Wednesday, November 28, 2012

ఒకనిది వికటాట్టహాసం, ఇంకోనిది చిరుదరహాసం.


ఆయన అసెంబ్లీల వికటాట్ట హాసాలు చేసేటోడు. అవును, ప్రతిపక్ష నాయకులు ఆయన చేస్తున్న దోపిడీలు చూసి కడుపు మండి కోపం తోటి, ఆవేశంగ చేసే విమర్శలు చూసుకుంట వెకిలి వికటాట్ట హాసాలు చేస్తుండేటోడు. ఎవనికైనా తనను  విమర్శిస్తూ తిడుతుంటే, పౌరుషం పెరుగుతది, కోపం వస్తది. లేక నిజంగా తాను చేస్తున్నది తప్పే అని అనిపిస్తే తల ఎక్కడ పెట్టుకోవాలేనా అనిపిస్తది. కాని ఆ రాజన్నకు అట్ల ఎన్నడూ అనిపిచ్చినట్టు కనపడలేదు. తనను ప్రతిపక్ష నాయకులు విమర్శించినంత సేపూ వెర్రి నవ్వులు నవ్వడం రాజన్నకు సర్వ సాధారణం. ఆ నవ్వుల కారణం స్థూలంగా అర్థమైనా అసలు కారణం మాత్రం అస్పష్టమే.

"వెర్రి నాయనలారా! మీరెన్ని తిట్టినా నేను చేసేది చేస్తూనే ఉంటా. మీరు ఏమీ పీకలేరు."

"పిచ్చోల్లారా మీరు లేవనెత్తి తిడుతున్నా విషయాలు చాలా చిన్నవి, నేను లక్షల కొట్లలో తింటే, మీరు ఒకట్లకు, పదులకు ఆవేశ పడుతున్నారు. అసలు విషయం తెలిస్తే ఇంకేమవుటారో!"

"మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను తిన్నదాంట్లో పావు భాగం కూడా తినలేక పోయారు. ఎందుకు మీ బతుకు? నన్ను చూడండి... ఎలా తింటున్నానో!"

ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకోవచ్చు. అయితే స్థూలంగా వీటన్నిటి అర్థంఒక్కటే... తాను చేస్తున్న అక్రమాలను చూసుకొని అదో గొప్పతనంగా విర్రవీగడం.


ఇక పోతే ఆయన పుత్రరత్నం సంగతి మరీ విచిత్రం. ఎవడైనా దొంగ ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో ఇరుక్కుని నెలలకు నెలలు జిల్లాలో మగ్గుతుంటే, ఇసుమంతైనా సిగ్గూ, శరం ముసురుకుంటది. కెమెరాలకు, చూసే జనానికి మొకం చాటెయ్యాలని అనిపిస్తది. కాని లక్ష కోట్లు భోంచేసిన ఈ నయా (వి)నాయకుని రూటే వేరు. చంచల్ గూడా జైలు గేటులోంచి వస్తూ, పోతూ ఒకటే దండాలు దరహాసాలు! ఏదో స్వతంత్ర పోరాటంలోనో, ఇతర ప్రజా పోరాటాల్లోనో పాల్గొని అరెస్టయినట్టు బిల్డప్పు! తండ్రి నవ్వుకు కారణం కనిపెట్ట వచ్చేమో కాని, ఈ కొడుకు నవ్వుకు కారణం కనిపెట్టడం మరీ కష్టం.


"పిచ్చి సిబిఐ! మీరెన్ని కేసులు పెట్టినా నన్ను ఏమీ పీకలేరు. అమ్మగారి అసలు గుట్టుమట్లు నాదగ్గర ఉన్నయ్. అవి నా దగ్గరున్నంత వరకు, మీరు నా వెంట్రుక కూడా కదపలేరు."

"ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతగా నా అవినీతి బయట పెట్టినా నాయకులందరూ నా జైలు చుట్టే తిరుగుతున్నారు. జనాలు నా చెల్లెలి యాత్రలకే వస్తున్నారు. అలాటి జనం ఉన్నంత వారకు మీరు నన్నేం చేయగలరు?"

"మీరు నన్ను జైల్లో పెట్టాననుకుంటున్నారు. కాని ఇక్కడ జైలరుతో సహా అంతా నావాళ్ళే! నాకు రోజుకో మొలఖాత్, పూటకో బిర్యానీ, గంటకో మర్యాద! నా పార్టీ ఆఫీసులో కూడా ఇంట సౌకర్యంగా వుండదు."

ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం. తాను చేసిన అక్రమాలను చూసుకొని అదో గొప్పతనంగా మురిసి పోవడం.
 

Sunday, November 25, 2012

తెలంగాణా సమరభేరి

సూర్యాపేటలో తెలంగాణా సమరభేరి దద్దరిల్లింది. గత కొన్ని నెలలుగా స్తబ్దంగా వున్నా తెరాస క్యాడర్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తినట్టు స్పష్టంగా కనిపించింది.

ఈ సభ ముఖ్య అజెండా... నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తూ, తెలంగాణా ఉద్యమానికి వెన్ను పోట్లు పొడుస్తూ, ఇంకోవైపు జగన్ పార్టీ వైపు మోరలేత్తే విధానాలను ఎండగట్టడం. అలాగే పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తూ తెలంగాణా ప్రజలను మభ్యపెట్టే వైకాపా, తెదేపాల ఎత్తులను చిత్తు చేయడం.

దేశపతి శ్రీనివాస్, స్వామీ గౌడ్ ల ఉపన్యాసాలు సభికులను ఆకట్టుకున్నాయి. యధా ప్రకారం కెసిఆర్ ఉపన్యాసం సభికులను ఉద్యోన్ముఖులుగా ఉత్సాహ పరుస్తూ, ప్రత్యర్థుల కుట్రలపై ప్రజలకు సులభ శైలిలో అవగాహన కలిగించింది. తనకే సాధ్యమైన రీతిలో ఆయన జనాన్ని ఆకట్టుకున్నారు.

ఒకాయిన చంద్రన్న రాజ్యం రావాలె అంటడు... ఇంకొకాయన రాజన్న రాజ్యం కావాలంటడు. మనకు ఏ రాజ్యం రావాలే? మనకు కావాలె తెలంగాణా రాజ్యం. తెలంగాణా రాజ్యం కావాలన్నోల్లు చేతులెత్తండి.

(అందరూ చెయ్యెత్తారు)

చంద్రబాబు విశ్వాసనీయత ఉండాలే అంటున్నడు. ఎన్నికల ముందు తెలంగాణా ఇస్తనని వాగ్దానం చేసి, తీరా అది ప్రకటించగానే అడ్డుకోవడం విశ్వసనీయతా? చంద్రబాబుకు విశ్వసనీయత అంటే అర్థం తెలువదు. సింగపూర్ లోనో, హెరిటేజ్ మాల్ లోనో కొంటే వచ్చేది కాదు విశ్వసనీయత.  

ఇలా సాగింది ఆయన ఉపన్యాసం.

ఇంకా దేశపతి శ్రీనివాస్ జగన్ ఫాలోవర్లను 'జఫా'లు గా వర్ణించడం జనాన్ని ఆకట్టుకుంది.


