం ఖాయం. ఒక వేళ ముందే తెలంగాణా వచ్చినా ఆ క్రెడిట్ దానికే దక్కుతుంది.

Monday, July 4, 2011

రాజీనామాల కాక మొదలైంది

మొత్తానికి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి గూబ గుయ్యిమనే దెబ్బ తలిగింది. ఎన్ని ఫోన్లు చేసినా ఎన్నిసార్లు రమ్మని పిలిచినా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పెడచెవిన పెట్టినరు. అధిష్టానం పిలుపులను ఏమాత్రం లెక్క చెయ్యలేదు. రాజీనామాలు చేసినంక గాని మేము చర్చలకు రాం అని తెగేసి చెప్పిన్రు తెలంగాణా నాయకులు.

హటాత్తుగా తెలంగాణా కాంగ్రెస్ వారికి ఇంత తెగింపు ఎక్కడినిచి వచ్చింది? పిల్లి నైనా గదిలో వేసి అదే పనిగ కొడుతుంటే అది తప్పక ఎదురు తిరుగుతది. అలాంటిది సీమాంధ్ర డబ్బు సంచుల మాయలో మైమరచి పోయిన కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణా ప్రతినిధులు ఎన్ని సార్లు పోయి తమ బాధలు విన్నవించు కోవాలని ప్రయత్నం చేసినా పెడచెవిన పెట్టింది. 

తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతపు ప్రజల మనోగతాలను చెప్పుకోవాలని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వినకుండా ఏదో ఒక మాయమాట చెప్పి పంపించడం అధిష్టానానికి రివాజుగా మారింది. ఒకసారి తెలంగాణా, సీమాంధ్ర ఎంపీ లందరూ ప్రణభ్ దగ్గరికి వెళ్ళితే, పొద్దుటి నుంచీ సాయంత్రం వరకూ సీమాంధ్ర ప్రతినిధులో మంతనాలు జరిపి, సాయంత్రం దాకా ఓపిగ్గా వేచి ఉన్న తెలంగాణా ప్రతినిధులతో పదంటే పది నిముషాలు మాట్లాడిన ఉదంతం సూట్ కేసుల మహిమ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పింది.

వెన్నెముక లేని వారిని ఏరేరి టికెట్లిచ్చినారు కనుక ఎలా చెప్తే అలా పడిఉంటరని కాంగ్రెస్ చాలా భారోసాగనే ఉంది. కాని పరిస్థితులు అలాగ లేవు. తెలంగాణా కాంగ్రెస్ ప్రతినిధులు తాము చెప్పిన చివరి డేడ్ లైను కూడా ముగిసిన తర్వాత, ఇంకేమాత్రం వాయిదాలు వేసే పస్థితి లేదు. ఇప్పటికే తెలుగుదేశం నాయకులు ప్రజల్లోకి రాలేని పరిస్థితి. తెలుగుదేశం వారికి జరుగుతున్న సామాజిక బహిష్కరణ చూసిన తర్వాత తమకు కూడా అదే పరిస్థితి తప్పదని గ్రహించలేని వారు కాదు కాంగ్రెస్ నాయకులు.

అందుకే ఇక పార్టీ ప్రయోజనాల కన్నా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించ వలసిన అవసరాన్ని గుర్తించిన్రు. దాని పర్యవసానమే ఈ రాజీనామాల పర్వం. ఈ నిర్ణయం తీసుకునే ముందు కేసీయార్ తో మాట్లాడి, ఎన్నికలు వస్తే పోటీ చేయం అనే మాట తీసుకొనే ఉంటారు. వారు ఏం చేసినా అది మాత్రం తెలంగాణా ప్రయోజనాలకు అనుకూలమే. అందుకే తెలంగాణా ప్రజలు వారిని ఈరోజు సమర్థిస్తున్నరు.

