Friday, November 28, 2014

భాషకు సంబంధించిన చర్చ భాషావేత్తలే చేయాలా?


ఈ విషయంపై శ్యామలీయం గారి అభిప్రాయం చూశాక ఈ పోస్టు రాయాలనిపించింది. వారి వ్యాసాన్ని, వ్యాఖ్యలను ఇక్కడ చదవొచ్చు. అందులో వారు 'భాషా సంబంధిత చర్చలు భాషావేత్తలు మాత్రమే చర్చించాలి' అని సిద్దాంతీకరించారు.

ఆ విషయం చెపుతూ వారొక దృష్టాంతాన్ని సెలవిచ్చారు. రోగికి చికిత్స చేసే విషయంలో కేవలం డాక్టర్లు మాత్రమే చర్చించాలి, ఇతరులు కనీసం ఆ వైపుకు కూడా రాకూడదు అని. మరి డాక్టర్లంటే కేవలం స్పెషలిస్ట్ లేనా, ఇతరులు కూడానా అన్న విషయం వారు వాకృచ్చ లేదు. సరే, వారూ వీరూ కూడా అనుకుందాం. ఈ విషయం బోధించారంటే వారొక పెద్ద వైద్య నిపుణులు కూడా అయి వుండాలి!

నేను వైద్యుడిని కాదు. కనీసం వైద్య సహాయకుడిని కూడా కాదు. కాకపొతే పేషెంటుగా బోలెడంత అనుభవం ఉన్న వాడినే. ఆ అనుభవంతో నేను తెలుసుకున్న విషయాలు ప్రస్తావిస్తాను. వైద్య చికిత్సకు రకరకాల మార్గాలుంటాయి. ఆ విషయం వారే చెప్పారు. చికిత్స కేవలం డాక్టర్లే చెయ్యరు, ఫిజియోలు, నర్సులు కూడా అందులో భాగస్వాములే. వాటికి సంబంధించిన ఏయే సౌకర్యాలు ఆస్పత్రిలో ఉన్నాయో చెప్పగలిగేది వారే. అలాగే డయాగ్నొస్టిక్స్ విషయం సరేసరి. ఇక పొతే అందించ వలసిన పరిశుభ్రత, ఉంచ వలసిన ప్రదేశం, ఇవ్వవలసిన ఆహారం... ఇల్లా అన్నీ పరిగణనలోనికి తీసుకొవలసిన అంశాలే. వీటన్నిటికి మించి వైద్యానికి కర్చు ఎంత అవుతుంది? అది పేషెంటు కుటుంబానికి అందుబాటులో ఉందా లేదా అన్న విషయం కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే నిర్ణయించ గలిగే విషయం. ఇవన్నీ వదిలేసి కేవలం నిపుణులే చర్చించుకుని అలవికాని పద్ధతిని ప్రిస్క్రైబ్ చేస్తే ఎలా వుంటుంది?

ఇక భాష విషయం లోకి వద్దాం. భాషను భాషావేత్తలు తయారు చెయ్యలేదు, చేసింది ప్రజలే. కాకపొతే భాషావేత్తలు వాటికి నియమ నిబంధనలు సృష్టించి ఉండవచ్చు. అంత మాత్రాన భాషావేత్తలు అలవికాని కొన్ని నియమాలు పెట్టి జనం మీదకి వదిలేసి, "మేం ఈ నిబంధనలు పెట్టాం, కాబట్టి చచ్చినట్టు ఫాలో చెయ్యండి" అంటే ఎలా వుంటుంది? ఎవరు ఏ నిబంధనలు పెట్టినా చివరకు పాటించ వలసినది ప్రజలే కదా! ప్రజలకు తాము ఏమి కోరుకుంటున్నారో, తాము వాడే భాష ఎలా వుండాలో కూడా చెప్పుకునే హక్కు లేదా? భాష ఏ విధంగా వుంటే అది మరింత ప్రజల్లోకి వెళ్లి వృద్ధి చెందగలుగుతుందనే విషయం ప్రజలకన్నా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది? 'నీవు నిష్ణాతుడివి కాకుంటే చర్చించడానికి కూడా పనికిరావు' అన్నది ఏవిధమైన న్యాయం? 

తెలుగులో పదాలు తయారు చేసుకునే వెసులుబాటు లేదు కాబట్టి సంస్కృతం పైనే ఆధార పడదామా? లేక తెలుగులో కూడా అలాంటి వెసులుబాటు ఏర్పాటు చేసుకుందామా? అటువంటి వెసులుబాటు చేసుకోవడానికి వీలేలేదని తీర్పు చెప్పేవారు ఏవిధమైన సాధికారతతో చెప్తున్నారు? ప్రస్తుత భాషలో కొత్త పదాలు తయారు చేసే సుళువు లేదని ఒప్పుకుంటూనే, దిగుమతి చేసుకున్న సంస్కృత పదాలు ఎబ్బెట్టుగా ఉన్నాయంటూనే, అటువంటి సుళువు కోసం తెలుగుభాషలో ప్రయత్నం కూడా చేయకూడదని శాసించడం ఏమిటో? ప్రయత్నమంటూ చేయకుండానే అసలు వీలే కాదని ఎలా తీర్మానం చేయగలరు?

బ్రాహ్మి లిపిలోని పత్రాలను పరిశోధించాలంటే బ్రాహ్మి లిపి కూడా నేర్చుకోవాలి కాని ఆ అక్షరాలను కూడా తెలుగులో చేరుస్తామంటే ఎలా వుంటుంది? అలాగే కొన్ని లుప్తమైన అక్షరాలు పాతకాలం తెలుగులో ఉంటే ఉండొచ్చు కాక, ఇప్పటి అవసరాలకు పనికి రాకపోయినా అందరికీ వాటిని ఒకటో క్లాసు నుండే నేర్పాల్సిన అవసరం ఏమిటి? పలకడానికి అలవికాని అక్షరాలను మొదటినుండి ఉన్నాయి కాబట్టి కొనసాగించాల్సిన అవసరం ఏమిటి? ఎన్ని సార్లు పలికినా వాటి మధ్య తేడా కనపడని అక్షరాలను రెండింటికి బదులు ఒకటే వాడితే వచ్చె నష్టమేమిటి? 