   

ద్రోహ పర్వం



ఒక వైపు తెలంగాణా ప్రజలు భగభగ మండుతుంటే వాళ్ళు హంద్రీ-నీవా విజయ యాత్రలు చేసుకుంటున్నరు  తెలంగాణకు రావలసిన నికర జలాలపై కట్టవలసిన ప్రాజెక్టులకు ఎగనామం పెట్టి, వరదనీరు వాడుకునే పేరు చెప్పుకొని ఈ ప్రాజెక్టు కట్టుకున్నరు. ఇప్పుడు తెలంగాణాలో ఉన్న ప్రాజెక్టులకు కూడా కృష్ణా జలాలు ఇవ్వకుండా, దీనికి నలబై TMCల నీళ్ళు వదిలిన్రు. తెలంగాణా నీళ్ళను దోపిడీ చేసి తమవైపుకు తిప్పుకుని దర్జాగా వాడుకునుడు వాళ్ళ దృష్టిలో ఒక విజయ యాత్ర. కాని ఆ యాత్రల పొన్నాల, సునీత, అరుణ పాల్గొనుడు తెలంగాణా రొమ్ము మీద తన్నుడుతోటి సమానం. తెలంగాణా ప్రజలారా, వీళ్ళు చేస్తున్న నమ్మక ద్రోహాలను ఎన్నటికీ మరువొద్దు.

ఒక వైపు కాంగ్రేసు విజయ యాత్ర ఇట్ల వుంటే, ఇంకో వైపునుండి చంద్రబాబు దండయాత్ర చేయ బట్టిండు. గాయిన అదికారంల ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు తోటి హాట్ లైన్ పెట్టుకొని, వాళ్ళు చెప్పినట్టు ఆడిండు, సబ్సిడీలు దండుగ అని చెప్పి పుస్తకాలు కూడా రాసిండు. ఇప్పుడేమో అప్పుడు చేసిన పనులకు విరుద్ధంగా అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్నడు.  KG నుండి PG వరకు ఫ్రీగా చదువు చెప్పిస్త నంటున్నడు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తూ, రుణాల మాఫీ, ఉచిత వైద్యం, నేరుగా డబ్బులు, నిరుద్యోగ భ్రుతులు... ఒకటేమిటి, అన్నీ చేస్త నంటుండు.

2004ల సాధ్యం కాని పనులు ఇప్పుడ గూడ సాధ్యం కావని ఆయనకు తెలుసు. మరి ఆయినా గట్ల ఎందుకు చెప్తున్నడు? అధికారం కోసం. అధికారం కోసం ఎన్ని అబద్దాలైన చెప్పడం ఆయనకు పాత అలవాటే. మరి గిన్ని అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇస్తనని ఇంకొక అబద్ధం ఎందుకు చెప్తలేడు? ఇన్ని అబద్దాలతోని ఇంకొక్కటి ఎక్కువ చెప్తే ఏంది, చెప్పలేడా... అని మనకు అనిపించ వచ్చు. కాని గా మాట చెప్తే సీమాంధ్రల కథ అడ్డం తిరుగుతది అని ఆయన భయం. అందుకే చెప్పడు. మరి సీమాంధ్ర జనానికి వ్యతిరేకంగ ఒక మాట చెప్పడానికే దడుసుకునే వానికి ఊడిగం చేసుడు లోని ఔచితత్యం ఏందో తెలంగాణా లోని తెలుగు తమ్ముళ్ళు ఆలోచించు కోవాలె. లేక పొతే వాళ్ళు గూడ చంద్రబాబు లెక్క చరిత్ర హీనులు అవుతరు.

చంద్రబాబు పని ఇట్లా వుంటే మందకృష్ణ లాంటి దళిత నేతలు ఆంద్రజ్యోతి రాధాకృష్ణ బాడుగ మాటల్ని నిజం చేస్తున్నరు. వీళ్ళ మనసులు మార్చేతందుకు చంద్రబాబు అంత గొప్ప దేవదూత ఎప్పుడైండో ఎవరికీ అర్థంగాని విషయం గాదు. ఆయినా అధికారం లోనికి వస్తే, SCకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని అనలేదు, పోనీ ఇప్పుడన్నా ఇంకేదైనా ముఖ్యమైన పదవి ఇస్తానని చెప్పలేదు. మరి అందరూ ఒప్పుకున్నా ABCDలు ఆయన ఒప్పుకున్నందుకే అంతటి చంద్ర మర్యాదలా? దీని వెనుక ఉన్న బాడుగలు ఏంటివో పెరుమాండ్ల కెరుక.     

