Saturday, July 28, 2012

అయ్యా కేసీయారూ!


నువ్వు తెలంగాణా వాదానికి పర్యాయ పదంగా మారిపోయినవు. తెలంగాణా ప్రజలు నీ మీదనే కొండంత ఆశలు పెట్టుకున్నరు. నువ్వేమో ఆర్నెల్ల కొక్కసారి డిల్లీ నుంచి ఎవ్వో సిగ్నల్సు వస్తున్నయని చెప్పుకుంట కాలం ఎల్లదీస్తున్నవు. ఎప్పుడు గూడ సిగ్నల్సు వచ్చుడే గని తెలంగాణా మటుకు వస్తలేదు.

పదకొండేండ్ల నుంచి ఉద్యమాన్ని ఒక్కొక్క మెట్టే పైకెక్కించినవు. ఇప్పుడు తెలంగాణా వచ్చుడు మీద తెలంగాణా వాదులకే  కాదు, కరడుగట్టిన సమైక్యవాదులకు కూడా అనుమానం లేకుండ చేసినవు. తెలంగాణా గ్రామ గ్రామాన ఉన్న ప్రజలు కేంద్ర ప్రభుత్వం చూపెడుతున్న అలసత్వాన్నికి అగ్గిమీద గుగ్గిలం లెక్క ఉడికి పోతున్నరు. అవకాశం వచ్చినప్పుడు తడాక సూపిస్తందుకు సిద్ధంగనే ఉన్నరు.

పదకొండేండ్ల కింద మనసుల ఎంత కోరిక వున్నా తెలంగాణా వచ్చుడు మీద ఎవరికీ ఆశ లేకుండే. కాని ఇప్పుడు అట్లా గాదు. తెలంగాణాల వున్నా పసిబిడ్డ కూడ తెలంగాణా రాష్ట్రం రాదంటే ఒప్పుకొని పరిస్థితి. పైపైన మండే మంటలు సల్లబడుతయెమో కాని ప్రజలకు తెలంగాణ పైనవున్న ఆకాంక్షలు పైపై మంటలు కావు. అవి తెలంగాణ వచ్చుడు దాంక సల్లబడవు.

ఇప్పుడు తెలంగాణా పోరాటం మీద నీకున్న నిబద్ధతను కొత్తగ చాటుకునే అవుసరం లేదు. నువ్వుగాని, నువ్వు నాయకత్వం వహిస్తున్న పార్టీగాని తెలంగాణ కోసం తప్ప ఇంకోదానికి పని చేస్తున్నయంటే ఆంధ్రల కూడ ఎవ్వడు నమ్మడు. అందుకే కొంత మందికి నీమీద అంత కోపం. బయటికి తెలంగాణ వాదం మాట్లాడుతూ చెంద్రబాబు ముందు తెలంగాణ పదం ఎత్తేతందుకు లాగు తడుపుకునే తెలుగుదేశం వాళ్ళు కాని, తామే పెద్ద తెలంగాణా వాదులమని చెప్పుకుంట, సోనియా గాంధీ దగ్గెర బిక్క మొకం పెట్టే  కాంగ్రేసు వాళ్ళు కాని, వీళ్ళ అసలు రంగులు జనానికి పూర్తిగా తెలిసి పోయినై.

TRS తప్ప ఒక్క రాజకీయ పార్టీ గాని , ఆ పార్టీలకు చెందిన ఒక్క రాజకీయ నాయకుడు గాని, ఇంతవరకు తెలంగాణా వాదాన్ని తమ సొంత అవసరాలకు వాడుకోవడం తప్ప తెలంగాణా ప్రజల కోరికల మేరకు నిలబడ్డ పాపాన పోలేదు.

తుపాకి గొట్టాన్ని అడ్డం పెట్టుకొని అట్టహాసంగా సాగిన విజయలక్ష్మి దీక్ష యాత్ర కేవలం తెలంగాణ మీదికి దండయాత్ర మాత్రమే. ప్రజలు అది గమనించ లేనంత తెలివి తక్కువ వాళ్ళు కారు. ప్రజలు ఈరకంగా తెలివి మీరుడుకు కూడా కారణం వేరొకటి కాదు, నువ్వే! ఇప్పుడు ప్రజలు తెలివిన పడ్డరు. నీ పుణ్యమా అని తెలంగాణ కోసం పోరాడేది ఎవడో, వంచన చేసుకుంట బతికేది ఎవడో, ప్రజలకు తెలుస్తనే వుంటది.