ప్రజల్లోనుండి భాష పుడుతుంది. కాని భాషావేత్తల వల్ల దానికి నియమాలు ఏర్పడతాయి. ఆ నియమాలకు వీలైనంత సార్వజనీనత ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు భాషావేత్తలు. లేకపోతె అది మరొక మృతభాషగా మారే ప్రమాదం వుంటుంది. ప్రజలు కాక పండితులే రాసిన వ్యాకరణాన్ని ప్రజల అవసరాలకోసం అదే పండితులు మరింత సరళతరం చేసి రాయడం ఎందుకు సాధ్యం కాదు? అదే సమయంలో కొత్త పదాలు తయారు చేయడానికి  సంస్కృత భాషలో, లేదా ఆంగ్ల భాషలో ఉన్న వెసులు బాట్లను పరిశీలించి, తగు మార్పులను తెలుగులొ కూడా ఎందుకు చేయలేక పోతున్నాం? తమిళం, ఆంగ్లం ఇంకా అనేక భాషలు తమ పదాలు తామే చేసుకుంటున్నప్పుడు, మన భాషలు ఆ శక్తి లేదని ఒప్పుకుని మనం పక్కకు తప్పుకోవాలా?

ఇటువంటి ధోరణి అవలంబించే వేల సంవత్సరాలపాటు మన దేశంలో భాషను, సారస్వతాన్ని తొంబై శాతం ప్రజలకు అందకుండా విజయవంతంగా అడ్డుకోవడం జరిగింది. దాని ఫలితంగానే అనేక విషయాల్లో పాశ్చాత్యుల కన్నా మనం వెనుకపడి పోవడమూ జరిగింది.  ప్రజాస్వామ్యం వచ్చి అరవై ఏళ్లైనా ఇప్పటికీ కొందరు ఇంకా అటువంటి భావజాలాన్నే ప్రదర్శించడం శోచనీయమైన విషయం. 


Tuesday, November 4, 2014

తెలంగాణలో ప్రతిపక్షాలు


ప్రతిపక్షాలన్న తర్వాత అవి అధికార పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకోవాలి. వేలు కాదంటే కాలికి కాలు కాదంటే వెలికీ వేస్తూ అధికార పక్షానికి ఊపిరి సలపనీయకుండా చేయాలి. అదీ ప్రతిపక్షాలకు ప్రజలు ఇచ్చిన డ్యూటీ.

మరి తెలంగాణలో ప్రతిపక్షాలు ఈ పని సక్రమంగా చేస్తున్నాయా? అంటే బుక్కులో రాసిన దానికి పదింతలు ఎక్కువే చేస్తున్నాయి అని కచ్చితంగా చెప్పొచ్చు. తెలంగాణాలో అధికార పార్టీ ఒక్కటి ఉంటే కనీసం మూడు పార్టీలు వైభవోపేతంగా ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నాయి. కాంగ్రెసుకు ఎలాగూ ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. ఇక మిగిలిన బిజెపి, తెదేపాలు ఏమాత్రం తక్కువ తినలేదు.  

అయితే బుక్కులో రాయని విషయం ఇంకొకటి వుంది. అదేమంటే... అధికార పక్షానికి బట్టలూడ దీస్తూనే, ప్రతిపక్షం తన అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ మాటకొస్తే కేవలం అస్తిత్వం నిలుపుకోవడమే కాదు, తర్వాత్తర్వాత ఎన్నికల్లో నెగ్గేలా దాని ప్రయత్నాలు ఉండాలి. 

ఉన్న మూడు ప్రతిపక్షాల్లో కనీసం ఒక్కటన్నా ఈ దిశలో ప్రయత్నిస్తుందా అన్న విషయం విశ్లేషించడానికి ముందు, సదరు పార్టీలు రాష్ట్రంలో తమ ఉనికిని బలవత్తరం చేసుకోవడానికి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. 

ఉదాహరణకి తమిళనాడు రాష్ట్రాన్ని గనక తీసుకుంటే అక్కడ జాతీయ పార్టీలకు ఉనికే లేదు. ఉన్న రెండు మూడు పార్టీలు ఒకదాన్నొకటి విమర్శించు కుంటాయి. కాని విషయం తమ రాష్ట్రం, పొరుగు రాష్ట్రం మధ్యన ఉన్నది అంటే అన్ని పార్టీలూ ఒక్క గొంతై తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతాయి. ఇంకా చెప్పాలంటే తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసే పోరాటంలో నువ్వా నేనా అంటూ పోటీ పడతాయి. ఆ పోరాటంలో వెనుక బడితే ప్రజలు శాశ్వతంగా తమని వెనక్కు నెట్టి వేస్తారని వాటికి బాగా తెలుసు. 

పోనీ తమిళనాడులో ప్రాంతీయ పార్టీలే వున్నాయి, వాటికి జాతీయ ఎజెండా వుండదు కాబట్టి అలా ప్రవర్తిస్తాయి అనుకొవచ్చు. మరి కర్ణాటకలో ఉన్నవి జాతీయ పార్టీలైన బిజెపి కాంగ్రెస్ లే. కాని అవి కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గవు. విషయం తమ రాష్ట్రం, పొరుగు రాష్ట్రం మధ్య అయినపుడు అవి తమ రాష్ట్ర ప్రయోజనాలకు ఢంకా బజాయిస్తాయి తప్ప పొరుగురాష్ట్రంలో తమ పార్టీయే అధికారంలో ఉన్నా దానికి వంట పాడవు. 

ఆ రెండు రాష్ట్రాలే కాదు, ఏ రాష్ట్రంలో నైనా పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. లేక పొతే భవిష్యత్తు ఉండదని వాటికి బాగా తెలుసు. అంతెందుకు? పొరుగు రాష్ట్రమైన ఆంద్ర ప్రదేశ్ ని తీసుకుందాం. అధికారం లో ఉన్న తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న వైసిపికి తెలంగాణాలో బ్రాంచి ఆఫీసులు ఉన్నాయి. అయినా సరే అవి రెండూ శ్రీశైలం జలవిద్యుత్తు వివాదంలో తమ రాష్ట్ర వాదనకే వంత పాడాయి. 

ఒక వైపు తీవ్రమైన విద్యుత్ కొరత. ఇంకో వైపు ఆంద్ర ప్రభుత్వం విభజన బిల్లులోని అంశాలను తుంగలోకి తొక్కుతూ ఇవ్వాల్సిన కరెంటు కూడా ఇవ్వడం లేదు. పైగా తెలంగాణా శ్రీశైలంలో తన వాటా విద్యుత్తూ కూడా తయారు చేయకుండా అడ్డు పడుతోంది. అటువంటి సమయంలో ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు అధికార పార్టీకి అండగా వుంది రాష్ట్ర ప్రయోజనాలు కాపాదాలి. అప్పుడే వాటికి ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. 

ఉద్యమం నడిచినన్నాళ్ళు దాన్ని తక్కువ అంచనా వేసి, పొరుగు ప్రాంత నాయకత్వానికే వంత పాడి తీరా ఎన్నికలు వచ్చఎసరికి అవి బొక్క బోర్లా పడ్డాయి. అయినా కూడా ఆ పార్టీలకు బుద్ధి రావడం లేదు. ఇప్పుడూ తిరిగి ఆ పార్టీలు అదే తప్పు చేస్తున్నాయి. 