ఇంక పొతే  ఇంకొకామె రాయలసీమ గూండాలను వెంట తెచ్చుకొని మరొక ప్రస్థానం చేస్తుంది. తెలంగాణా ఏర్పడితే వీసాలు తెచ్చుకోవాలి అని ప్రచారం చేసిన మనిషి, తెలంగాణాకు వ్యతిరెంకంగా పార్లమెంటులో ప్లకార్డు పట్టుకొని పరుగెత్తిన మనిషి తెలంగాణా ఆత్మా బంధువులని విషప్రచారం చేస్తుంది. ఈ రాజన్న, చంద్రన్న అసలు రూపాలు తెలంగాణా ప్రజలు ఇంకా మరిచి పోలేదు. ఒకడు తెలంగాణా పాలిత సైంధవ పాత్ర వహిస్తే, ఇంకొకడు శకుని పాత్ర వహించిన విధానం ఇంకా తెలంగాణా ప్రజల మదులల్ల మెదులుతనే వుంది.

Saturday, November 17, 2012

తల్లిని పొగిడితే పిల్ల గునిసిందట


ఒక నాయకుడు:
ఆయన కరడు గట్టిన సమైక్యవాది. కాని ప్రజలు చెంప చెల్లు మనిపించి గద్దె దింపిన తర్వాత వోట్లకోసం జై తెలంగాణా అంటడు. తెలంగాణా వస్తున్న తరుణంల తెప్ప తగలేస్తడు... రెండుకళ్ళ సిద్దాంతం తోటి రెండు నాలుకల జపం చేస్తడు. ఉత్తరం ఇస్తానంటడు... ఉత్తుత్తి నాటకం ఆడుతడు. అయితే ఎన్నికలు దగ్గెర పడుతుంటయి. వోట్లు అడిగే టందుకు జనం కాడికి రావలసి వస్తది. జనం మధ్యన పాదయాత్రలు చేయవలసి వస్తది. అయితే జనం తన్ని, తరిమి కొడుతరేమోననే భయం మొదలైతది. అందుకోసం కుట్రలు పన్నుడు శురూ జేస్తడు.

ఒక దళిత ఉద్యమ కారుడు:
ఆవేశంగ ఉపన్యాసాలిస్తడు. తనకన్నా గొప్ప తెలంగాణా వాది  లేడని చెప్తుంటడు. ఎప్పుడు చూసినా ఉద్యమానికి వెన్నుపోటే పొడుస్తుంటడు. ABCD ఇప్పిస్త అనంగానే అసలు ఆయన గెలుస్తడా ఓడుతడా అని చూడకుండ, తన మనుషులతోటి సమైక్యవాద నాయకునికి రెండంచెల వలయాన్ని కల్పించి తెలంగాణా మొత్తం తిప్పిస్తడు. ఆ నాయకునికి ఇంకా తృప్తి కలగక పోతే, తెలంగాణా పోరాట యోదులకు కులం రంగు పూసి, వారి ఇళ్ళ మీదకు తన చెంచాలను పంపిస్తాడు, దాడులు చేయిస్తడు. అట్రాసిటీ కేసులు పెట్టిస్తడు.

ఒక పాత్రికేయుడు:
పగటి వేషగాడి పాదయాత్రకు ఒక పచ్చ కామెర్ల పాత్రికేయుడు 'చంద్రయాన్' అని పేరు పెడుతడు. పార్టీ కరపత్రంకన్న అధ్వాన్నంగ తన పత్రికను మార్చి తరించి పోతడు. అరచేతి మీద స్వర్గాన్ని చూపెట్టినట్టు, పేపరు మీద ప్రభంజనాన్ని సృష్టిస్తడు. నాలుగు సంవత్సరాల క్రితం ఏ దళిత ఉద్యమ కారులచేత శృంగ భంగం పొందిండో, వారినే తెలంగాణా ఉద్యమం మీదకు ఉసికోల్పే ప్రయత్నాలు చేస్తడు.

