Saturday, December 15, 2012

కాంగ్రెస్ తెలంగాణా వ్యతిరేకతకు కారణం ఏమిటి?

మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదని తేలి పోయింది. ఇప్పటిదాకా రాష్ట్ర, కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెపుతున్నా, వచ్చే ఎన్నికల లోపు కాంగ్రెస్ ఏదో ఓక నిర్ణయం తీసుకుంటుందని ఏమూలో ఒక చిన్న ఆశ. దానికి కారణాలు లేక పోలేదు. సీమాంధ్ర లో రోజు రోజుకి దిగజారుతున్న దాని పరిస్థితి, ఒక వేళ తెలంగాణాపై నిర్ణయం తీసుకుంటే కనీసం ఆ ప్రాంతంలో నిలదొక్కుకునే అవకాశం. కాని, మొన్న కేంద్ర హొమ్ మంత్రి అఖిల పక్ష సమావేశానికి పిలుస్తూ ఇచ్చిన లేఖని చూసిన తర్వాత కూడా ఎవరైనా ఆ పార్టీ తెలంగాణాను ఇస్తుందని నమ్మితే, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు.

కాంగ్రెస్ తెలంగాణాను ఇలా వెన్నుపోట్లు పొడవడం ఇది మొదటిసారి కాదు. గొప్ప ప్రజా చైతన్యంతో నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం జరిగి, నిజాంని మట్టి కరిపించే తరుణంలో పోలీస్ యాక్షన్ ప్రకటించి, అదే నిజాంని 'రాజ బహద్దూర్' చేసి, భరణం ఇచ్చి సాగానంపినప్పుడే నెహ్రూ, పటేల్ తెలంగాణా వెన్నులో మొదటి గునపాన్ని దింపారు. అది మొదలుగా కాంగ్రెస్ పార్టీ మోసాల పరంపర కొనసాగుతూనే వుంది.

1956లో విశాలాంధ్ర ఏర్పాటు చేసినప్పుడూ అదే తంతు. ఆ తర్వాత మోసాలూ, ఒప్పందాల ఉల్లంఘనలూ, 1969లో తెలంగాణా ఉద్యమం అణచివేత, మొన్నటికి మొన్న 2009లో ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోవడం... ఇలా ఒకటేమిటి? తెలంగాణాకు కాంగ్రెస్ చేసిన ద్రోహాలు చెప్పితే తరిగేవి కాదు. కాంగ్రెస్ చేసిన ఈ ఘనకార్యాలకు ఈ ప్రాంతంలో ఆ పార్టీ భూస్థాపితం కాకుండా తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక చివరి అవకాశం, అధికారంలో ఉండగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయడం.

కాని దానికి ఆ ఉద్దేశం ఏమాత్రం లేదని కొత్తగా ఇచ్చిన లేఖతో బయట పడింది. ఎంపీలు కోరారు కాబట్టి సమావేశం ఏర్పాటు చేస్తుందట. చర్చలను తిరిగి పునరుద్ధరిస్తుందట! తెలంగాణా ప్రజలను ఆ పార్టీ ఎంత చులకనగా చూస్తుందో  ఈ రెండు వాక్యాలు చూస్తే చాలు, తెలిసి పోతుంది.

తెలంగాణా ఇవ్వడం వల్ల తెలంగాణలో బలపడుతానని తెలుసు, ఆంధ్రాలో చెప్పుకోదగ్గ తేడా రాదనీ తెలుసు. బయటికేం చెపుతున్నా, తెలంగాణా ఇచ్చినా.., ఇవ్వకపోయినా దేశ వ్యాప్తంగా జరిగే మార్పులేమీ ఉండవని కూడా తెలుసు. భారత దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా తెలంగాలో ఉద్యమాలు జరుగుతున్నాయని కూడా తెలుసు. మరి ఏ నష్టం లేనప్పుడు, పైగా ఏంతో  కొంత లాభమే ఉన్నప్పుడు, ఆ పార్టీ తెలంగాణా ఏర్పాటుకు ఏందుకు సుముఖత చూపడం లేదు? ఇది  ప్రతి తెలంగాణా పౌరుడి మదిలో మెదిలే ప్రశ్న.

అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్న వారికి అది సులభంగానే అర్థమౌతుంది. ఇందిరాగాంధీ మరణం వరకూ కాంగ్రెస్ అమెరికానూ, మార్కెట్ విధానాలనూ ఎదిరించేదిగా పేరు తెచ్చుకుంది. రాజీవ్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అది తన దిశను మార్చుకొని, వరల్డ్ బ్యాంకు, అమెరికాల అడుగులకు మడుగులొత్తడం మొదలు పెట్టింది.

ఆ కారణంగానే దేశం మొత్తం వద్దని మొత్తుకున్నా, ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో వున్నా, అణు ఒప్పందాన్ని పార్లమెంటులో నెగ్గించుకుంది. దానికోసం కోట్లు కుమ్మరించి  ఎంపీలను కొనడానికి కూడా వెనుకాడలేదు. అలాగే వాల్ మార్టు వ్యవహారం కూడా. అదే సమయంలో మహిళా బిల్లు, జన లోక్ పాల్ బిల్లుల కోసం దేశ వ్యాప్తంగా ఎంత వత్తిడి వచ్చినా పట్టించు కోలేదు. ఇక తెలంగాణా సంగతి సరే సరి.

దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ అమెరికాకు, అంబానీలకు మాత్రమే జవాబుదారీ తప్ప, ఈ దేశ ప్రజలకు కాదని అర్థం కావడం లేదూ? మార్కెట్ శక్తులు ఆజ్ఞాపిస్తే కాంగ్రెస్ నిముషాల్లో తెలంగాణా ఇస్తుంది. కానీ అలా జరగడం లేదు... కారణం ఏమిటి?

తెలంగాణా రైతాంగ పోరాటం నుండి ఇప్పటివరకూ తెలంగాణా ప్రజలు మార్కెట్ భావ జాలానికి వ్యతిరేకం. ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. మార్కెట్ శక్తులకు ఊడిగం చేసే స్వభావం అసలే కాదు. మరి ఇలాంటి ప్రజల చేతుల్లో ప్రపంచ ప్రసిద్ధ మార్కెట్లలో ఒకటైన హైదరాబాదును ఎలా పెడతారు? చూస్తూ చూస్తూ అంత పెద్ద మార్కెట్ ను శాసించే అవకాశాన్ని మార్కెట్ శక్తులు వదులుకుంటాయా?

కాబట్టి కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణా రాదని స్పష్టమైంది. అదే విధంగా రేపు మరో కూటమి కేంద్రంలో అధికారం లోకి వచ్చినా, అది కూడా మార్కెట్ శక్తులకు ఊడిగం చేసే అవకాశం వుంది. అలాంటి పార్టీలు ఇప్పుడు ఏమి చెప్పినా, తర్వాత ఇచ్చిన వాగ్దానాలను అవే మార్కెట్ శక్తుల ఆదేశాల మేరకు తుంగలో తొక్కవని అనుకోలేం.

ఉద్యమాలతో తెలంగాణా సాధించాలని కొందరి వాదన. ఉద్యమాలతో తెలంగాణా వచ్చే అవకాశమే వుంటే అది ఇప్పటికే వచ్చి వుండాలి. ఒక్క సాయుధ పోరాటం తప్ప తెలంగాణా ప్రజలు ఇప్పటికే అన్ని రకాల ఉద్యమ రీతులను ఇంతక ముందు దేశంలో ఎక్కడా కనీ, వినీ ఎరుగని రీతిలో చేసి వున్నారు. ఇప్పుడు మరి కొన్ని ఉద్యమాలు చేసినా అవి బలమైన శత్రువు ముందు ఏమాత్రం పనిచేయవని లోక్ పాల్, వగైరా ఉదంతాలు ఈ పాటికే తేట తెల్లం చేశాయి. ప్రజలు ఉద్యమాలు చేసిన కొద్దీ, ప్రభుత్వం మరిన్ని అధునాతన ఆయుధాలు దిగుమతి చేసుకొని మరింత నైపుణ్యంగా వాటిని అణచి వేస్తుందే తప్ప, ప్రజల కోరిక నేరవేర్చుదామనే ఆలోచన చేయదు.