వార్తాప్రసార సాధనాల పుణ్యమా అని ఎవరేం మాట్లాడుతున్నారు అన్న విషయం ప్రజలు గమనిస్తూనే వున్నారు. సమయం వచ్చినప్పుడు తీర్పులు కూడా అందుకు అనుగుణంగానే ఇచ్చి తీరతారు. మరి ప్రతిపక్షాలకు అంత చిన్న విషయం తెలియదా? అవి తెలంగాణా ప్రజల అభిమానం చూరగొనడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు?

తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలంగాణలో స్వాతంత్ర్యం లేదు. ఆంధ్రలో కొలువైన అధినేతని కాదని పెదవి విప్పలేరు. కాని కాంగ్రెస్, బిజెపి లకు ఏమైంది? ఆ రెండు పార్టీలు కూడా కేవలం కెసిఆర్ ను తిట్టడం తప్ప ఎందుకు తెలంగాణా ప్రయోజనాలకు అనుకూలంగా స్పందించ లేక పోతున్నాయి? వాటిని ఎవరు ఆపుతున్నారు?

ఈ పార్టీలు ఎన్నికల్లో తమకు తగిలిన షాక్ నుండి ఇంకా కోలుకోలేదేమో అన్న అనుమానం కలుగుతోంది. ఒకటి తెలంగాణా బిల్లు పాస్ చేసి తమకు తెలంగాణాలో ధీమా ఉండదని భ్రమించిన పార్టీ. రెండోది తెలంగాణా కోసం పార్లమెంటులో బయటా పోరాడాం, ఇక మాకు తిరుగులేదు అని అనుకున్న పార్టీ. తీరా ఫలితాలోచ్చాక అవి నిజంగానే షాక్ తిన్నాయి. ఎన్నికల్లో సింగిల్ పార్టీగా గెలిచిన తెరాస మీద అవి విపరీతమైన అక్కసు పెంచుకున్నాయి. రోజో టీవీల ముందుకు వచ్చి అధికార పార్టీని తిట్టడం తప్ప వాటికి మరే ఎజెండా కనిపించడం లేదు. కాని అవి తమ పధ్ధతి మార్చుకుని, ఇప్పటికైనా తెలంగాణా వాదాన్ని నెత్తికి ఎత్తుకోక పొతే డైనోసార్ల మాదిరిగా అవి తెలంగాణలో పూర్తిగా అంతరించి పోవడం ఖాయం.  



Wednesday, October 22, 2014

మార్క్సు చెప్పని విషయాలు



మీ కమ్యూనిస్టుల సంగతి మరీ విచిత్రంగా వుందన్నా!

ఏమయింది? బాగానే వున్నాంగా?

రాను రాను మీరు ఏ సిద్దాంతం అమలు చేస్తున్నారో తెలియకుండా వుంది.

ఇంకేం సిద్ధాంతం? మేం కారల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలనే పాటిస్తాం.

మార్క్స్ ఏం జెప్పాడు?

పెట్టుబడి దారుడు కార్మికుడి శ్రమను దోచుకుంటాడు. కార్మికుడి వైపు నిలిచి పోరాడాలి అని.

మరి మీరేం జెస్తున్నారు?

ఏం జేస్తున్నాం?

ఆ టీవీ చానెళ్ళ వాళ్ళూ, పత్రికాధిపతులూ ఉద్యోగుల పొట్టలు గొట్టే పనులు చేస్తుంటే, జీతాలు సగానికి సగం కోత వేస్తే అదేంటని మాట్లాడరు.

మార్క్స్ కాలంలో టీవీ చానళ్ళు లేవు. పేపర్లు ఉన్నా ఇంత పెద్ద మీడియా సంస్థలు లేవు. కాబట్టి మార్క్స్ కు వాటి సంగతి తెలియదు. ఆయన రాయకుండా మేం ఏపనీ చేయం.

సరే! మరి MSOలు ప్రసారాలు నిలిపివేస్తే పోరాడాలని చెప్పాడా మార్క్సు?

MSOల సంగతి చెప్పలేదు. కాని "పోరాడాలని" మాత్రం చెప్పాడు. కాబట్టి ఎవరు పోరాటం చేసినా మేం  సంఘీభావం తెలుపుతాం! ఆవేశంగా స్పీచులు దంచుతాం.

ఆఖరికి ఆ పోరాటాలు పెట్టుబడి దారులు చేస్తున్నా కూడానా?

పోరాటం ముఖ్యం. చేసేది పెట్టుబడిదారుడా, సామాన్యుడా అన్నది ముఖ్యం కాదు. ఇంక్విలాబ్ జిందాబాద్!! ఆ KCR "పాతరేస్తాం" అనడమేంటి? దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

ఆ మాట అనడం తప్పని మార్క్సు గారే చెప్పరా?

లేదు, కొన్ని కొన్ని మేం ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకుని ఆలోచిస్తాం.

అవునా! మరి ఎమ్మెల్యేలను "పాచి కల్లు తాగే మొఖాలకు ఫారిన్ విస్కీ", "ల్యాప్‌టాప్ మడిచి ఎక్కడో పెట్టుకుంటారు" అంటూ మాట్లాడడం సరైనదేనా?

ఏమో, దాని గురించి ఇంకా నిర్ణయించలేదు. కమిటీ వెయ్యాలి. సమావేశం కావాలి, చర్చించాలి. నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా మార్క్సు చెప్పని విషయాలను మార్క్సిజం లోకి అన్వయించడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఏళ్ళు పట్ట వచ్చు. లేక పోతే చారిత్రిక తప్పిదాలు జరుగుతాయి!

Saturday, October 4, 2014

బతుకమ్మ పండుగ



బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. తెలంగాణా ఉద్యమంలో బతుకమ్మ పండుగ మరువలేనిది. అది ప్రజల సాంస్కృతిక మూలాలను గుర్తుకు తెచ్చింది. బహుశా ఆ కారణం చేతనే కావచ్చు ప్రజలు పండుగ చేసుకోవడం కూడా అప్పటి ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకని ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడడానికి అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు. కోర్టుకు వెళ్లి మరీ  పర్మిషన్  తీసుకోవలసి వచ్చింది ప్రతీసారి. స్వాతంత్ర్యోద్యమంలో ఉప్పు సత్యాగ్రహం, రాట్నం వడకడం భాగమైనట్టు తెలంగాణా ఉద్యమంలో బ్రతుకమ్మ ఆడడం కూడా భాగమైంది.

ఉద్యమ ఫలితంగా ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణా రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రభుత్వ ప్రోత్సాహం బాగా ఉంటుందన్న విషయం ఊహించనిదేమీ కాదు. అనుకున్నట్టే కెసిఆర్ ప్రభుత్వం పది కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన రీతిలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించింది. ముఖ్యంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన ఉత్సవాలు నభూతో అన్నట్టుగా ఉన్నాయి.