ఒక ఆమాత్యురాలు:
పుట్టిన జాతి మీద ఏనాడూ ప్రేమ చూపెట్టిన దాఖలాలు లేవు, కోట్లు కూడపెట్టుకునే యావ తప్ప. కులాన్ని వదిలేసి రెడ్డిగా మారి దశాబ్దాలు గడిచినా, అవసరార్థం మాత్రం కులం గుర్తుకు వస్తది. తెలంగాణా కోసం తల్లి చూపెట్టిన తెగువలో ఒక శాతమైనా జన్మలో ఎప్పుడూ చూపక పోయినా, ఆ మాట ఎవరన్న అంటే, అది తన కులాన్ని తిట్టినట్టు కలరింగు. ఇలాంటి వారిని దళితులంటే అది దళితులకే అవమానం.

Thursday, November 15, 2012

జల వివక్ష యజ్ఞం


-సీమ ప్రాజెక్టులకు ఒక న్యాయం.. తెలంగాణ ప్రాజెక్టుకు మరో న్యాయం
-సోమశిలకు అడ్డురాని నిధుల కొరత..యుద్ధప్రాతిపదికన హంద్రీనీవా 
-పంప్‌హౌజ్‌లు తయారైనా ప్రారంభంకాని భీమా-2
-అప్రోచ్ చానల్ లేక ముందుకు సాగని భీమా-1 లిఫ్ట్
-కల్వకుర్తి ఫేజ్-2లో తట్ట సిమెంట్ పనీ మొదలుకాలేదు
-నీటి లభ్యత సాకుతో పాలమూరు-రంగాడ్డి లిఫ్టుకు కొర్రి 


హైదరాబాద్, నవంబర్ 14 (టీ మీడియా):సీమాంధ్ర ప్రాజెక్టులంటే.. ఎంత కొరత ఉన్నా.. నిధులు పెల్లుబికి వస్తాయి. అదే తెలంగాణ ప్రాజెక్టులంటే పైసా కూడా రాలదు! సీమాంధ్ర ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసుకుంటుంటే.. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులు మాత్రం.. ఎక్కడేసిన గొంగళి అక్కడేనన్నట్టు మూలుగుతుంటాయి! ఒకే తరహా అన్యాయం.. పదే పదే! నెల్లూరు జిల్లాలో రూ.800 కోట్లతో చేపట్టనున్న సోమశిల ఎత్తిపోతల పథకానికి నిధుల కొరతను తోసిరాజని ప్రభుత్వం ఇటీవలే రూ.150 కోట్లు మంజూరు చేసింది. మరోవైపు అనంతపురం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు పనులను రాత్రింబవళ్లు యుద్ధవూపాతిపదికన పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. మహబూబ్‌నగర్ జిల్లాలో పంప్‌హౌజ్ నిర్మాణం పూర్తయి ఏడాదిదాటినా భీమా-2 ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్-1కు లింక్ చానల్ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో ఈ పథకం నిరుపయోగంగా మారింది.

అలాగే ప్రధాన రిజర్వాయర్ నుంచి పంపింగ్ స్టేషన్ వరకు అప్రోచ్ చానల్ పనులు పూర్తికాకపోవడంతో మిగిలిన పనులన్నీ అయిపోయినా భీమా-1 ఎత్తిపోతలకు మోక్షం కలగడం లేదు. కల్వకుర్తిలో కేవలం మొదటి దశ పనులు మాత్రమే పూర్తి కాగా 2.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన కల్వకుర్తి ఎత్తిపోతల ఫేజ్-2, ఫేజ్-3 గురించి పట్టించకున్న నాథుడే లేడంటే తెలంగాణ ప్రాజెక్టులపై పాలకులకు ఉన్న ప్రాధాన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. భీమా-2 ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్-1 పనులన్నీ పూర్తయ్యాయి. అయితే జూరాల నుంచి రామనపాడు వరకు 17 కిలోమీటర్ల లింక్ చానల్ నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొదటి దశ పూర్తయి, 13 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. అయితే ఈ పథకం ఎక్కువ శాతం ఉపయోగపడేది ఫేజ్-2, ఫేజ్-3లోనే. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫేజ్-2లో ఇంత వరకు తట్ట సిమెంట్ పని కూడా జరగలేదు. ఇక్కడ రెండో దశ పనులు పూర్తయితే తప్ప మొత్తం 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు.