ఇంకా పొతే తెలుగుదేశం వారు. కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాల సంగతి ప్రకటించ గానే పోలో మని ఉరికొచ్చి వారికంటే ముందే రాజీనామాలు చేసిన్రు. సొంత విధానాలు లేక కాంగ్రెస్ చేస్తే రాజీనామా చేయడం, కాంగ్రెస్ మానితే మానడం చేసే వారికి మరి ఓట్లు వేసి గెలిపించడం ఎందుకు? ఈ విధంగా నైనా ప్రజల్లోకి రావచ్చోనే యావ తప్ప తెలంగాణా తెలుగు దేశం వారి రాజీనామాల్లో ఏమాత్రం నిజాయితీ కనపడుత లేదు. 

తెలంగాణా తెలుగుదేశం వారు చేయ వలసినది రాజీనామాలు కాదు. వారు చేయవలసింది రెండు కళ్ళ ఆంద్రబాబుతో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయడానికి తనకు అభ్యంతరం లేదని స్పష్టమైన ప్రకటన చేయించడం. అలా చేయించ కుండా, 'మా నాయకుడు తెలంగాణాకు అనుకూలం' అని దొంగ మాటలు చెప్తే ప్రజలు నమ్మి ఆదరించే పరిస్థితిల లేరు.

ఏదేమైనా, ఇప్పటికైనా సీమాంధ్ర ఎత్తులకు తెలంగాణా వారు చిత్తు కాకూడదని ఆశిద్దాం.

జై తెలంగాణా.

Sunday, July 3, 2011

సమైక్య ‘రాగాలు’.. దోపిడీ ‘తాళాలు’



- రాజకీయం ముసుగులో కాంట్రాక్టులు
- తెలంగాణ వస్తే ఆటలు సాగవనే భయం
- పాత కుట్రలు బద్దలవుతాయని ఆందోళన
- ఇకపై యథేచ్ఛ దోపిడీ సాగదని మనాది
- చిత్తం సొమ్ముపైన.. భక్తి దోపిడీపైన
- సీమాంధ్ర నేతల తెలంగాణ వ్యతిరేకత వెనుక..


చెరుకు రైతుల నోళ్ళు కొడుతున్న తిక్కవరపుఆర్‌ఈసీలో సీమాంధ్ర కలుపు మొక్క కావూరితెలంగాణలో రోడ్ల కాంట్రాక్టర్ రాయపాటితెలంగాణ గుత్తేదారు మేకపాటిలాభాలు ఎత్తుకుపోతున్న టీజీరాష్ట్రం విడిపోతే లగడపాటి నోట్లో మన్నేకాలుష్య రాంకీతో మోదుగుల సయ్యాటభూములు మింగిన జగన్గురుకుల్ కబ్జాకోరు ధర్మాన మందు వ్యాపారి మాగుంట‘పొదుగు’ కోసిన బాబుముంచేటి పోలవరం గుత్తేదారు నామాతెలంగాణనుఅడ్డుకుంటున్నది వీరేసీమాంధ్ర జనం విభజనకు వ్యతిరేకం కాదు.

లగడపాటి సమైక్యతా ‘రాగం’ వెనుక ‘తాళం’ ఏమిటి? సాక్షాత్తూ శ్రీకృష్ణ కమిటీనే మేనేజ్ చేసి సమైక్య సిఫారసు చేయించడానికి తిక్కవరపు ఎందుకు ‘కష్ట’పడ్డారు? టీడీపీ సభ్యుల చేతిలోంచి సమైక్య ప్లకార్డు లాక్కుని మరీ జగన్ పార్లమెంటులో ఎందుకు గొంతెత్తారు? కావూరి హస్తినలో చేస్తున్న సమైక్య తంత్రాంగ మంత్రాంగాల వెనుక దోపిడీ యంత్రాంగం ఏమిటి? మేకపాటికి పోయేదేంటి? టీజీ వెంక కోల్పోయేదేంటి? కాలుష్య భూతం రాంకీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని మోదుగుల ఆందోళన చెందుతున్నారు? చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతి అవతారం ఎందుకు ఎత్తారు? ఇవి కొన్ని ప్రశ్నలు!