నాకు వీలు చిక్కక ట్యాంక్ బండ్ వెళ్ళలేదు. టీవీలో చూడడమే జరిగింది. అయితే నగర శివార్లలోని ఒక గ్రామపంచాయితీ లో బతుకమ్మ వేడుకలలో మా కుటుంబంతో సహా పాల్గొనడం జరిగింది. ఊళ్ళోని ప్రభుత్వ పాటశాల మైదానంలో పండుగ నిర్వహించారు. ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయడం వల్ల ఇదివరకంటే ఏర్పాట్లు బాగున్నాయి. దగ్గరలో నీటి వసతి లేక పోవడం వల్ల ఆవరణ లోనే ఒక చిన్న జలాశయాన్ని నిర్మించారు. అందువల్ల స్త్రీలకు బతుకమ్మలను నిమజ్జనం చేసుకోవడం ఎంతో సౌకర్యవంతంగా మారింది. ఈ పధ్ధతి ప్రతి చోటా అమలు పరిస్తే బాగుంటుంది. చెరువులు, కుంటలు ఉన్న చోట వాటికి మెట్లు నిర్మిస్తే చాలు.

ఇక పొతే చిన్ననాడు మా వూరిలో చూసిన బతుకమ్మ పండుగకు దీనికి పోలికే లేదు. అప్పటిలా పాటలు పాడుకోవడం కనిపించ లేదు. 10000 వాట్ల లౌడ్ స్పీకర్లతో వచ్చే పాటల హోరులో పాటలు పాడుకుందా మనుకున్న  వారికి కూడా వీలు కాకుండా వుంది. అంతకన్నా ఎవరి పాటలు వారినే పాడుకోనిస్తే బాగుంటుందేమో అనిపించింది. బతుకమ్మ ఆటలో భాగంగా పాటలు ప్రిపేర్ చేసుకుని వచ్చిన వారు కొంత నిరాశకు గురైనట్టు కనిపించారు. పాటలు పాడకుండా ఊరికే ఆడవలసి వచ్చినందుకు కొంత విసుగు చెందినట్టు వారి మాటల వల్ల తెలిసింది.

ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా తప్పనిసరిగా చర్చించుకోవాలి. బతుకమ్మ పండుగ ఆవరణలో పెద్ద స్టేజీ నిర్మించి అన్ని పార్టీల రాజకీయ నాయకులు పరివేష్టించి, స్పీచులు దంచడం, బతుకమ్మలాటను వీక్షించడం... మైకులో రన్నింగ్ కామెంటరీలు, ఆడే మహిళలకు ఇబ్బంది కలిగించే విషయం. పండుగలో రాజకీయ జోక్యం పెరగడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అది. అలాగే వారిని సంతోష పరచడానికన్నట్టు తీన్ మార్ డ్యాన్సులు, తీన్ మార్ పాటలు పెద్ద సౌండ్ తో పెట్టడం కూడా బతుకమ్మ ఆడే స్త్రీలకూ అసౌకర్యాన్ని కలిగించాయి. ఇది చూస్తె మరోరకమైన రికార్డింగ్ డ్యాన్సుల సంస్కృతీ పెరిగి పోతుందేమోనన్నభయం కలిగింది. రాజకీయులు ఏర్పాట్లు మాత్రం చేసి పండుగకి దూరంగా ఉంటేనే మంచిది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో పండుగ ఏర్పాట్లలో కొన్ని మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం వుంది.


Tuesday, July 22, 2014

స్థానికత వివాదం

తెలంగాణా ప్రభుత్వం మీద ఏ విధంగా దండయాత్ర చేద్దామా అని మధన పడుతున్న సీమాంధ్ర నాయకులకు, మీడియాకు ఆ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన విద్యార్థుల ప్రవేశ రుసుము సహాయ పథకం (FAST) ఊతమిచ్చింది.

ముఖ్యంగా ఆర్ధిక సహాయానికి 1956ను కొలబద్ద చేయడంతో సీమాంధ్ర మీడియా అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. అలా కాక ఇప్పుడున్న స్కీమునే అమలు చేస్తే 39000 సీమాంధ్ర విద్యార్థులకు తెలంగాణలో ఉచిత చెల్లింపులు జరపాలి. ఉమ్మడి రాజధాని కావడం వలన కొన్ని వేలమంది ఉద్యోగులు తెలంగాణాలో నివసిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్నారు. వారి పిల్లలకి తెలంగాణా ప్రభుత్వం ఎలా ఫీజులు చెల్లిస్తుంది?

అలాగే గత ఎన్నికల్లో సుమారు ఐదు లక్షలమంది ఇటు తెలంగాణలో, అటు సీమంధ్రలో కూడా వోటు వేశారని వార్తలు వచ్చాయి. ఏపీలో పౌరసత్వం కొనసాగిస్తున్న వారికి తెలంగాణలో ఫీజు పథకం లబ్ది చేకూర్చడం ఎంతవరకు సబబు?

తెలంగాణా ప్రభుత్వానికి ఉదారంగా విద్యాదానం చేసే ఆర్థిక వెసులుబాటు గాని, అవసరం గాని లేవు. ఇది దగా పడ్డ తెలంగాణాని పునర్నిర్మించాల్సిన సమయం. రాష్ట్రానికి చెందిన ప్రతి పైసా అందుకోసం మాత్రమే వినియోగించాలి తప్ప దానధర్మాలకు కాదు.

ఇంత చెప్పినప్పటికీ, నాక్కూడా ఎందుకో 1956వ సంవత్సరాన్ని స్తానికతకు కొలబద్దగా తీసుకోవడం హేతుబద్ధంగా కనిపించడం లేదు. తన పథకాల లబ్దిదారులను నిర్వచించుకునే పూర్తి హక్కు తెలంగాణా ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, 1956ని కొలబద్ద చేయడం వల్ల కొంతమంది నిజాయితీగా తెలంగాణాలో స్థిరపడ్డ బీదవారికి నష్టం చేకూరే విధంగా వుంది.

దానికన్నా పధకాన్ని "TELANGANA CITIZENS' CHILDREN EDUCATION ASSISTANCE" గా మార్చి తండ్రి స్థానికతను బట్టి ఆర్ధిక సహాయం చేస్తే బాగుంటుందని KCR గారికి నా సూచన.

