Saturday, August 31, 2013

తక్షణ కర్తవ్యం

తెలంగాణా ప్రకటన వచ్చి అప్పుడే నెలరోజులు గడిచి పోయింది. సెక్రెటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సీమాంధ్ర ఉద్యోగుల ఆట విడుపు స్థలాలుగా మారిపొయాయి. సీయం, డీజీపీ అధ్వర్యంలో బంద్ లు, ధర్నాలు, ర్యాలీలు సీమాంధ్ర పురవీధుల్లో యధేచ్చగా కొనసాగుతున్నాయి. పోలీసుల కనుసన్నలొ విగ్రహాల కూల్చివేతలు, తెలంగాణా ప్రాంతీయులపై దాడులు, బంద్ లకు సహకరించని వాహనాలపై ద్వంసకాండ నిత్య క్రుత్యాలుగా మారాయి. సీమాంధ్ర నెలరోజులుగా స్థంబించి పోయింది. అయినా కూడా ఒక్క లాటీ దెబ్బ తగల్లేదు. ఒక్క రబ్బరు బుల్లెట్  పేల లేదు.

ఎంత తేడా, అక్కడికీ ఇక్కడికీ? ఇక్కడ ఒక సమ్మెకు, ఒక ధర్నాకు, ఒక మార్చికి.. చివరికి దీక్షకి కూడా అనుమతి లభించదు. సమ్మె మా హక్కు అని జనం బయలుదేరితే లాటీలు విరుగుతాయ్. బుల్లెట్లు పేలుతాయ్. ఇక్కడి వారు సమ్మె చేస్తామని ప్రకటిస్తే, వంతులవారీగా కమీషనర్, డీజీపీ, హొమ్ మంత్రి, ముఖ్యమంత్రి ప్రెస్ మీటలు పెట్టి బెదిరింపు ప్రకటనలు చేస్తుంటారు.

అదే సీమాంధ్రలో ఎంత అల్లకల్లోలం చెలరేగినా ఎవడూ పలకడు. పైగా ముఖ్యమంత్రికి అంటా సవ్యంగానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. వందలాది జాతీయ నాయకుల విగ్రహాలు పగిలినా, దాడులు జరిగినా శాంతియుత ఉద్యమంగా కనిపిస్తుంది. వాళ్లకు ఇష్టంలేని ఉద్యమాన్ని ప్రజలు చేస్తే, వాళ్ళ తలలు పగులగొట్టి ఉద్యమాన్ని అశాంతిగా మారుస్తారు. అదే వాళ్లకు కావలసిన ఉద్యమానికి ప్రజలు రాకపోయినా రౌడీలను ఉపయోగించి, స్కూలు పిల్లలను సేకరించి మీడియా ముందు ప్రదర్శిస్తారు. ఇంకా సరిపోక పొతే కూలీలను పెట్టి విగ్రహాలను పగలగొట్టిస్తారు. ఆర్టిస్టులను పెట్టి రోడ్లమీద బొమ్మలు గీయిస్తారు. కూలీ గాయకులతో గీతాలు పాడిస్తారు. అధికారం మీది, డబ్బులు మీవి, మీడియా మీది... కాబట్టి ఏమైనా చేస్తారు.

కానీ చరిత్ర ఎప్పుడూ మీది కాదు. అందుకే ఒక అనివార్యత సంభవించింది. అందుకే జూలై ముప్పైన కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ అనివార్యత వల్లనే సీమాంధ్ర దోపిదీదార్లు ఎన్ని రకాల కుట్రలు చేస్తున్నా, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా తన నిర్ణయాన్ని మార్చుకోలేక పోతుంది. ఇప్పుడు మార్చుకొనే పరిస్తితి కూడా లేదు. ఇప్పుడు మార్చుకొని సాధించేదీ లేదు.

కాని, విభజన ప్రక్రియ నిదానిస్తున్న కొద్దీ దోపిడీ దార్లకు ఆశలు పెరుగుతాయి. దొంగసొత్తు దక్కించుకోగల మన్న నమ్మకం పెరుగుతుంది. దానికోసం రాజీడ్రామాలు, బస్సు యాత్రలు, జైలు దీక్షలు శురూ అవుతాయి. సీమాంధ్ర ప్రజలు మరింత గందర గోళం లోకి నెట్టబడుతారు. సీమాంధ్ర ప్రజలు మంచోల్లే కావచ్చు, కాని దేవుళ్ళు కారు. అప్పనంగా హైదరాబాదు పట్టుకోస్తామని వాళ్ళ నాయకులు చెపుతుంటే కాదనడానికి, ఆశ పడడానికి. సాగదీత ఎక్కువయ్యే కొద్దీ వారి ఆశ కూడా పెరుగుతూ పోతుంది.

అందుకే ఎటూ నిర్ణయం తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ తన సహజ సిద్ధమైన నాన్చివేత ధోరణి విడనాడి, విభజన ప్రక్రియపై కదం తొక్కాలి. అప్పుడు గాని సీమంధ్ర ప్రజలకు వాస్తవాలు తెలిసిరావు. ఊహాలోకాలు, వాస్తవాలు వేరు వేరని అర్థం కాదు. అలా కాకుండా బద్ధకం వదిలించుకొని పక్షంలో కాంగ్రేస్  ఆధః పాతాళానికి పడిపోక తప్పదు.


No comments:

Post a Comment