Tuesday, October 16, 2012

సాటుంగ సాటుంగ...

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని ప్రధానికి, కాప్ సదస్సుకు పోనీకి దొంగలెక్క దొడ్డిదారి కావలిసి వచ్చింది. దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి వచ్చి ఒక అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే టందుకు సాటుంగ సాటుంగ రావలసి వస్తుందంటే అంతకన్నా అవమాన మేముంటది? దీన్ని బట్టి తెలుస్త లేదూ, తెలంగాణా ప్రజల ఆగ్రహ, ఆవేశా లెట్లున్నయో? తెలంగాణా మనిషి అనేటోన్ని, చివరికి ప్రెస్ వాళ్ళను కూడా అక్కడ ఉండనియ్యకుండ తరిమేసినరంటే, ఇక్కడ ఉన్నది నిజాం లని మించిన నాజీల రాజ్యం లెక్క అనిపిస్త లేదూ? రాజ్యం చేస్తున్న దోపిడీ వర్గాలు తెలంగాణా ప్రజల కోపాగ్నిని చూసి ఎట్ల గజగజ వణుకుతున్నయో కళ్ళకు కట్టినట్టు కనపడుత లేదూ?

తుపాకులు ధరించిన మిలిటరీ మధ్య దాసుకొని ఎన్నాళ్ళు ప్రజలను అణచివెయ్య గలుగతరో వాళ్ళే ఆలోచించు కోవాలె. ప్రజల కోపం చూసి గుండె గుభేలు మంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పూటకో మాట మాట్లాడుకుంట, ఒకని మీద ఒకడు చాడీలు చెప్పుకుంట బాగనే నాటకాలు వేస్తున్నరు. వీళ్ళ నాటకాలను నమ్మి ప్రజలు వోట్లేసే రోజులు పోయినయి. మీరు సక్కగ ఉంటె ఎప్పుడో తెలంగాణ వచ్చేదని అందరికి అర్థమైంది.

ఇంక పోతే గులాం, వాయలార్లు గంటకోటి, పొంటెకోటి పొంతన లేని మాటలు మాట్లాడుతుంటరు. జీతం కోసం తెలంగాణా మాట, గీతం కోసం ఆంధ్ర మాట అన్నట్టు వుంటది వాళ్ళ మాటల తీరు! అవును మరి! తెలంగాణా రాదు అని చెప్తే ఏ లాంకో హిల్సు లోనో నాలుగు ప్లాట్లమ్ముడు పోతయి. ఏంతో కొంత కమీషన్ రాకపోతదా అన్న తపన వాళ్ళది. తెలంగాణా వస్తది అని చెప్తే వచ్చేది ఏమన్నా ఉన్నదా వాళ్ళకు, బూడిద తప్ప? ఎప్పుడో తెలంగాణా మీద ఇరుకున పడ్డప్పుడు అమ్మ గదమాయిస్తే  తప్ప తెలంగాణ పాట పాడే అవసరమేంది వాళ్లకు? పైస రాలని పాట పాడితే ఎంత, పాడక పొతే ఎంత?

వ్యాపారి ఎవ్వడైనా తన ఉత్పత్తి గొప్పదనాన్ని చెప్పుకొని సరుకు అమ్ముకోవాల్నని అనుకుంటడు. కాని కొంతమంది వ్యాపారులుగా మారిన బ్రోకర్లు మాత్రం సమైక్య వాదం ఉందని నమ్మించి పబ్బం గడుపుకోవాల్నని చూస్తరు. వాళ్లకు వ్యాపారం అంటే కులం, వర్గం, ప్రాంతం, అది కాకపొతే అవినీతి రాజకీయం! ఆ స్థాయిని మించని అరడజను దద్దమ్మలకు, వారి మోచేతి నీళ్ళకు ఆశపడే కొందరు రాజకీయ శిఖండులకు తప్ప ఎవ్వరికీ సమైక్యవాదం యొక్క అవసరం ఉన్నట్టు కనిపిస్త లేదు. ప్రత్యేక రాయలసీమ వాదంతోని బైరెడ్డి దూసుక పోగలిగినా, TRS తో చేయి కలిపిండని ప్రచారం చేసిన జగన్ ఒంటి చేత్తో కాంగ్రెస్, TDP లను మట్టి కరిపించినా, కోస్తాలో జై ఆంధ్రా ఉద్యమం ఊపందు కుంటున్నా అవి ఆంధ్రా ప్రాంతపు సామాన్యులు తెలంగాణా ప్రజలకు ప్రకటిస్తున్న సంఘీభావం తప్ప వేరే కాదు.


కోర్టు మొట్టికాయలు తినుకుంట కబ్జా భూముల్ల ఇండ్లు కట్టుకొనే లగడపాటి, తెలంగాణా మార్చి పైన నోరు చేసుకుంటున్నడు అంటే, అది తెలంగాణా ప్రజల మెతకదనం కాక ఇంకేంది? గిసుమంటోల్లకు బుద్ధి చెప్పాలంటే ఈసారి మార్చి ట్యాంకుబండు మీద గాదు, ల్యాంకో హిల్సుకు చెయ్యాలె. వీళ్ళు కూడ బెట్టిన దోపిడీ ఆస్తులు కాపాడుకునే టందుకు వీళ్ళకు నిద్రలు పట్టకుండ చెయ్యాలె. గప్పుడు తెలంగాణా దానంతట అదే వస్తది.   

1 comment:

  1. కర్నూల్‌లో విశాలాంధ్ర మహాసభ మీటింగ్‌పై రాయలసీమవాదులు దాడి చేశారు. రాయలసీమలో కూడా సమైక్యవాదం బలంగా లేదు. సమైక్యవాదం బలంగా ఉన్నది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏలుతున్న ఒక ఆర్థికంగా బలమైన కులంవాళ్ళు ఎక్కువగా ఉన్న విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాలలోనే. అందుకే మన నికృష్ట కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలలో తెలంగాణాకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కి చెందిన కమ్మ ఎం.పి.లు తెలుగు దేశానికి చెందిన కమ్మ ఎం.పి.లతో కొలాబొరేట్ చేసేలా ఎంకరేజ్ చెయ్యాలని సూచించింది. ఇటువంటి సూచనలు ఉన్న రహస్య రిపోర్ట్‌ని బయట పెట్టే ధైర్యం లేక గాంక్రెస్ ప్రభుత్వం దాన్ని రహస్యంగా ఉంచింది.

    ReplyDelete