కాబట్టి  రాష్ట్ర సాధన కోసం తెలంగాణా ప్రజలు ముందు రాజకీయంగా బలపడాలి. నిఖార్సైన తెలంగాణా వాదులను అత్యధికంగా పార్లమెంటుకి, అసెంబ్లీకి  గెలిపించడం ద్వారా, రాష్ట్రంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించ గలిగినప్పుడే ఆ అనివార్యత సాధ్యం అవుతుంది. ఎదురు నిలిచి పోరాడే వాడికి కట్టెనిచ్చి, పారిపోయే వాడికి కత్తి నివ్వడం వలన ఉపయోగం లేదు. కాబట్టి పన్నెండేళ్ళుగా నిబద్ధతతో తెలంగాణా ఏర్పాటుకోసం ఉద్యమిస్తూ చిత్తశుద్ధిని చాటుకున్న కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణా రాష్ట్ర సమితిని అత్యధిక సీట్లలో గెలిపించడం ఒకటే ఇప్పుడు తెలంగాణా ప్రజల ముందున్న మార్గం. అంతకు మించిన మార్గం లేదు.








3 comments:

  1. కెసిఆర్ నాయకత్వం లోని పార్టీని 2000 స్తనిక సంస్తల ఎన్నికలనుండి తెలంగాణ ప్రజలు గెలిపిస్తూనే వస్తున్నారు.2004 లో కాంగ్రెస్ మోసకారి పార్టీ అని తెలిసినా కెసిఆర్ పొత్తు పెట్టుకున్నాడు కనుక కాంగ్రెస్ కెసిఆర్ కూటమిని ప్రజలు అత్యధిక మెజారిటీ తో గెలిపించినారు.కానీ కెసిఆర్ ప్రభుత్వం లో చేఋ భ్రస్తూ పట్టి పోయి ఉన్న ఎమ్మెల్లెలను వైఎస్స్ర్ కొనుగోలు జేసుకొనే దాకా సోయి లేకుండా ఉంది తన పరపతి ప్రజల్లో పూర్తి పలుచన అయ్యీ దాకా కాంగ్రెస్ విహ్స కౌగిలి లో ఉంది బజారులో పడే సామ్యం లో ఉప ఎన్నికల్లు అంటే అన్నప్పుడల్లా ఇజ్జటు పోకౌండా గెలిపిస్తూ వచ్చినారు. ఎప్పుడు ఎన్నికలు సీట్లు ఆ పోరాటమే డప్ప మిలియన్ మార్చ్ కు సహకరించలేదు, సకల జనుల సమ్మె లో కోదండ రామ్ ను తీసుకొనే దెల్లి వెళ్ళి పోయే. హైద్రాబాద్ ర్యాలీకి రాకనే పోయే. పోరాటం ఉధృతం అయ్యే ప్రతిసారి తెలంగాణ రాకుండా కెసిఆర్ అడ్డుపడ్డాడు అనే వాళ్ళ నార్లు మూయించే విధంగా ఒక్క పోరాటం చేసింది లేదు కదా? చేంద్రబాబు అన్నత్త్లు తెలంగాణ వస్తే ఇతని దుకాణం బందు అందుకే కెసిఆర్ తెలంగాణకు అడ్డు పడుతుండు అంటే ధీటనిన జవాబే లేదు కదా.ఉద్యమాలు గట్టి గా ప్రభుత్వాన్ని స్తంభింప జేసింది ఎప్పుడు ఒక్క సకల జనుల సమ్మేలో డప్ప దాన్నీ మరో పది రోజుల వరకు కొనసాగించేదానికి కెసిఆర్ సహకరించి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేది. ఓట్ల అవినీతి ఎంత ఘోరంగా ఉన్నదో చూస్తూనే ఉన్నాము. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆం ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రి వల్ల్ ను పచ్చి అవినీతి పరుడు దిగ్విజయ్ సింగ్ ఎన్నికల్లో పొరాడి గెలిస్తే మాట్లాడు అని సవాలు విసిరిన సంగతి చూసే ఉంటారు. ప్రజలు అంతా చైత్న్య వంతులే అయి ఉంటే ఈ రాజా కీయ నాయకులౌ ఇన్ని లక్షల్ కోట్ల కుంభకోణాలు చేస్తుంటే అక్రమ ఆస్తులు సంపాదించుకొంటూ ఉంటే రేపు వచె తెలంగ్న మాపు వచె తెలంగాణ అని పూతకో అబధ్ధం చెప్తూ ఉంటే చెప్పులు చీపుర్లు పట్టి తరుమక పొయ్యే వాళ్ళా ఎప్పుడో.