Saturday, March 29, 2014

చంద్రబాబు BC కార్డు

జన్మించబోతున్న తెలంగాణా రాష్ట్రానికి ఇప్పటికే వున్న జీవన్మరణ సమస్యలు:
- హైదరాబాదును సీమాంధ్ర కబ్జా నుంచి విడిపించడం.
- ఉద్యోగుల ఆప్షన్లను అడ్డుకోవడం
- పోలవరం కోరల నుండి భద్రాచలం డివిజన్ను రక్షించడం.
- తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు సాధించడం
- విద్యుత్ ప్రాజెక్టులు... తద్వారా మిగులు విద్యుత్ సాధించడం.
- రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం.
- తెలంగాణా ప్రాంతపు విద్యావకాశాలను ఆంధ్రులనుండి పరిరక్షించడం.
ఇదీ తెలంగాణాకి ఉండవలసిన ఎజెండా.
కాని చంద్రబాబు ప్రమోట్ చేస్తున్న BC నాయకుడు ఏం ప్రకటించాడో చూడండి. ఆయనకు తెలంగాణా సమస్యలు పట్టవట! పదవిలో వుండి కూడా BC ఉద్యమమే చేస్తడట! జాతీయ స్థాయిలో BC రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లకోసం ఉద్యమాలు చేస్తడట!
ఆయన దృష్టిలో అవి ముఖ్యమైన విషయాలే కావచ్చు. కాని రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం వల్ల అవి ఎలా సాధ్యమో ఆయన చెప్పలేక పోయాడు. ఉద్యమాలు చేయడానికి ముఖ్యమంత్రి పదవలు అవసరమా?
ఆయన ఎజెండా చెప్పడంలో కృష్ణయ్యకు నిజాయితీ వుంది. కాని ఆ BC నాయకున్ని తీసుకురావడంలో చంద్రబాబుకు నిజాయితీ లేదు. తెలంగాణ ప్రజలను తికమక పెట్టే, దారి మళ్ళించే ఉద్దేశం మాత్రమే కనపడుతుంది.


Thursday, March 27, 2014

విభజన ప్రక్రియ కూడా లో చేతివాటం


విభజన ప్రక్రియ వేగవంతమైన ఈ తరుణంలో సీమాంధ్ర అధికారుల కుట్రలు కూడా అంతే ఊపందుకున్నట్టు వస్తున్నా వార్తలను బట్టి అర్థమైతుంది. గత అరవై సంవత్సరాల సీమాంధ్రుల చేతి వాటం చూసిన వారికెవరికైనా విభజన సమయంలో సీమాంధ్ర అధికారులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించ గలరని నమ్మకం కలగదు.

దురదృష్ట వశాత్తూ అన్ని శాఖల్లోనూ ఉన్నతాధికారులు మొత్తంగా సీమాంధ్రకు చెందిన వారే తిష్ట వేశారు. విభజన సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి ప్రభుత్వం ఒక వెబ్ సైటును కూడా ఏర్పాటు చేసింది. ఆ వివరాల సేకరణ, అప్లోడ్ పనులకు తెలంగాణా ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగుల,  అధికారుల ప్రాతినిధ్యం వీలయినంత తక్కువగా ఉండేటట్టుగా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది.

స్థిరాస్తులను ఏమీ చేయలేనప్పటికి, మూవబుల్ వాటి విషయంలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వాహనాలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఫర్నిచర్, యంత్ర పరికరాలు, ఇతర పనిముట్ల విషయంలో కాలం చెల్లినవి, పాతవి తెలంగాణా ప్రాంతానికి అంటగట్టి కొత్తవి, ఖరీదైనవి సీమాంధ్రకి తరలించేందుకు కుట్ర జరుగుతున్నట్టు తెలుస్తుంది.

విభజన ప్రక్రియ సక్రమంగా జరగాలంటే మొత్తం విధానం పారదర్శకంగా ఉండాల్సిన అవసరం వుంది. విభజన ప్రక్రియకు ఉపయోగిస్తున్న వెబ్సైటుని పబ్లిక్ యాక్సెస్ లో వుంచడం వల్ల కొంత నష్టాన్ని నివారించ వచ్చు. అలాగే ప్రక్రియలో తెలంగాణా వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ విషయంలో తెలంగాణా ప్రాంత నాయకులు పూనుకుని గవర్నర్ కు, కేంద్ర ప్రభుత్వానికి చెందినా విభజన అధికారులకు తగు సూచనలు చేయ వలసిందిగా తెలంగాణా వాదులు కోరుతున్నారు.     

Monday, March 3, 2014

ఎందుకు కలుపాలె ?

మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినట్టు చేసింది. జనం, నాయకులు ఉద్యమ కారులు పండుగలు చేసుకునుడు శురువు జేసిన్రు.

ఇదా సంపూర్ణ తెలంగాణా?


పదేండ్ల పాటు సీమాంధ్ర పిలగాల్లు ఇక్కడి కాలేజీ సీట్లల్ల సదువు కొవచ్చు. తెలంగానోల్లు మాత్రం సీమాంధ్రల సడువరాదు. 

పదేండ్ల పాటు తెలంగాణా ప్రభుత్వానికి హైదరాబాదు మీద అధికారం ఉన్దదు. గవర్నర్ చేతిల వుంటది. ఇంతకంటే అవమానం ఉంటదా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా?

తెలంగాణా ప్రాంతాన్ని ముంచే పోలవరం ప్రాజెక్టును ఏ అనుమతులు లేకున్నా అడ్డదారిన కేంద్రం నెత్తికెత్తుకొని పూర్తీ చేస్తదట! వారి స్వార్థానికి అడ్డం రాకుండా, వచ్చినా అణగ దొక్కు తందుకు ముంపు గ్రామాలతో సహా సంబంధిచిన మండలాలు సీమాన్ధ్రకు ధారాదత్తం చేస్తున్నరు!

తెలంగాణలోని పది జిల్లాలలో తొమ్మిది దేశంలోని వెనుకబడ్డ జిల్లాల్ల లిస్ట్ల వున్నయని కేంద్ర ప్రభుత్వమే ఒకవైపు చెప్తున్నది. కాని దోపిడీ చేసి తెగ బలిసిన సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇస్తున్నరట! ఇదెట్ల వున్నదంటే, దోచుకునే రౌడీ దోపిడీ ఆపెటందుకు రౌడీ మామూలు ఇచ్చినట్టు!!


ఎంత కాలానికి ఇచ్చింది తెలంగాణాని?


2004 లనే తెలంగాణా ఇస్తనని చెప్పి కాంగ్రెస్ అధికారం లకొచ్చింది.  ఐదేండ్ల పాటు మోసం చేసింది. 

తిరిగి 2009 ఎన్నికల్ల ఇచ్చేది తెచ్చేది మేమే ననుకుంట నమ్మ బలికింది. 2009 డిసెంబర్ ల ప్రకటన ఇచ్చినట్టే ఇచ్చి వెనుకకు మళ్ళింది. 1200 మంది ఉద్యమ కారుల చావులకు కారణమయ్యింది. 