లక్షల మంది బహిరంగ సభల్లో జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. మరి.. ఏవీ సీమాంవూధలో వేల మందితోనైనా బహిరంగ సభలు? సమైక్య భావోద్వేగం ఏ స్థాయిలో ఉంది? ఎందుకని గుప్పెడు మందే సమైక్య నినాదంతో గొంతు చించుకుంటున్నారు? జగడాల మారిగా మారి లడాయి పెట్టుకుంటున్నారు? ప్రతి మనిషి మాట వెనుక అతని వర్గ స్వభావం దాగి ఉంటుంది! దశాబ్దాల క్రితమే లెనిన్ చెప్పిన మాట ఇది! ఆ మనుషులు సీమాంధ్ర ప్రజానీకం కాదు.. ఆ వర్గం ఆ ప్రాంత మేధావులో సంఘ సంస్కర్తలో, విద్యాధికులో కానే కాదు.. అది సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గం. తెలంగాణలో తమ అక్రమ పెట్టుబడుల గోడలు కూలకుండా.. అక్రమార్జనల గుట్టు రట్టవకుండా.. తాపవూతయపడుతున్న ఫక్తు దోపిడీ వర్గం. రాజకీయం ముసుగేసుకుని మురికి కాల్వ మొదలుకుని.. పంట కాల్వ దాకా.. రోడ్లు మొదలుకుని.. భారీ భవంతుల దాకా.. సత్తు రూపాయలు పెట్టుబడులు పెట్టి.. సొత్తు దోచుకుపోతున్న సీమాంధ్ర కుట్ర కుతంవూతాల గుత్తేదారుల వర్గం ఇది.

వ్యాపారమే సుబ్బిరామిడ్డి ప్రయోజనం
శ్రీకృష్ణ కమిటీని ‘ప్రభావితం’ చేయడానికి సాక్షాత్తూ ఆ కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ హోం శాఖ కార్యదర్శి వీకే దుగ్గల్‌నే తన ఇంటికి విందుకు ఆహ్వానించిన ఎంపీ తిక్కవరపు సుబ్బిరామిడ్డి సాగర్ కాల్వల కాంట్రాక్టర్‌గా సిమెంట్ కుంభకోణంలో ముద్దాయిగా వార్తల్లోకెక్కి, ఒక అవినీతి పరునిగా ప్రజలకు పరిచయమైన వ్యక్తి. ఈనాడు గాయత్రి సంస్థల యజమానిగా వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు. తన వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం రాజకీయ పదవి, సమైక్య రాష్ట్రం ఆయనకు అవసరం. రాజ్యసభకు మరోసారి ఎంపిక కావడానికి సోనియాగాంధీనే ‘ప్రభావితం’ చేసిన సీమాంధ్ర పెద్దమనిషి, గాయత్రీ షుగర్స్ (కామాడ్డి) ద్వారా తెలంగాణలో చెరుకు పండించే రైతుల నోళ్ళు కొడుతున్నది ఈ సుబ్బిరామిడ్డే. చెరుకు మద్దతుధరను పెంచకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, అధికారులను నియంత్రిస్తాడు. చెరుకు ఫ్యాక్టరీల యజమానులతో (సిండికేట్) మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకొని చెరుకు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈయన ఎజెండాలో భాగమే తెలంగాణ వైభవానికి ప్రతీకగా నిలిచే నిజాం షుగర్స్ విధ్వంసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈయనగారి పెత్తనం సాగదు. గాయత్రీ కన్‌ స్ట్రక్షన్స్ ద్వారా తెలంగాణలో రోడ్లు, కాలువల కాంట్రాక్టులలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. అందుకే మీడియాకు ఎక్కకుండానే తెలంగాణను అడ్డుకోవడానికి తనవంతు ప్రయత్నాలను లోలోపల చేస్తున్నాడు.

