Monday, August 1, 2011

గిరీశం పరిష్కారాలు

‘వడ్డించేవాడు మనవాడయితే కడపంక్తిని కూర్చున్నా అన్నీ సమకూరుతాయ’న్నట్టుగా అకారాది క్రమంలో రాష్ట్రం పేరు ఆఖరుస్థానంలో ఉన్నంత మాత్రాన రాష్ట్రా ల ఉనికీ, ఉసురూ, సగటు బతుకూ చెడిపోదుగదా!... ఆంధ్రప్రదేశ్ అనే దుష్టసమాస భూయిష్టమైన పేరుకు బదులు యావత్తు తెలుగుదేశానికి (మూడు ప్రాంతా లు ముప్పేటగా) తెలంగాణం(లేదా తెలంగాణ) అనే పేరును స్థిరపరుస్తూ రాజ్యాం గ సవరణకు ఉద్యమించడం తెలుగుజాతి సమైక్యతకు అత్యవసరం.
-సీనియర్ జర్నలిస్టు ఎబికె ప్రసాద్

అమెరికా సామ్రాజ్యవాదంపై పోరాటమెందుకూ?
అమెరికాకు భారతదేశమనో, చైనా అనో పేరుపెడితే పోలా!
ప్రపంచబ్యాంకుపై అంతగా విరుచుకుపడడం ఎందుకూ?
దానికే 'ఆంధ్రా బ్యాంకు' అని నామకరణం చేయడం బెటర్ కదా!
కార్యకారణ సంబంధాలపై చర్చ ఎందుకు?
కార్యాలన్నీ కారణాలే అని సరిపెట్టుకుంటే మంచిదేమో!
వర్గశత్రు నిర్మూలన పోరాటాపూందుకూ?
పెట్టుబడిదారులకూ ‘కార్మికుల’ని టైటిల్ తగిలిస్తే ఫినిష్!


ఎడిటర్లు గిరీశాలయితే పరిష్కారాలన్నీ ఇలాగే ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణం అని పెడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయట. ఇదేమైనా కొత్త విషయమా? విలీనం సమయంలో రాష్ట్రానికి పెట్టాలనుకున్న పేరు తెలంగాణ-ఆంధ్ర అని. పార్లమెంటు పరిశీలనకు వచ్చిన బిల్లులో కూడా ఆ పేరే ఉంది. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ఆ రూపంలోనూ గుర్తించడానికి నిరాకరించిన ఆంధ్రా ఎస్టాబ్లిష్‌మెంటు అప్పుడే దానిని మార్పించి, ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు పెట్టుకుంది. ఐదున్నర దశాబ్దాల పీడన తర్వాత ఇప్పుడు కేవలం పేరు మార్చితే సరిపోతుందని ఈ మార్క్సిస్టు ఘనాపాఠి తీర్పు ఇస్తున్నారు.

ఎంత విడ్డూరమంటే పేరులో ఏమీ ఉండదని, అక్షరక్రమంలో ఎక్కడ ఉన్నా ఉసురూ, ఉనికీ, సగటు జీవనానికి వచ్చే నష్టమేదీ లేదని ఆయనే రాశారు. ‘వడ్డించేవాడు మనవాడయితే కడపంక్తిలో కూర్చున్నా అన్నీ సమకూరుతాయి’ అని కూడా ఆయన సెలవిచ్చారు. ఎబికె ప్రసాద్ ఎంత స్మార్టో! పేరు మార్పు జరిగినా ఏమీ ఒరగదని ఆయనే చెబుతారు. పేరు మార్చితే తెలంగాణ సమస్య పరిష్కారం అవుతుందనీ ఆయనే అంటారు. వడ్డించేవాడు మారకుండా, అంటే ఆంధ్ర ఆధిపత్యం మారకుండా, తెలంగాణ సమస్య పరిష్కారం కావాలన్నమాట. ఇది యథాతథవాదం. దోపిడీని శాశ్వతం చేసుకోవాలన్న తాపత్రయం. తెలంగాణ కష్టాలు, కన్నీ ళ్లు, బలిదానాలు ఇవేవీ పరిష్కారం కావాల్సిన అవసరం లేదు ఈ మతి తప్పిన గతితార్కిక మేధావికి.