2012ల తెలంగాణా ఏర్పాటు చేస్తే పార్టీని కాంగ్రెస్ ల కలుపుతామని తెరాస ఆఫర్ కూడా ఇచ్చింది. కాని కాంగ్రెస్ స్పందించ లేదు. ఉద్యమాన్ని అణగ దొక్కుతందుకే చూసింది.

ఎన్ని లాఠీ చార్గిలు, ఎన్ని విషవాయు ప్రయోగాలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించినా తెలంగాణా ప్రజలు వెనుకకు పొలెదు. ఉద్యమం ఒక ఇంచు కూడా సడలలేదు. సీమాంధ్ర వాద కాంగ్రెస్ టిడిపి లకు ఒక్క సీటు కూడా ఎన్నికల్ల దక్కలేదు. 

తెలంగాణా ఆపినా కూడా సీమాంధ్ర మొత్తంల ఎన్నికల్ల జగన్ చేతిల మట్టి గరిచినంక, కనీసం తెలంగాణాలనన్న బట్ట కట్టాలే నని భావించి తెలంగాణా ప్రక్రియ ప్రారంభించింది. 

ప్రక్రియ మొత్తంల కూడా సీమాంధ్ర నాయకులను కట్టడి చేస్తందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు.  బరితెగించిన ముఖ్యమంత్రి తన పార్టీ పాలసీలకు విరుద్ధంగా ప్రవర్తించినా, రాష్ట్రపతినే ధిక్కరించడానికి ప్రయత్నించినా మాట మాట్లాడలేదు. ముఖ్యమంత్రిని మార్చ డానికో, రాష్ట్ర పాటి పాలన విధించడానికో ఏమాత్రం ప్రయత్నించ లేదు. 

కాని ఇప్పుడు సీమాంధ్ర నేతలు కోరగానే కొంపలు మునిగినట్టు రాష్రపతి పాలన విధించింది.

తెరాస ఆఫర్ ఇచ్చిన మాట నిజమే 


నిజమే, తెలంగాణా కోసం ఆత్మాహుతికి పాల్పడుతున్న యువకులను చూడలేక తనకు తాను  బలి అవుతందుకు సిద్ధ పడింది తెరాస. సంపూర్ణ తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ పార్టీల విలీనం చెందేతందుకు ఒప్పుకుని, తెలంగాణా ఏర్పాటు చేయమని అర్థించిండు కెసిఅర్.  

కాని కాగ్రెస్ ఒప్పుకోలేదు. దానికి స్పందించ లేదు. ఆత్మాహుతవుతున్న ప్రజలు ఏమాత్రం భరోసా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చెయ్యలేదు.    

ఇప్పుడెందుకు అం తహ తహ?


పదేండ్లు తాత్సారం చేసి, పన్నెందొందల ఆత్మార్పణాలకు కారణమై, చివరకు వికలాంగు రాలిగా మార్చిన తెలంగాణాను ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఆ మాత్రం దానికి బిల్లు పాసైన మరుక్షణం నుంచే తెలంగాణా రాష్ట్ర సమితి విలీనం కావాలని వత్తిడి తెస్తుంది.

విలీనం అయితే?


పేరుకు తెలంగాణా రాష్ట్రం వచ్చినా ఇంకా సాధించు కావలసింది ఎంతో వుంది. వందలాది సంవతరాల రాజరికంలో, గత యాభై ఆరు సంవత్సరాల వలస పాలనలో తెలంగాణా క్రుంగి, కృశించింది.  పొరబాటున తెరాస కాని కాంగ్రేసుల విలీనం అయితే ఇప్పుడు తెలంగాణా గురించి మాట్లాడే నాధుడే వుండడు. BJP, కాంగ్రెస్ పార్టీలు అధిష్టానానికి బందీలు. TDP సీమాంధ్ర చంద్రబాబు చేతిలోని కీలుబొమ్మ. ఇప్పటివరకు తెలంగాణా పక్షాన మాట్లాడగల, పోట్లాడ గల ఒకే ఒక పార్టీ తెరాస. కాబట్టి పొరపాటున కూడా ఆ పార్టీ కాంగ్రేసులో విలీనానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవద్దు. అదే అశేష తెలంగాణా ప్రజల ఆకాంక్ష. 

అలా కాక కాంగ్రేసులో తెరాస విలీనం చెందడానికి నిర్ణయిస్తే, అది తెలంగాణా ప్రజల ఆశలపై నీళ్ళు చల్లినట్టే! తెలంగాణా ప్రజానీకానికి ద్రోహం చేసినట్టే!!
  

Sunday, February 16, 2014

లగడపాటి పెప్పర్ స్ప్రే వీడియో

లగడపాటి రాజగోపాల్ తెలంగాణా బిల్లును అడ్డుకోవడానికి పార్లమెంటులో పెప్పర్ స్ప్రే అనే బ్రహ్మాస్త్రాన్ని(?) ప్రయోగించాడు. రాష్ట్రం లోని కొన్ని పచ్చ చానెళ్ళు నిస్సిగ్గుగా సమర్ధించాయి కూడా. కాని నేషనల్ మీడియాలో తీవ్ర నిరసనలు వచ్చే సరికి, అలాగే దేశంలోని మేధావులంతా తీవ్రమైన విమర్శలు చేసే సరికి సదరు లగడపాటి ఆత్మరక్షణలో పడ్డాడు. చివరికి ఆత్మా రక్షణ కోసమే ఆ పని చేశానని బుకాయించ చూసాడు. కాని కెమెరాల కళ్ళు కప్పలేడు కదా?

అతడి  పచ్చి తీవ్రవాద చర్య ఆత్మరక్షణ కోసం ఎంతమాత్రం కాదని, కావాలని ముందస్తు పతాకంలో భాగమే నని అతడు స్ప్రే చేసిన విధానం తేట తెల్లం చేస్తుంది. దీన్ని  BJP ఇప్పటి వరకు ఖండించక పోవడం లోని ఔచిత్యం ఆ పార్టీకి, పచ్చ బాబుకే తెలియాలి.

Friday, February 14, 2014

డ్రామాలతో ఒరిగిందేమిటి?

తెలంగాణా బిల్లు అసెంబ్లీ గడప దాటినప్పటి నుంచి సీమాంధ్ర నాయకులు, మీడియా పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా మొరుగుడు మొదలు పెట్టిన్రు.

అసలు బిల్లు అసెంబ్లీ దాట నివ్వం
రాష్ట్రపతి క్లియరెన్సు ఇవ్వదు
కోర్టు బిల్లును పార్లమెంటుకు పోకుండా ఆపి వేస్తది
అసలు పార్లమెంటులో పెట్టనే పెట్టరు.
బీజేపి అడ్డు కుంటది.