ఇప్పుడు నువ్వు కొత్తగ సిగ్నల్సు ఉన్నయి. తెలంగాణ ఇగ వస్తుంది, ఆగ వస్తుంది అని చెప్పుడు అవసరమా? సిగ్నల్సు వచ్చినా రాకపోయినా ప్రజలు పోరాటం ఆపరు, నిన్ను ఆపనియ్యరు.

నిజంగనే సిగ్నల్సు వచ్చినయా, వస్తే రానియ్యి. నీ మనసులనే పెట్టుకో. ఒకవైపు సిగ్నల్సు వస్తున్నయని చెప్పుకుంట ఇంకొక వైపు పోరాటం ఎట్ల చెయ్యమంటవు? గట్లనే సిగ్నల్సు వస్తున్నయని చెప్పుకుంట, అవి ఇచ్చే కాంగ్రేసు పార్టీని ఎట్ల తూర్పార బడుతవు? దానికి వ్యతిరేకంగ పోరాటాలు ఎట్లా చేస్తవు? ఎందుకో ఈ విషయంల నీ వ్యూహాలు సరిగ్గ వున్నట్టు అనిపిస్త లేదు. జర ఆలోచించు.

అసలు సిగ్నల్సే వస్తలేవా? అది ఇంకా ఘోరమైన పరిస్థితి! లేని సిగ్నల్సు వస్తున్నయని చెప్పవడితే, కొంత కాలానికి అది 'నాయనా పులివచ్చే' అన్న సామెత అయి కూసుంటది. అబద్ధమని తెలిసినంక ప్రజలు ఎంతకాలం నమ్ముతరు? ప్రజలకు నీ మాటల మీదనే నమ్మకం పోతది. అట్ల నమ్మకం పోయేటందుకు ఆంధ్ర మీడియా శాయశక్తుల ప్రయత్నం జేస్తది. గది మరిచి పోకు.

తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఏర్పడుతదనే సిగ్నల్ పదేండ్ల కిందనే వచ్చింది. అందుకనే ప్రజలు నీకు మద్దతు పలుకుతున్నరు. ఆ సిగ్నల్ మరేదో కాదు, నువ్వే. నీ నాయకత్వం మీద జనానికి నమ్మకం వుంది. తెలంగాణ వచ్చేదాంక ఆ నాయకత్వం కింద పోరాటం చేస్తమని, తెలంగాణ సాధించుకుంట మన్న నమ్మకం వాల్లకుంది. వాల్లకు వేరే సిగ్నల్సు అవసరం లేదు. సజ్జాలని కాంగ్రెస్ పార్టీయో , కేంద్ర ప్రభుత్వమో ఇచ్చే సిగ్నల్సు అసలు అవసరం లేదు. 

పెట్టుబడిదార్లకు, దోపిడీ దార్లకు కొమ్ముకాసే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడకుండా సర్వశక్తులు ఒడ్డుతది . తెలంగాణ ఇచ్చేదే అయితే మొన్నటి రాష్ట్రపతి ఎన్నికలల్ల మీ సహాయం తీసుకొనేది. ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు జగన్ కు మనకంటే ఎక్కువున్నయా? మరి జైల్ల మూలుగుతున్న జగన్ తోటి ఎందుకు కుమ్మక్కయినట్టు? గిది నువ్వు చెప్పక పోయినా జనం అర్థం చేసుకుంటనే వున్నరు.

ఇప్పుడు తెలంగాణా వాదానికి TRS కేంద్రకం అయింది. TRS పార్టీకి నువ్వు కేంద్రకానివి. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలతోని చాల ప్రభావం వుంటది. మాట్లాడే ముందు నీపైన చాన బాధ్యత వుంటది. కాబట్టి జర చూసి మాట్లాడు. జనానికి వాస్తవాలు మాత్రమే వివరించు. అది మంచైనా చెడైనా సరే. నీ మాటమీద జనానికి గురి తప్పకుండ చూసుకో.

Sunday, July 22, 2012

ఆంధ్రల నమ్ముతరేమో!


రక్తం తాగే తోడేళ్ళు మేకలను కాపాడుతయట! దొమ్మీలు చేసుకునే ఫ్యాక్షన్ మూకలు రాజ్యాలు ఏలగా లేంది తోడేళ్ళు మేకలను కాపాడయా ? ఏమో, ఏది చెప్పినా నమ్మాల్ననే అనిపిస్తది.


వాళ్ళ మాటల గారడీ అటువంటిది. తిమ్మి బమ్మి లెక్క కనిపిస్తది. విజయమ్మ నేత కార్మికులను ఉద్ధరిస్తది. లక్ష కోట్లు మింగిన జగను దేశాన్ని ఉద్ధరిస్తడు. దీని అసలు రంగేందో చూద్దాం.


