Thursday, November 15, 2012

జల వివక్ష యజ్ఞం


-సీమ ప్రాజెక్టులకు ఒక న్యాయం.. తెలంగాణ ప్రాజెక్టుకు మరో న్యాయం
-సోమశిలకు అడ్డురాని నిధుల కొరత..యుద్ధప్రాతిపదికన హంద్రీనీవా 
-పంప్‌హౌజ్‌లు తయారైనా ప్రారంభంకాని భీమా-2
-అప్రోచ్ చానల్ లేక ముందుకు సాగని భీమా-1 లిఫ్ట్
-కల్వకుర్తి ఫేజ్-2లో తట్ట సిమెంట్ పనీ మొదలుకాలేదు
-నీటి లభ్యత సాకుతో పాలమూరు-రంగాడ్డి లిఫ్టుకు కొర్రి 


హైదరాబాద్, నవంబర్ 14 (టీ మీడియా):సీమాంధ్ర ప్రాజెక్టులంటే.. ఎంత కొరత ఉన్నా.. నిధులు పెల్లుబికి వస్తాయి. అదే తెలంగాణ ప్రాజెక్టులంటే పైసా కూడా రాలదు! సీమాంధ్ర ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసుకుంటుంటే.. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులు మాత్రం.. ఎక్కడేసిన గొంగళి అక్కడేనన్నట్టు మూలుగుతుంటాయి! ఒకే తరహా అన్యాయం.. పదే పదే! నెల్లూరు జిల్లాలో రూ.800 కోట్లతో చేపట్టనున్న సోమశిల ఎత్తిపోతల పథకానికి నిధుల కొరతను తోసిరాజని ప్రభుత్వం ఇటీవలే రూ.150 కోట్లు మంజూరు చేసింది. మరోవైపు అనంతపురం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు పనులను రాత్రింబవళ్లు యుద్ధవూపాతిపదికన పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. మహబూబ్‌నగర్ జిల్లాలో పంప్‌హౌజ్ నిర్మాణం పూర్తయి ఏడాదిదాటినా భీమా-2 ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్-1కు లింక్ చానల్ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో ఈ పథకం నిరుపయోగంగా మారింది.

అలాగే ప్రధాన రిజర్వాయర్ నుంచి పంపింగ్ స్టేషన్ వరకు అప్రోచ్ చానల్ పనులు పూర్తికాకపోవడంతో మిగిలిన పనులన్నీ అయిపోయినా భీమా-1 ఎత్తిపోతలకు మోక్షం కలగడం లేదు. కల్వకుర్తిలో కేవలం మొదటి దశ పనులు మాత్రమే పూర్తి కాగా 2.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన కల్వకుర్తి ఎత్తిపోతల ఫేజ్-2, ఫేజ్-3 గురించి పట్టించకున్న నాథుడే లేడంటే తెలంగాణ ప్రాజెక్టులపై పాలకులకు ఉన్న ప్రాధాన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. భీమా-2 ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్-1 పనులన్నీ పూర్తయ్యాయి. అయితే జూరాల నుంచి రామనపాడు వరకు 17 కిలోమీటర్ల లింక్ చానల్ నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొదటి దశ పూర్తయి, 13 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. అయితే ఈ పథకం ఎక్కువ శాతం ఉపయోగపడేది ఫేజ్-2, ఫేజ్-3లోనే. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫేజ్-2లో ఇంత వరకు తట్ట సిమెంట్ పని కూడా జరగలేదు. ఇక్కడ రెండో దశ పనులు పూర్తయితే తప్ప మొత్తం 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు.

సాగర్‌ను పక్కనపెట్టి...
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీళ్లు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న సీమ సర్కార్, సీమాంధ్ర ప్రాజెక్టు విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. హంద్రీనీవా ప్రాజెక్టు వాస్తవంగా కర్నూలు జిల్లాలో హంద్రి నది, చిత్తూరు జిల్లాలోని నీవా నది ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టు. అయితే పేరులో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న నదుల పేరు పెట్టుకుని నీళ్లు మాత్రం శ్రీశైలం నుంచి తీసుకెళ్లనున్నారు. అలాగే కర్నూ లు జిల్లాలో గాలేరు, చిత్తూరు జిల్లాలోని నగరి నదుల పేరుతో ప్రాజెక్టు నిర్మించుకుంటూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా నీళ్లు తరలించుకుపోయేందుకు సీమ సర్కార్ వ్యూహరచన చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు వరద నీటిని ఉపయోగించుకోవడం ద్వారా డిజైన్ చేసినవి. అయితే సర్కార్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలం కింద ఉన్న సాగర్ ఆయకట్టును గాలికి వదిలేసి, వరద నీటితో సంబంధం లేకుండా సీమలోని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చేందుకు తెర కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. శ్రీశైలంలోని నికర జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు పట్టించుకోకుండా, వరద నీటితో డిజైన్ చేసిన ప్రాజెక్టులకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణపై ప్రాజెక్టులపై వివక్ష...
కరువు జిల్లా మహబూబ్‌నగర్‌లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సర్కార్ రకరకాల కొర్రీలతో కాలయాపన చేస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణం సంగతి పక్కనపెడితే కనీసం సర్వేకు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి డీకే అరుణ నేతృత్వంలో ఆగస్టు నెలలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా సమావేశమై ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆయన కచ్చితమైన హామీ ఇచ్చారని మీడియాకు వెల్లడించారు. అయితే మూడు నెలలు పూర్తికావస్తున్నా ఈ ప్రాజెక్టు అతీగతీ లేకుండాపోయింది. పైగా దీనిని తొక్కిపెట్టేందుకు సీమాంధ్ర పాలకులు తీవ్రస్థాయిలో కుట్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న ప్రాజెక్టులే పూర్తికాకపోతే, మరొ కొత్త ప్రాజెక్టు ఎందుకు అని ఒకసారి, అసలు ఈ ప్రాజెక్టుకు నీటి లభ్యత ఎక్కడిదని మరొకసారి అభ్యంతరాలు చెబుతూ ప్రాజెక్టు ఫైలుని అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలంగాణ రైతులు ఆరోపిస్తున్నారు. పెన్నా నదిలో నీటి లభ్యత అంతంత మాత్రగానే ఉన్నప్పటికీ అక్కడ రూ.800 కోట్లతో నిర్మించనున్న సోమశిల ప్రాజెక్టుకు ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా తొలి విడత కోసం రూ.150 కోట్లు సైతం విడుదల చేసింది. అదే తెలంగాణలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్న పాలమూరు-రంగారెడ్డి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.

2 comments:

  1. Then what your leaders are doing???

    ReplyDelete
    Replies
    1. With your brutal majority, our leaders can do nothing even they want to. Which is why we want to have a separate state... so that our leaders can work for us,

      Delete