ఇట్ల ఇష్టం వచ్చినట్టు కూతలు కూసుడు మొదలు పెట్టిన్రు. కాని వీళ్ళు ఎట్ల ఎట్ల కూసిన్రో, సరిగ్గా దానికి వ్యతిరేకంగా జరిగినై.

బిల్లు అసెంబ్లీ దాటింది
రాష్ట్రపతి క్లియరెన్సు ఇచ్చిండు
కోర్టు చెత్త కేసులన్నీ కొట్టేసింది
బిల్లు పార్లమెంటుకు వచ్చింది

బీజేపి మాత్రం కొంత తొండి మాటలు మాట్లాడుడు మొదలు పెట్టింది. అయినా వాళ్ళ నాయకులు ఆ వెంటనే మేం తెలంగాణా ఏర్పాటుకు పూర్తీ మద్దతు ఇస్తాం అని కూడా చెప్తున్నరు. వాళ్ళు ఏం చెప్పినా... గలాటా చేస్తున్న సీమాన్ధ్ర ఎంపీలను ఇంటికి పంపిన కాంగ్రెస్, సొంత బలంతోనే బిల్లు నెగ్గిన్చుకుంటనని గట్టిగనే చెప్తున్నది.

తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని రాష్ట్రంల ఈ పాటికే బఫూన్ గా మారిన లగడపాటి, పార్లమెంటు మెంబర్లు, స్పీకర్ పై  పెప్పర్ స్ప్రే దాడి చేసి  భారత దేశం మొత్తానికి తన బఫూన్ గిరీ చాటుకున్నడు. మిగతా సీమాంధ్ర ఎంపీలు కూడా పార్లమెంటులో గూండాయిజం చెలాయిస్తూ, తెలంగాణా ఇవ్వడం ఎంత అవసరమో ఇతర రాష్ట్రాల వారికి వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పకనే చెప్పిన్రు. వీళ్ళ వికృత చేష్టలు చూసి చేష్టలుడిగిన దేశ ప్రజలు వీళ్ళ చెరనుండి తెలంగాణా విముక్తి ఎంత అవసరమో అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏ బీజేపీ మొకాలడ్డినా బిల్లు పాసై తీరుతది.

రెండు కళ్ళ సిద్దాంతం చెప్తున్న చెంద్రబాబు ఎక్కిన కడుప, దిగిన కడుప అనకుండా తిరుగ బట్టిండు, తెలంగాణా ఆపెతందుకు. ఇంకోదిక్కు నుండి జగను, ఇంకో పక్కనుండి కిరణ్, మరో పక్కనుండి రెండు నాల్కెల నాగ భైరవ! వీళ్ళకు దగ్గట్టు పూటకో మాట చెప్పే బీజేపీ. వీళ్ళందరి గుణపాఠం ఒక్క బిల్లుతోటి కుదరబోతున్నది!

ఇందరి డ్రామాల మధ్యన నిజంగా మోసపొతున్నది మాత్రం సీమాన్ధ్ర ప్రజలే. బఫూన్ గాళ్ళను, పగటేశ గాండ్లను నాయకులుగా ఎన్నుకున్న పాపానికో ఏమో... పార్లమెంటుల వాళ్ళ పక్షంల మాట్లాడే సీమాంధ్ర నాయకుడే కరువయ్యిండు పాపం!

Wednesday, January 29, 2014

వీళ్ళా, మన నాయకులు?

తెలంగాణా ఏర్పాటు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రా నాయకుల కుయుక్తులు, కపట నాటకాలు బయట పడుతున్నాయి.

వీరికి ప్రజాస్వామ్యమన్నా, రాజ్యాంగమన్నా ఏమాత్రం గౌరవం లేదు. ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అసెంబ్లీని తమ మంద బలంతో చెప్పుచేతల్లో ఉంచుకున్నట్టు, ఇప్పుడు కేంద్రాన్ని, రాష్ట్రపతిని కూడా ప్రభావితం చేయడానికి సాహసిస్తున్నారు.

కాని వీరి తాటాకు చప్పుళ్ళకు తెలంగాణా వాదులు భయపడవలసిన అవసరం లేదు.  వీరి పశుబలం కేవలం ఆంధ్రపదేశ్ సరిహద్దులకు మాత్రమే పరిమితమైనది. అవి దాటినా తర్వాత వీరేం చేయబోయిన పరమ మూర్ఖ శిఖామణులుగా ముద్ర వేయించుకోవడం తప్ప ఇంకోటి చేతగాదు వీరికి!

నాడు పార్లమెంటులో నాలుగు ముక్కలు మాట్లాడడానికి కూడా చేతగాక ఈడిగిల పడ్డారు. చంద్రబాబు డిల్లీలో దీక్షకు దిగి జాతీయ మీడియా సాక్షిగా పరువు బజారు కీడ్చుకున్నాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ తన తెలివితక్కువ తనంతో డ్రాఫ్టు బిల్లని, తిప్పి పంపాలని వచ్చీ రాని తెలుగులో జనానికి వినోదం పంచుతూ తన అఙ్ఞానాన్ని ప్రకటించు కుంటున్నాడు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ బిల్లుపై కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పమని, అంతకన్నా ఎక్కువగా ఏమీ చేయవద్దని సాక్షాత్తూ రాష్ట్రపతి గారినుండి ఆదేశాలు వచ్చినా, అంశాల వారీగా ఓటింగు పెట్టాలని కాసేపు, తప్పుల తడక అంటూ కాసేపు, సమయం సరిపోదు, పెంచాలని కాసేపు చెపుతూ వొస్తున్న ఈ ముఖ్యమంత్రి ... చివరకు ఆ పాచికలేమీ పారక పోయేసరికి తిప్పి పంపాలని నోటీసు ఇచ్చాడట!

శనివారం నాడు అసెంబ్లీలో తిప్పి పంపానని చంద్రబాబు చెప్పడం, ఆ వెనువెంటనే ముఖ్యమంత్రి నోటీసు ఇవ్వగలగడం చూస్తుంటే వీరు తెలంగాణా కు వ్యతిరేకంగా ఏవిధంగా కుమ్మక్కు రాజకీయాలు నడపగలరొ ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో ముఖ్యమంత్రిని బాగానే తూర్పార బట్టారు. కాని తెలంగాణా తెలుగుదేశం వారు మాత్రం చంద్రబాబుని ఇంకా వెనకేసుకు రావడం చూస్తుంటే వారికి తెలంగాణా ఏర్పాటుపై ఏమాత్రం నిజాయితీ లేదని, తెలంగాణాకు అనుకూలంగా చెప్తున్నా వారి మాటలు కేవలం ఉత్తుత్తివేనని, అంతా నటనేనని స్పష్టంగా అర్థమవుతంది. 

