Friday, February 13, 2015

వాస్తు?



ఇటీవల తెరాస ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విచిత్రంగా వుంటున్నాయి. కేసీఆర్ ఇటువంటి నిర్ణయాలపై పునరాలోచిస్తే మంచిది.

1. సెక్రెటేరీయట్ స్థలమార్పు, పునర్నిర్మాణం. 

విచిత్రంగా చాతీ దవాఖానను అనంతరిగిరికి మార్చడాన్ని మాత్రమే ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. నిజానికి దానికన్నా అభ్యంతరకరమైనది వాస్తు పేరుతో సెక్రెటేరీయట్‌ని మార్చడం. వాస్తు పేరుతో కార్యాలయాన్ని మార్చడం ఏమాత్రం సహేతుకంగాలేదు. ఒకవేళ ఇప్పుడున్న సెక్రెటేరియట్ భూములను అంతకన్నా మంచి పనులకు వాడదలిస్తే ఆ విషయం బహిరంగంగానే చెప్పాలి తప్ప వాస్తు అని కుంటి సాకులు చెప్పడం సరికాదు.

ఒకవేళ వాస్తు అన్నదే అసలు కారణమైతే అంతకన్నా ఘోరం మరొకటి వుండదు. ముఖ్యమంత్రే ఇలా వాస్తు పేరుతో డబ్బులు దుబారా చేస్తుంటే ఇక చేప్పాల్సిందేముంది. కలెక్టరు కార్యాలయం నుండి అటెండరు క్వార్టరు దాకా అన్ని భవనాలూ వాస్తు మార్పులకోసం రడీగా వుంటాయి. అదొక కోట్లాది రూపాయల వృధా కర్చుకు దారి తీస్తుంది.

2. వాస్తు నిపుణుడిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం.

ఇకనేం? వాస్తు నిపుణుల వారిని కూడా నియమించుకున్నారు. అంటే సదరు నిపుణుల వారు సలహాలివ్వడం తరువాయి ఉన్న గోడలు కూల్చడం, కొత్తవి కట్టడం జరుగుతాయన్న మాట! భవన నిర్మాణాలు శాస్త్రీయంగా హేతుబద్ధంగా జరగాలి. కట్టే భవనం దాని అవసరాలకు తగ్గట్టుగా నిర్మించాలి తప్ప వాస్తును గుడ్డిగా అనుసరించి కాదు. ఇప్పుడు నిర్మించే ఆధునిక హంగులున్న కార్యాలయాలకు కాలం చెల్లిన వాస్తు నియమాలను వర్తింప జేయడం అంటే మట్టిగోడలపై వంద అంతస్తుల భవనం నిర్మించడం లాంటిది. పైగా అవసరాలకు అనుగుణంగా భవంతుల డిజైన్లు చేసే ఇంజనీర్లకు, వాస్తు వితండ వాదిని జతచేసి అనవసరమైన గొడవలు సృష్టించడమే అవుతుంది.

ప్రజల్లోంచి వ్యతిరేకత రాకముందే ముఖ్యమంత్రి ఇటువంటి విచిత్రమైన ఆలోచనలను మానుకుంటే మంచిది. ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులకు మూఢ విశ్వాసాలు లేక పోతే మంచిది. ఒకవేళ వున్నా కూడా వాటిని వ్యక్తిగత విషయాలకే పరిమితం చేసుకుంటే మంచిది. అంతే కానీ అధికారం వుంది కదా అని ప్రతీ దాంట్లో తన విశ్వాసాలను జొప్పించడానికి ప్రయత్నిస్తే అది శతృవులకు బలాన్నిచ్చి చివరికి అధికారమే కోల్పోయే అవకాశం వుందని గ్రహించాలి.