Monday, September 26, 2011

ఉద్యమం రూపం మార్చవలసిన సమయం వచ్చింది

నాలుగు లక్షల మంది ఉద్యోగులు, వాళ్లకు సంఘీభావంగా నాలుగు కోట్లమంది ప్రజలు ఉద్యమిస్తున్నా, ఈ తోలుమందం ఆంధ్రా బాజీ గవర్నమెంటుకు చీమ కుట్టుత లేదు. దోపిడీ శక్తులకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వానికి గాంధేయ వాదం పనికి రాదనీ అర్థమయ్యింది. 

కాబట్టి ఉద్యమ దిశను మరో కోణం లోకి మార్చవలసిన అవసరం వచ్చింది. ఒకవైపు గాంధేయవాదాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఉద్యమం వలన కలిగే నష్టం తెలంగాణా ప్రజలకు కాక, దోపిడీ శక్తులకు, వాటికి కొమ్ము కాసే ప్రభుత్వాలకు ఆ నష్టాలు బదిలీ కావాలి. ఉద్యమాల రూపకల్పన ఆ విధంగా వుండాలి.

నలభై ఎనిమిది గంటల రైల్ రోకో కార్యక్రమం అలాంటి కార్యక్రమాలలో ఒకటి. దీనితో ఉద్యమమ తీవ్రత, ప్రభావం ఒక్క తెలంగాణాపై కాక పూర్తి దక్షిణ భారత దేశం పై పడింది. జాతీయ మీడియా ఎలాగూ దోపిడీ శక్తుల కొమ్ము కాస్తూ, ఉద్యమ వార్తలను ప్రసారం చేయడం లేదు. కాబట్టి తోటి భారతీయులకు ఉద్యమం గురించి తెలియ జెప్పాలంటే అంతర్రాష్ట్రీయంగా ప్రభావం చూపే పద్ధతులను అవలంబించడం తప్పని సరి.

ఇక పొతే ఏ హైదరాబాదుపై అలవి కాని నిర్లజ్జా పూరితమైన మక్కువతో  సమైక్య శక్తులు రాష్ట్ర విభజనను అడ్డగిస్తున్నయో, ఆ హైదరాబాదుకి సీమాంధ్ర నుండి వచ్చే అన్ని మార్గాలను దిగ్బంధించి నిరవధికంగా మూసి వేయాలి. 

హైదరాబాదులో అక్రమ ఆస్తులు కూడబెట్టిన కబ్జాకోరుల ఆస్తులలో జెండాలు పాతాలి. తెలంగాణా ప్రజలు అలాంటి ఆస్తులు జప్తు చేసుకొని శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా హైదరాబాదును అప్పనంగా దోచుకోవడం కలలో కూడా వీలుకాదు అనే భావన ఈ దోపిడీ శక్తులకు కలుగ జేయాలి.

ఇంకా ఇలాంటి పోరాట రూపాలను తెలంగాణా వచ్చే వరక్కు నిరంతరంగా రూపొందిస్తూనే వుండాలి.

Thursday, September 1, 2011

లీకయిన నాదెండ్ల మనోగతం

ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక చంద్రబాబు, ఒక రోశయ్య...
 
ఈ పరంపరలో మరొక తేనే పూసిన కత్తి, నాదెండ్ల మనోహర్ రూపంలో తన నిజరూపం ప్రదర్శించింది. వికీలీక్స్ లో ప్రచురింపబడిన ఒక లీక్ అమెరికా కాన్సోలేట్ జనరల్ ఆఫీసరుతో మన నాయకమన్యులు మనసు విప్పి మాట్లాడిన విధానం ఇక్కడ చూడండి.


అతడు చేసినట్టుగా చెప్పబడుతున్న పై వ్యాఖ్యలలో తెలంగాణా సమస్యపై అతనికున్న ప్రాంతీయ పక్షపాతం, సంకుచితమైన ఆలోచనలు బయట పడుతున్నాయి.

తెలంగాణా సమస్య నక్సలిజం పెరగడానికి దోహద పడుతుందట. తెలంగాణా సమస్య కాదు నక్సలిజానికి తోడ్పడేది, తెలంగాణా సమస్య ఇలాగే కొనసాగితే, ప్రజా ఉద్యమాన్ని తుపాకులతో అణచివేస్తే అది తప్పకుండా తోడ్పడుతుంది. 1969 లో కూడా జరిగింది అదే. నాయకుల వారు దాన్ని తమకు అనుకూలంగా ఎలా వక్రీకరిస్తున్నారో చూడండి.

అంతే కాదు తెలంగాణా ఉద్యమం నడిపించే వారు ఒక సామాజిక వర్గానికి చెందిన వయసు మళ్ళిన విద్యార్థులు మాత్రమే అని చెప్పడం మరీ దారుణం. తెలంగాణా ఊరూరా, వాడవాడా ఒక వర్గం అని లేకుండా ఉద్యమం తెలంగాణాకి చెందిన ఆబాల గోపాలంలో వ్యాపించిన విధానాని వక్రీకరించి చెప్పడమే ఇది. అంతే కాదు, ఈ విధంగా సదరు పెద్దమనిషి ఒక కులంపేరు ఎత్తి మాట్లాడడం, అదీ విదేశీ రాయబారులతో, అత్యంత బాధ్యతా రహిత, నిర్లజ్జాకరమైన చర్యగా భావించవలసి వుంటుంది.

తన ప్రాంతీయ ప్రక్షపాట ధోరణిని తనంత తానే బయట పెట్టుకున్న ఈ పెద్దమనిషి శాసన సభాధ్యక్షత వహించడానికి ఏమాత్రం యోగ్యుడు కాదు. ఇతనికి ఏమాత్రం ఇంగితం మిగిలి వున్నా, లీకుల నేపథ్యంలో తన పదవికి స్వచ్చంధంగా రాజీనామా చేయాలి.