మొన్నటి ఎన్నికలల్ల శృంగభంగం చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పట్ల సమైక్యవాద శక్తులకు నమ్మకం సడలింది. వాళ్లకు జగన్, విజయమ్మ మాత్రమే తమ ప్రాంతీయ దోపిడీకి హామీ లెక్క కనిపించుడు మొదలు పెట్టిన్రు. గపుడు జగన్ నాయిన తెలంగాణను వాడుకొని  గద్దెనెక్కిండు. గద్దెనెక్కినంక తెలంగాణని బూతు కాలితోటి తొక్కిండు. గిప్పుడు జగన్ మోహన్ రెడ్డికి అర్జెంటుగ తెలంగాణా చేనేత కార్మికుల మీద ప్రేమ కలిగింది.


జబర్దస్తిగ తెలంగాణల అడుగు పెట్టబొయ్యి మాన్ కోటల మడిమె తిప్పింతర్వాత, కొండా దంపతుల పలుకుబడి ఉపయోగించి పాగా వేయాల్నని చూసిండు. కానీ కుదర లేదు. తెలంగాణ ప్రజలు ఛీకోట్టిన్రు. ఇప్పుడు తెలంగాణల తన బలం ఉందని చూపెట్టుకోవాలె నంటే ఏదో ఒకటి చెయ్యాలే. అందుకే చేనేత కార్మికుల మీద మొసలి కన్నీళ్ళ వరద!


సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మా హత్యల నేపథ్యంలో వారిని ఆడుకోవడానికి కేటాయించిన 3 కోట్ల నిధుల్లో రెండుకోట్ల డెబ్భై లక్షలను ఆనాటి రాజశేఖర్ రెడ్డి కడపకు దోచుక పోయిన వైనం తెలంగాణ ప్రజలు ఇంకా మర్చి పోలేదు. ఆయన జెండా మోసే జగన్, విజయమ్మలు అంతకన్నా పెద్ద చేస్తరన్న నమ్మకం వాళ్లకు అసలు లేదు.


ఈ తల్లీ కొడుకులకు నిజంగా తెలంగాణా మీద ప్రేమే వుంటే ముందు చెయ్య వలసిన పనులు చాలనే వుండే. మొన్నటికి మొన్న 750 మెడికల్ సీట్లను ఆంధ్రాకు తరలిస్తే ఒక్క మాట గూడ మాట్లాడ లేదు వీళ్ళు. తిరిగి తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తేనే వంద సీట్లన్నా వచ్చినయ్. 


అంతెందుకు, ముఖ్యమంత్రి దొంగ జీవోలు తెచ్చి రాత్రికి రాత్రి శ్రీశైలం నీళ్ళను సీమకు, సాగర్ నీళ్ళను డెల్టాకు తరలిస్తుంటే వీళ్ళ నోళ్లకు తాళాలు పడ్డయి. ఒక్కడు కూడ మాట్లాడ లేదు. మల్లే TRS, తెలంగాణ వాదుల పోరాటాల ఫలితంగనే కోర్టు తీర్పు వచ్చి 210 అడుగుల దగ్గెర దోపిడీ ఆగిపోయింది.


ఇవన్ని ఒక ఎత్తయితే 2009ల ఓటేసే వరకు ఊరుకొని, సాయంత్రం ఆరు కొట్టంగానే తెలంగాణ ఇస్తే వీసా తీసుకోవాలనాన్న తండ్రి మాటలు, ఆంధ్ర తెలుగుదేశం వాళ్ళ దగ్గెర జెండా గుంజుకొని జగన్ పార్లమెంటుల చేసిన సమైక్యవాద ప్రదర్శన, ఇవి ఇంకా ప్రజల గుండెలల్ల భగ్గ భగ్గ మండుతనే వున్నయి.


లక్ష కోళ్ళను కబళించిన రాబందు తమను కాపాడుతదని ఆంధ్రల నమ్ముతరేమో తెలువదు కనీ తెలంగాణల మాత్రం కలల కూడనమ్మరు. తమకున్న డబ్బు, పశు బలం  చూపించి లొంగ దీసుకున్దామని చూస్తున్నరేమొ! కాని చీమలు ఒక్కటై పామును నిర్జించినట్టు వీళ్ళ మోసాలను చూసి చూసి మండి పోతున్న తెలంగాణ ప్రజల కోపాగ్నికి ఇలాంటి వెయ్యి మంది విజయమ్మలు, లక్షమంది జగన్లు వచ్చినా కూడా, పరాభవంతోని వెనుదిరిగి పోవలసిందే. 