ఇదీ కావూరి బాగోతం
వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిగా, ఆ తరువాత కాజీపేటలో 70వ దశకంలో చిన్న గుత్తేదారుగా జీవితాన్ని ప్రారంభించిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఒక రాజకీయనాయకుని కూతురును పెళ్ళి చేసుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని తెలంగాణలో విస్తరించాడు. ప్రోగ్రెసివ్ కన్‌వూస్టక్షన్స్ పేరుతో తెలంగాణలో ప్రాజెక్ట్‌లు, కాల్వలు, రోడ్డు నిర్మాణ పనుల్లో పలు అక్రమాలకు, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నాంపల్లిలోని మెడ్విన్ ఆస్పవూతితో పాటు తెలంగాణలో టోల్‌గేట్స్, పలు బినామీ ఆస్తులు ఆయనకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈయన అక్రమాలు వెల్లడవుతాయి. మంత్రులను, అధికారులను లోబర్చుకుని కాంట్రాక్టులు దక్కించుకోవడం కుదరదు. అందుకే తెలంగాణ మాట వింటేనే ఆవేశంతో ఊగిపోతుంటాడు. ప్రజల కోసం ప్రాణమిచ్చిన సూరపనేని జనార్ధన్, ఆజాద్, బాలగోపాల్ వంటి త్యాగధనులకు విద్యనందించిన వరంగల్ ఆర్‌ఈసీ నుండే కలుపుమొక్క వంటి కావూరి ఉత్పత్తికావడం విషాదమే.

తెలంగాణ ‘పొదుగు’ కోసిన బాబు
పై సీమాంధ్ర నేతకు ఏ కారణాలైతే ఉన్నవో తెలంగాణను వ్యతిరేకించడానికి చంద్రబాబుకూ అవే కారణాలున్నాయి. మరికొన్ని అదనంగా కూడా ఉన్నాయి. తన ‘హెరి విస్తరణ కోసం తెలంగాణ పాడి పరిక్షిశమను నాశనం చేసిన చరిత్ర చంద్రబాబుది. తొమ్మిదేళ్ళ పాలనలో రెండెకరాల ఆసామి వేల కోట్లకు పెరగడానికి ఎన్ని కుంభకోణాలు అవసరమైనవో ఫైళ్ళలో భద్రంగానే ఉన్నది. కాంగ్రెస్-టీడీపీ మధ్య ‘కుంభకోణాల అవగాహన’ ఉన్నందునే చంద్రబాబు అవినీతికి వ్యతిరేకంగా వైఎస్ గతంలో హైకోర్టులో దాఖలు చేసిన కేసులన్నీ బేషరతుగా వెనక్కి తీసుకున్నారు. రాజధాని చుట్టూ విస్తరించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చంద్రబాబు ‘బినామీ’ వాటాలున్నాయి. నిజాం రాజు భారత సర్కారుకు తలవంచి రాజ్యాన్ని వదులుకున్నప్పుడు ‘స్ఫకాస్’ భూములు లక్షల ఎకరాలను ప్రభుత్వానికిచ్చాడు. దేశంలో ఏ రాజధాని నగరం చుట్టూ లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి లేదు.

ఇప్పటికే సెగ చవి చూసిన జగన్
పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీల చేతుల్లోని ప్లకార్డు తీసుకొని తెలంగాణకు వ్యతిరేకంగా గొంతెత్తిన వైఎస్ జగన్ ఇప్పటికే ఒకసారి తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని రుచి చూశారు. వైఎస్ హయాంలో తెలంగాణ భూములు వేల కోట్ల ముడుపులను వివిధ వ్యాపారాల ద్వారా తీసికొని జగన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సెజ్‌ల పేరుతో విలువైన తెలంగాణ భూముల్లో బినామీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. జగన్ గుట్టు సోనియా కెరుక. సోనియా గుట్టు జగన్ కెరుక.
అందుకే ఒకరిపై మరొకరు ఎంత కోపంగా ఉన్నా తమ లోగుట్టు మాత్రం బయట పెట్టుకోరు. తెలంగాణ వస్తే జగన్ గుట్టు బయటికి రాక తప్పదు. అందుకే తెలంగాణను జగన్ వ్యతిరేకిస్తున్నాడు.