రాజ్యాంగం పై, రాజ్యాంగ సంస్థల పై ఏమాత్రం గౌరవం లేని, కేంద్ర రాష్ట్ర అధికారాలపై ఏమాత్రం అవగాహన లేని వీరి పనులను చూస్తూ... ఛీ, వీళ్ళా మమ్ములను ఇన్నాళ్ళు పరిపాలించిన నాయకులు, అని తెలంగాణా ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటున్నారు. మీరు ఇన్నాళ్ళు వెలగబెట్టింది చాలు, ఇక నైనా మాది మేము చూసుకుంటాం, దయచేయండి అంటున్నారు.

Saturday, January 4, 2014

దోపిడీ యావ తప్ప చర్చించే చేవ ఏది?

ఛీ... మాంధ్ర నాయకుల్లారా!!!

మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. రాజ్యాంగం పై విశ్వాసం లేదు. రాష్ట్రపతి మీద గౌరవం లేదు.

అసెంబ్లీకి తెలంగాణా బిల్లు వస్తే దానిమీద చర్చించి అందులో లోపాలు వెలికి తీసే దమ్ము లేదు.  అవునులే మంద బలం పోగేసుకొని ఇన్నాళ్ళు తేరగా తెలంగాణా మీద పది మెక్కి తినడం తప్ప మీకు ఇంకేమి తెలుసు గనక?

ఆ మందబలంతోనే ఇబ్బడి ముబ్బడిగా మీ వైపు ప్రాజెక్టులు కట్టు కుంటిరి.  వాటి మీద పండిన పంటలతో కోట్లకు పడగ లెత్తితిరి. ఆ డబ్బులతో తెలంగాణా భూములను స్వాహా చేస్తిరి. అవే డబ్బులతో అవినీతి చేసి తెలంగాణా ఉద్యోగాలను, కాలేజీ సీట్లను, అన్ని రకాల అవకాశాలను కొల్లగొడితిరి.

అందుకే  తేరగా తినమరిగిన మీకు తేనెపట్టులా వున్న తెలంగాణా ఇప్పుడు విడిపోతుంది అనేసరికి ఎక్కడ లేని దుఃఖం రాబట్టింది! మెదడు పని చేయడం మాని వేసింది!! తలా తోకా లేని పిచ్చి వాగుడు మొదలైంది.

మీకు మెజారిటీ వుంది కాబట్టి అది ప్రజాస్వామ్యమా? మైనారిటీ ప్రజల ఆకాంక్ష ప్రజాస్వామ్యం కాదా? మరి మీకన్నా మెజారిటీ గా వున్న తమిళ ప్రజలు నాడు కూడదంటే ఎందుకు విడిపోయి వచ్చారు? రాజ్యాంగం లో వున్నఆ  ఆర్టికల్-3 పెట్టిన భిక్ష వల్ల కాదా? ఇప్పుడు అదే ఆర్టికల్-3 పనికిరానిదైందా?

విభజనకు ఒప్పుకొని, వాగ్దానాలు చేసి, తెలంగాణా ప్రజల ఓట్లు కాజేసిన మీరు, అదే ప్రజలు గత పదేళ్లుగా విభజన తీర్మానం చేయమని కోరినా మోసపూరితంగా మొండి చెయ్యి చూపిన మీకు, ఇప్పుడు సమైక్య తీర్మానం కావలసి వచ్చిందా? మందబలం మీకే ఉందిగా? మరి ఆ సమైక్య తీర్మానం అప్పుడే  ఎందుకు చేయలేదు? మీ మోసాలు బయట పడతాయనే గదా? మీకు ఓట్లు, సీట్లు రావనే గదా?

ముఖ్యమంత్రి మీ వాడే. స్పీకరు మీవాడే! రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీవాడే! అయినా తృప్తి లేదు! ఏదో ఊడబొడిచేస్తాడేమోననే అనుమానంతో శాసన సభా వ్యవహారాల మంత్రిని కూడా తప్పించి రాజ్యాంగం మీద ఆవగింజంత అయినా విశ్వాసం లేని కరడు గట్టిన సమైక్యవాదిని ఆ స్థానంలో ప్రతిష్టించు కున్నారు! అయినా కూడా అసెంబ్లీలో చర్చించే ధైర్యం రావడం లేదు!!

మాట మాట్లాడితే బిల్లు తప్పుల తడక అంటరు. బిల్లులో తప్పులేమిటో చెప్పమనే గదా మిమ్మల్ని చర్చకు పిలిచింది?

అవునులే! దోపిడీ సొమ్ము తినడం తప్ప మరోటి తెలియని మీరు ఏమి చర్చించ గలరు? ఏమి సూచనలు చేయ గలరు?

విభజన తర్వాత కూడా దోపిడీలు యధేచ్చగా చేసుకోనిమ్మని అడగగలరా?

తెలంగాణా భూములను ఎండబెట్టి అర్హత లేని ప్రాంతాలకు అదనపు జలాలిమ్మని అడగగలరా?

తెలంగాణా ప్రాంతపు ఉద్యోగాలు కూడా మేమే చేస్తామని అడగగలరా?

తెలంగాణా కాలీజీల్లో కూడా మేమే చదువులు వెలగ బెడతామని చెప్పగలరా?

విభజన తర్వాత కూడా యధేచ్చగా (తెలంగాణా ప్రాంతంలో) ఫాక్షనిజం, కబ్జాలు చేసుకోవడానికి అనుమతి అడగ్గలరా?

ఇవన్నీ అడిగితే ప్రపంచం మొత్తం మీద మీ పరువు పోతుంది. అవి తప్ప మీరు అడగలిగిన విషయాలూ, బిల్లులో మార్పు చెయ్యదగిన సూచనలూ ఇంకేమీ మీ మనస్సులకు తట్టవు మరి!

అందుకే మీరు సభలో చర్చించ లేరు! సజావుగా చర్చకు రాలేని మీరు చేయగలిగిన ఒకే ఒక పని... దుశ్శాసనున్ని తలపించే విధమైన కౄర వికటాట్టహాసాలు.... ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని తలపించే విధమైన బిల్లు కాగితాల చింపివేత!

మీ వికృత విన్యాసాల వల్ల సాధించ గలిగింది ఏమీ లేదు! జనవరి 23 తర్వాత బిల్లు దానంత అదే మాంత్రికుడి చెరలోని రామచిలక వలె విముక్తి చెంద బోతోంది! ఆ తర్వాత మీరు చేయగలిగింది శూన్యం. కాని ఆ లోపు సజావుగా చర్చ జరిపి సీమాంధ్ర ప్రజల న్యాయమైన కోర్కెలు వెల్లడించే చారిత్రిక అవకాశాన్నికోల్పోవడం, ఆ ప్రాంత ప్రజలు మీవంటి భక్షకులను ఎన్నుకున్నందుకు చేసుకున్న స్వయంకృతాపరాధం!!

ధర్మో రక్షతి రక్షితః