     
  
   

Tuesday, July 3, 2012

మా రాష్ట్రం మాగ్గావాలె



మాకు ఈ రాష్ట్రంల అన్యాయం జరుగుతుంది. మాకు రావలసిన నీళ్ళు మాకు వస్తలేవు. మాకు రావలసిన ఉద్యోగాలు మాకు వస్తలేవు. మాకు రావలసిన కాలేజీలు యూనివర్సిటీలు మాకు వస్తలేవు. ఒక వేళ వచ్చినా సవతి తల్లి ప్రేమ లెక్క అక్కడ మూడొందల కోట్లు కర్చు పెడితే ఇక్కడ మూడు కోట్లు కూడా కర్చు పెడుతలేరు. ఇంక నాణ్యత ఏముంటది?

నిన్నటికి నిన్న తెలంగాణా ప్రజల నోటికాడి నీళ్ళను కూడ లాక్కపోయి వాళ్ళ మూడో కారుకు పారించుకున్నరంటే ఇంకా కలిసి వుండడం అవసరమా?

ఈ మాట మేమడుగుతుంటే ఒకడేమో ఇక్ష్వాకుల కాలం నుంచీ అందరం కలిసే వున్నమంటడు. ఇంకొకడేమో తెలుగు భాష మాట్లాడే వాళ్ళంత ఒక్కతాన ఉండాలె నంటడు. ఇంకొకడు మరీ బలుపెక్కి విలీనం చెందినంక తెలంగాణల విద్యాసంస్కృతి పెరిగిందని కూయబట్టిండు.

విద్యా సంస్కృతి వీడి అమ్మ సొత్తు లెక్క మాట్లాడబడుతడు. అసలు విద్య అంటే ఏందో తెలుసా ఇసుమంటోల్లకు? శ్రీచైతన్య, నారాయణల బట్టీ గొట్టుడే వీళ్ళకు తెలిసిన ఒకే ఒక విద్య.

కాలం గడిచే కొద్దీ ప్రతి దేశం లోనూ, ప్రాంతం లోనూ జీవన ప్రమాణాలు మెరుగు పడుతూనే వుంటయి. అది రాజుల పాలన అయినా రాక్షసుల పాలన అయినా. రెండొందల సంవత్సరాల తెల్లోని పాలనల కూడా జీవన ప్రమాణాలు మెరుగుపడ్డయి అన్నది కాదనలేని నిజం. అంత మాత్రాన మనం కలకాలం వాని కిందనే బతుకాల్నా?

అసలు ఇట్లాంటి కూతలు కూసే వాళ్ళ ఉద్దేశాలు ఏంటియో అర్థం కావు. 'ఈ రాష్ట్రంల సమానత్వం లేదు, సవతి ప్రేమ వుందిరా బై, దానికి నిదర్శనం ఈ నీళ్ళ నిధుల మళ్లింపు' అని చెప్తుంటే దానికి సమాధానం వుండదు.

వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంట యంటే, 'నేను లోటస్ పాండ్లు, లాంకో హిల్సు కట్టుకున్నా కావొచ్చు, నువ్వు గుడిసె నుంచి పెంకుటిల్లుకు వచ్చినవు కదా? అందుకని నువ్వు కూడా అభివృద్ధి చెందినవు' అన్నట్టు.

నేను అభివృద్ధి చెందితే అది నా రెక్కల కష్టం తోని. ఆంధ్రా ప్రాంతపు సామాన్య ప్రజలు కూడా దాదాపు వాళ్ళ రెక్కల కష్టం తోనే అభివృద్ధి చెందినరు. కాని ఆంద్ర జనాభా ఎక్కువ కాబట్టి పాలన ఆంధ్ర నాయకుల గుప్పిట్ల వుంది. అందువల్ల దోచింది దోచుకుంటున్నరు, మిగిలింది ఆంధ్రల కర్చు పెడుతున్నరు. తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నరు. 

మా రాష్ట్రం మాకుంటే దాన్ని పాలించే నాయకుడు మంచోడైనా, చెడ్డోడైనా, కాంగ్రేసోడు అయినా తెలుగుదేశపోడు అయినా మాకు బాధ లేదు. అప్పుడు మా నీళ్ళతోని పక్క రాష్ట్రంల డ్యాములు కట్టలేడు. మా పైసలతోని పక్క రాష్ట్రంల యూనివర్సిటీలు, దావఖానాలు కట్టలేడు. అందుకనే మా రాష్ట్రం మాగ్గావాలె.