సాగర్‌ను పక్కనపెట్టి...
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీళ్లు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న సీమ సర్కార్, సీమాంధ్ర ప్రాజెక్టు విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. హంద్రీనీవా ప్రాజెక్టు వాస్తవంగా కర్నూలు జిల్లాలో హంద్రి నది, చిత్తూరు జిల్లాలోని నీవా నది ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టు. అయితే పేరులో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న నదుల పేరు పెట్టుకుని నీళ్లు మాత్రం శ్రీశైలం నుంచి తీసుకెళ్లనున్నారు. అలాగే కర్నూ లు జిల్లాలో గాలేరు, చిత్తూరు జిల్లాలోని నగరి నదుల పేరుతో ప్రాజెక్టు నిర్మించుకుంటూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా నీళ్లు తరలించుకుపోయేందుకు సీమ సర్కార్ వ్యూహరచన చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు వరద నీటిని ఉపయోగించుకోవడం ద్వారా డిజైన్ చేసినవి. అయితే సర్కార్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలం కింద ఉన్న సాగర్ ఆయకట్టును గాలికి వదిలేసి, వరద నీటితో సంబంధం లేకుండా సీమలోని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చేందుకు తెర కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. శ్రీశైలంలోని నికర జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు పట్టించుకోకుండా, వరద నీటితో డిజైన్ చేసిన ప్రాజెక్టులకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణపై ప్రాజెక్టులపై వివక్ష...
కరువు జిల్లా మహబూబ్‌నగర్‌లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సర్కార్ రకరకాల కొర్రీలతో కాలయాపన చేస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణం సంగతి పక్కనపెడితే కనీసం సర్వేకు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి డీకే అరుణ నేతృత్వంలో ఆగస్టు నెలలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా సమావేశమై ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆయన కచ్చితమైన హామీ ఇచ్చారని మీడియాకు వెల్లడించారు. అయితే మూడు నెలలు పూర్తికావస్తున్నా ఈ ప్రాజెక్టు అతీగతీ లేకుండాపోయింది. పైగా దీనిని తొక్కిపెట్టేందుకు సీమాంధ్ర పాలకులు తీవ్రస్థాయిలో కుట్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న ప్రాజెక్టులే పూర్తికాకపోతే, మరొ కొత్త ప్రాజెక్టు ఎందుకు అని ఒకసారి, అసలు ఈ ప్రాజెక్టుకు నీటి లభ్యత ఎక్కడిదని మరొకసారి అభ్యంతరాలు చెబుతూ ప్రాజెక్టు ఫైలుని అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలంగాణ రైతులు ఆరోపిస్తున్నారు. పెన్నా నదిలో నీటి లభ్యత అంతంత మాత్రగానే ఉన్నప్పటికీ అక్కడ రూ.800 కోట్లతో నిర్మించనున్న సోమశిల ప్రాజెక్టుకు ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా తొలి విడత కోసం రూ.150 కోట్లు సైతం విడుదల చేసింది. అదే తెలంగాణలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్న పాలమూరు-రంగారెడ్డి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.

Thursday, November 1, 2012

అధికారంలో కోస్తే...


అధికారంలో కోస్తే
నేరుగా డబ్బు
మీ చేతుల్లోకి
క్యాష్ ట్రాన్స్ ఫర్!