కుట్రల బృందం నాయకుడు
వీళ్లందరికన్న ఒక్కడుగు ముందున్న తెలంగాణ వ్యతిరేకి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. రకరకాల వ్యాపారాల్లో ఈయన భాగస్వామి. తెలంగాణ వస్తే లగడపాటి నోట్లో మన్నే. ల్యాంకో హిల్స్ పేరుతో 700 కోట్లతో భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన భవనాలను నిర్మిస్తున్న లగడపాటి, వక్ఫ్‌బోర్డ్‌కు చెందిన భూమిని అక్రమ పద్ధతిలో కాజేసిన సంగతి తెలిసిందే. వైఎస్ హయాంలో రెవెన్యూ అధికారులను లోబర్చుకొని రికార్డులను తారుమారు చేసి ‘బాజాప్తా’ కబ్జా చేసి కోట్లు సంపాదించాడు. తెలంగాణ వస్తే ఆ రికార్డులు బయటపడతాయి. బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టంకాక తప్పదు. లగడపాటికి చెందిన అనేక వ్యాపారాలకు, అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. అందుకే లగడపాటి రగడం, జగడం.


పూర్తి పాఠం: నమస్తే తెలంగాణా

Saturday, July 2, 2011

ఆంధ్రాలో అంతా గ్రాంధికమే మాట్లాడుతున్నరా?

కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నెల ఏడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యోమదంబయో
హాటక గర్భురాణి నిను నాకటికిం గొనిపోయి యల్లా క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ!

ఇది బమ్మెర పోతన రాసిన పద్యం. దీంట్లో కొనిపోయి అనే పదాన్ని చూడండి. అది తెలంగాణాల కొనబోయి అని వాడుతరు. ఇప్పుడు ఏదైనా పత్రికలో రిపోర్టర్ 'కొనబోయి' అని రాస్తే ఎడిటర్ అడ్డు పడతాడు. 'తీసుకెళ్ళి' అని రాయాలంటడు. మరి నన్నయ, తిక్కన 'తీసుకెళ్ళి' అని రాసినరేమో తెలవదు.

ఇదంతా చెప్పడం ఎందుకో క్రింది పేరా చూస్తె మీకు తెలుస్తది.

దురదృష్టవశాత్తు తెలుగుభాషలోని ఒక్క పదం కూడా తన ఒరిజినల్ రూపంలో అక్కడ వినపడదు. అంతా అపభ్రంశమే. పరాయి పాలకులు అలవాటు చేసిన ఈ అపభ్రంశ రూపాల్నే వారు తమవిగా భావిస్తున్నారు. మహాకవి బమ్మెఱ పోతన తమ ప్రాంతీయుడని వారు చెబుతారు. కానీ పోతన ఈ అపభ్రంశరూపాల్ని ఎక్కడా వాడలేదు. ఈ కాలపు లెక్క ప్రకారం ఆయన కోస్తా-సీమల గ్రాంథికాన్నే వాడారు.

ఇది సదరు బ్లాగులో ఒక పండితుడు చూపిన మధ్యకోస్తా భాషాహంకారం. ఒక ప్రాంతంమీద, అక్కడి ప్రజల మీద ఎంత చిన్న చూపో చూడండి సదరు పెద్దమనిషికి! ఒక్క పదం కూడా ఒరిజినల్ రూపంలో కనపడదట! మరి ఆంధ్రాలో కనపడుతుందా? ఇప్పుడు వారు మాట్లాడే తెలుగు నన్నయ తిక్కన రాసిన తెలుగు ఒకటేనా? అసలు వారు తీసుకెళ్ళి అని రాసినరా, కొనిబోయి అని రాసినరా? 

భాష కాలానుగుణంగా మార్పులు చెందుతుంది తప్ప జడంగా వుండదు. అది తెలంగాణలో నైనా ఆంధ్రా లో నైనా. అంతే కాదు ఆ మార్పు ప్రాంత ప్రాంతానికి ఒకోలాగా ఉంటుంది అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి, ఇతర భాషల ప్రభావాన్ని బట్టి. అందుకే అనంత పురం భాషకు చిత్తూరు భాషకు శ్రీకాకుళం భాషకు గల తేడాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. వాస్తవాలు ఇలా ఉండగా కేవలం తెలంగాణా భాషే అపభ్రంశాల మాయం అని చెప్పజూసే మనిషికి ఏం చెప్పగలం? 

ఏ ప్రాంతంలో నైనా కొన్ని పాత కాలంనుంచి వచ్చిన పదాలు నిలిచి ఉంటయి. కొన్ని ప్రాంతాలలో మార్పులు చెందుతయి. మన ప్రాంతంలో ఉన్న పదాలు మాత్రం సరైనవి, ఇతర ప్రాంతాలలో వాడుకలో ఉన్న పదాలు మాత్రం అపభ్రంశాలు, పరభాషా పదాలు అనడం ఎలాంటి వాదన?   