    ReplyDelete
    Replies
    1. @నారగోని

      KCR వ్యూహాల్లో ఏ పొరబాట్లు లేవని నేననను. ఏ నాయకుడైనా మనిషే కాని దేవుడు కాదు. పొరబాట్లకు YS, సొనియా, చంద్రబాబు సహా ఎవరూ అతీతులు కారు. నాయకుని విజయాలను విస్మరిస్తూ పొరబాట్లనే లెక్కించడం గిట్టనివాల్లు మాత్రమే చేసే పని.

      ఇలా చేస్తే తెలంగాణా వచ్చేది, అలా చేస్తే తెలంగాణా వచ్చేది, అని చెప్పడం బహు తేలిక. ఇప్పటివరకు తెలంగాణా ప్రజలు అవలంబించని ఉద్యమ రీతి లేదు, ఒక్క సాయుధ పోరాటం తప్ప. ప్రజాస్వామ్య ఉద్యమాల వల్లనే తెలంగాణా వచ్చే పనైతే, అది ఈపాటికే రావలసింది. కాని ప్రస్థుత ప్రభుత్వాలకు ప్రజా ఉద్యమాలపై ఎలాంటి గౌరవం లేదు, ప్రపంచ బ్యాంకు విధానాల పట్ల తప్ప, అది ఈ పొస్టులో స్పష్టంగానే వివరించాననుకుంటున్నాను.

      ఇకపోతే 2004లో కాంగ్రెస్‌తో, 2009లో తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవడం వలన TRS ఒక పార్టీగా బలహీన పడి ఉండవచ్చు. కాని ఆ రెండు పార్టీలు తెలంగాణా వాదాన్ని తలకెత్తుకునేలా చేయడంలో విజయం సాధించ గలిగింది. అది TRS గెలవడం కన్నా పెద్ద విజయం.

      KCR తెలంగాణాకు అడ్డుపడతున్నాడు అని విమర్షలు చేసేదెవరు? సమైక్యవాదులో, లేక ఆ సమైక్యవాదులకు కొమ్ము కాసే మందకృష్ణ, మోత్కుపల్లి లాంటివారు మారు మాత్రమే. నిజంగా ఆయన తెలంగాణాకు అడ్డుపడితే అలాంటివారు బాధ పడడానికి బదులు సంతోషించాలి. కాని అలా కాకుండా ఆయన్ను ఆడిపోసుకుంటున్నారంటేనే, KCR నిబద్ధతకు అంతకు మించిన సాక్ష్యం అవసరం లేదు.

      Delete
    2. excelent reply srikanth garu

      Delete