అధికారం లోకొస్తే
విద్యార్థులకు
ఎల్ కేజీ నుంచి పీజీ దాకా
అంతా ఉచితమే!

అధికారం లోకొస్తే
రైతుల అప్పులు
సర్వం మాఫీ

అధికారం లోకొస్తే
వ్యవసాయానికి
తొమ్మిది గంటలు కరెంటు!
వో భీ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ!

బీసీలకు పదివేల కోట్లు
వంద సీట్లు
ఎస్సీలకు ఎస్టీలకు
ఎన్నో... ఎన్నో...

అంతా బాగానే వుంది సారూ...
అధికారం లోకి వస్తే
మరి తెలంగాణా సంగతి
ఏం జేస్తరు?

కాంగ్రెసుతో కుమ్మక్కై
మీరంతా నామీద
కుట్ర పన్నుతున్నారు!
లేక పోతే మరేమిటి?
అధికారంలో వున్న
కాంగ్రెసును చెప్పాలి కాని
ఆ విషయం నేనెలా చెప్తాను?

&*^~%$^#*&*%!!!

సీమాంధ్ర బ్రాహ్మణులారా, మేల్కోండి


తాజాగా విడుదలైన మంచు విష్ణు సినిమా, దానిలో బ్రాహ్మణ కులాన్ని కించ పరచిన విధానం, దరిమిలా బ్రాహ్మణులపై మోహన్ బాబు గూండాలచే జరపబడిన దాడి, అవి కేవలం యాధృచ్చికమైన విషయాలు కావు.

ఈ సమైక్యరాష్ట్రం సీమాంధ్రకు చెందిన రెండు అగ్ర కులాల వారికి ఆడ్డాగా మారింది. అధికారాన్ని, ప్రాంతీయ, కుల తత్త్వాలను, ధనాన్ని జోడించి ఈ వర్గాలు మరింత బలంగా వేళ్ళూను కుంటున్నాయి. వీరికి కాంట్రాక్టులు ఇవ్వడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డు రావు. వీరు పదవులు, ప్రమోషన్లు ఇవ్వడానికి రూల్సు అడ్డు రావు. వీరి అడ్డగోలు సినిమాలకి సెన్సార్లు అడ్డురావు. పైగా ఇదేమని అడిగిన వాడికి లాఠీ దెబ్బలతో వీపు వాచి పోతుంది.

ఇక్కడ వీరి రాతే చట్టం, వీరు చేసేదే ఆలోచన, వీరి మాటే వేదవాక్కు. దశాబ్దాలుగా అధికారం కొందరి చేతుల్లో కెంద్రీకరింప బడడం వల్ల జరిగిన పర్యవసానం ఇది.

ఇంత పెద్ద రాష్ట్రంలో వీరు తప్ప ఇతర బలహీన వర్గాలు ఎన్నటికైనా అధికారంలోకి రావడమనేది కలలోని మాట. ఇక్కడ బలహీన వర్గాలంటే మరికొంత ఎక్కువ వివరించాలి. పైన చెప్పిన సీమాంధ్ర ఆధిక్య వర్గాలతో పోల్చినప్పుడు, తెలంగాణా అగ్రకులాల వారిని, బ్రాహ్మణులు మొదలైన ఇతర అగ్ర కులాల వారిని కూడా బలహీన వర్గాలు గానే పరిగణించాలి. ఎందుకంటే ఈ 'ప్రత్యేక ఆధిక్య వర్గాలతో' పోటీ పడి మిగతా వారు ఎన్నటికీ అధికారంలోకి రాలేరు.రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి దాదాపు ఐదు దశాబ్దాలుగా కేవలం రెండు కులాల పరిపాలనలోనే ఉండడమే అందుకు నిదర్శనం.