తెలుగులో తమిళ, కన్నడ, ఒరియా సంస్కృత పదాలు కలిస్తే ఫరవాలేదు. కాని ఉర్దూ పదాలు కలిస్తే మాత్రం నేరం లాగ మాట్లాడుతారు. అసలు ఇక్కడి భాషను, సంస్కృతిని ఇంతగా చిన్న చూపు చూసే వారు ఎందుకు మమ్మల్ని పట్టుకొని వేలాడుతరో అర్థం గాదు!

Friday, July 1, 2011

లగడపాటిని ఎందుకు తిడుతార్ర బై!

ఎంపీ రాజయ్య హటాత్తుగా లగడపాటి మీదికి తిట్లు లంకించు కున్నడు. లగడపాటి ఖబర్దార్ అట! మన కాంగ్రెస్ నాయకులు అధిష్టానం దగ్గర చిత్తై, తమ డొల్లతనం బయట పడుతుందనుకున్న ప్రతి సారీ చేసే పనే ఇది. లగడపాటినో, రాయపాటినో, కావూరినో తిట్టుడు. ఏదో గొప్ప విజయం సాధించి నట్టు జబ్బలు చరుచుకొనుడు!

రాజాన్నా! ఇది చాల పాత ఆట. ఇప్పటికే మీరు చాలా సార్లు ఈ ఆటల రానించిన్రు. ఇంక ముందు గూడ నువ్వు, నీ తోటి బఫూన్లు ఇట్లాంటి ఆటలాడి ప్రజల్ని మెప్పిస్తమనుకుంటే తప్పులో కాలేసినట్టే. ప్రజలు అన్ని గమనిస్తనే ఉన్రు. సమయం కోసం ఎదురు చూస్తున్రు. చూసి చూసి మీకు దిమ్మ దిరిగే జవాబు ఇస్తరు.

రాజీనామాలు చెయ్యమంటే ఒక్కనికి చాతగాదు. పైనించి మాకంటే పెద్ద తెలంగాణా వాడి లేదని పోజులు. మీకు చాత గాకపోతే మాటని గాదని చెప్పున్రి. ప్రజలు వాళ్ళ తొవ్వ వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని నిచ్చెనెక్కలేనోల్లు ఎవరెస్టు ఎక్కుత మన్నట్టు బిల్డప్పు ఇవ్వకున్రి. మీకు తెలంగాణా వచ్చుడు ఇష్టం లేదంటరా, ఆ ముక్క సాఫ్ సాఫ్ జెప్పున్రి. అంతేగని ఈ నల్లికుట్ల ఎవ్వారాలు పనికి రావు.

మీ మీటింగుల నాటకాలు ఇప్పుడు ఎవ్వడుగూడ చూసి నమ్ముతలేడు. మీరు చెయ్యగలిగితే కేంద్రం దిమ్మ దిరిగే విధంగా రాజీనామాలు చేసి ప్రజల దగ్గరికి రాన్రి. అప్పుడు ఆంధ్రా ఎంపీలు గూడ రాజీనామాలు చేస్తరా, చెయ్యరా అన్నది మీకనవసరం. అందరు చేస్తే బలాబలాలు తేల్చనీకి ప్రజాకోర్టు ఉండనే ఉన్నది. ముందు మీ నిజాయితీ ఎంత ఉన్నది అనే విషయం బయటికి రావాలె.

చెయ్యమంటరా, నోర్మూసుకొని గమ్మున ఉండున్రి. ప్రజలు తేల్చుకుంటారు మిమ్ముల ఏం జేయ్యాల్నో, తెలంగాణా ఎట్లా తెచ్చుకోవాలనో. అంతేగాని దొంగనాటకాలు ఆడుకుంట ఇట్లనే కాలం గడుపుతమని, ప్రజలని ఇంకా మభ్యపెట్ట గలుగుతమని మీరు అనుకుంటే అది కేవలం మీ భ్రమ!