తెలంగాణా ఉద్యమం జరుగుతున్నది కూడా ఈ ప్రత్యేక ఆధిక్య వర్గాల పైనే అని గుర్తించాలి. ఆ విషయం మొదటినుండి తెలంగాణా వాదులు చెప్తూనే వస్తున్నారు. రాష్ట్ర విభజన మాత్రమే వీరి అధికారానికి గండి కొట్టగలదని తెలంగాణా వాదులు భావించారు. తెలంగాణా వాదాన్ని బలంగా అడ్డుకుంటున్నది కూడా ఈ ఆధిపత్య వర్గాలే అన్న విషయం కూడా గుర్తించ వలసి ఉన్నది.

ఇక విషయానికి వస్తే, ఈ ఆధిపత్య వర్గాలు తమకు లభిచిన ఆధిక్యతతో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్వచించడం మొదలు పెట్టాయి. తాము ఏది చెప్పితే, అదే చట్టం, తాము ఏది చేస్తే అదే న్యాయం అన్న ధోరణి అవలంబించ సాగాయి. చుండూరు, కారంచేడులలో మానవ హననాలైనా, ప్రజలకు ఇష్టంలేని యాత్రల పేరుతో గూండాలను వెంటేసుకుని తెలంగాణా వీరు చేస్తున్న వీరంగాలైనా ఈ కోవలోకే వస్తాయి.

ఇప్పుడు తాజాగా వచ్చిన బ్రాహ్మణ వివాదం కూడా కొత్తదేమీ కాదు. ఈ వర్గాల వారు చేసే సాంస్కృతిక దాడులలో ఇది ఒకటి. బలహీన వర్గాలను, తెలంగాణా వారిని, బ్రాహ్మణులను వీరి సినిమాలలో నవ్వులాట వస్తువులుగా మార్చుకోవడం మొదటి నుండి చూస్తూనే వున్నాం. మంత్రాలకు బదులు బ్రాహ్మణులు బూతులు చెప్పినట్టు చూపిస్తారు. సీమాంధ్ర కళాకారులతో కృతకమైన తెలంగాణా భాష మాట్లాడిస్తూ ఇదే తెలంగాణా సంస్కృతి అని భ్రమింప జేస్తూ కామెడీ చేయిస్తారు. కమెడియన్లు ఎప్పుడూ బ్రహ్మణులో, లేదా నిమ్న కులాల వారో మాత్రమే ఉంటారు. ఇక తెలంగాణాకు చెందినా బీసీలే వారి సినిమాలలో రౌడీ షీటర్లు, నిజాలు ఎలా వున్నా.

ఈ ప్రత్యేక ఆధిక్య వర్గాల వల్ల ప్రస్తుతం తెలంగాణా ప్రజలు ఎక్కువ నష్ట పోతున్నప్పటికీ, వీరిని ఇలాగే వదిలేస్తే రేపు సీమాంధ్ర లోని మిగతా వర్గాలను కూడా అదే పద్ధతిన కబలించ గలరనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఎవరో పెద్దాయన చెప్పినట్టు, దాడి చేయబడ్డది పోరుగువాడి పైనే అని ఉపేక్షిస్తే, రేపు ఆ దాడి మనమీదే కావొచ్చు. అందుకే, సీమాంధ్ర పాలిత వర్గాలు త్వరగా మేల్కొవాల్సిన అవసరం వుంది.


ఇప్పటికే సీమాంధ్రకు చెందిన ST, SC, BC లు రాష్ట్ర విభజనకు బహిరంగ మద్దతు ఇస్తున్నారు. మిగతా అగ్రవర్గాలు, బ్రాహ్మణులు కూడా తగు సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోతే, దోపిడీ శక్తులకు ఊతం కల్పించిన వారే అవుతారు. ఈ దాడి మంచు మోహాన్ బాబు బ్రాహ్మణులపై చేసిన దాడి కాదు, ఆంధ్రప్రదేశ్ పాలక వర్గాలు పాలితులపై చేసిన దాడి.