రాజీనామాలు చేసినంత మాత్రాన రాష్ట్రాలు ఇచ్చేస్తారా? అలాగైతే కృష్ణా జిల్లా నేతలందరితో రాజీనామాలు చేయిస్తా. ఆ జిల్లాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తారా?
-ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు

బుకాయింపులతో భూములేలవచ్చునని సామెత. కావూరివారు ఇంతకాలం చేస్తున్నది ఇదే. తెలంగాణపై తమ ఏలుబడిని కొనసాగించడానికి ఇక మిగిలిన ఏకైక అస్త్రం- బుకాయించి బతకడం, దబాయించి చెలాయించడం. ఏ వాదం లేనివాడే వితండవాదం చేస్తాడు. ఏ తర్కమూ చేతగానివాడే కుతర్కానికి దిగుతాడు. సమైక్యాంధ్ర మోయడానికి కావూరి వారికి ఇంకేదారీ మిగల్లేదు- అడ్డగోలు మాటలు, అహంకార ప్రదర్శనలు తప్ప. తెలంగాణవాదానికి చరిత్ర ఉంది. పోరాటవారసత్వం ఉంది. త్యాగాల భూమిక ఉంది. ఒక్క సీపీఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ వాదాన్ని అంగీకరించిన రికార్డూ ఉంది. వీటన్నింటినీ అవమానించాలన్న జాతిదురహంకార దృష్టితో కావూరివారు మాట్లాడుతున్నారు.

రాజీనామాలు చేస్తే కృష్ణా జిల్లాను రాష్ట్రం చేస్తారా? అని ఈ పెద్ద మనిషి అడుగుతున్నారు. సీమాంధ్ర నాయకులు ఆది నుంచి పరాన్న జీవులే. నాడు బెజవాడను రాజధానిని కాకుండా అడ్డుకున్న మరుగుజ్జులు కృష్ణా జిల్లా నాయకులే. అటువంటి నాయకులకు కృష్ణా జిల్లా కోసం రాజీనామాలు చేసే దమ్ము ఉందా? అంత ఉబలాటంగా ఉంటే రాజీనామాలు చేయండి! జిల్లాకో రాష్ట్రం ఏర్పాటు చేసుకోండి. బంగాళాఖాతంలో కలవండి. కానీ తెలంగాణకు అడ్డుపడితే మిమ్మల్ని చరిత్ర క్షమించవచ్చు, కానీ తెలంగాణ క్షమించదు.

ఆంధ్ర ప్రాంతంవారి మోచేతి నీళ్లు తాగి మేము బతకలేం. తెలంగాణ ఏర్పాటు చేస్తే రాయలసీమ కూడా ఏర్పాటు చేయాలి.
-రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్

నేతిబీరలో నెయ్యి ఎంతో సమైక్యతలో ఐక్యత అంత. ఆంధ్రావారి పట్ల రాయలసీమ వారికే నమ్మకం లేనప్పుడు తెలంగాణవారికి ఎందుకు నమ్మకం ఉంటుం ది? ఇక్కడ విడిపోతే అక్కడ కలసి ఉండరట. తెలంగాణను కొల్లగొట్టడానికి మాత్రం కలిసి కట్టుగా పోరాడతారన్నమాట. తాము దోచుకోవడానికి దాచుకోవడానికి అవకాశం ఉన్నంత కాలమే సమైక్యత లేకపోతే అక్కరలేదు.

రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బిజెపి రాష్ట్ర విభజనపై మాట్లాడడం ఏమిటి?
-కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్

అబద్ధాల ఘనాపాఠి లగడపాటి రాజగోపాల్ తొంభైతొమ్మిదో అబద్ధం ఇది. బీజేపీకి ఒక్క శాతం కూడా ఓట్లు లేవట. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో వచ్చిన ఓట్లు 4 శాతం. ఆ పార్టీ జాతీయ పార్టీ. దేశవ్యాప్తంగా 20 శాతానికిపైగా ఓట్లు కలిగిన పార్టీ. రాజగోపాల్ ఒక టుమ్రీ. రాజగోపాల్‌కు వచ్చిన ఓట్ల శాతం రాష్ట్రం మొత్తం మీద చూస్తే ఒక్క శాతమే. కానీ రాష్ట్ర విభజనపై ఈయనగారు వాగినట్టుగా ఎవరయినా వాగుతున్నారా? ఈయనగారు ఒక్క శాతమే ఓట్లు ఉన్న ఎంఐఎం అభి్రప్రాయానికి మాత్రం విలువ ఇవ్వాలంటారు. చిన్న రాష్ట్రాలకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకమని ఆ సంస్థ సర్‌సంఘ్‌చాలక్ చెప్పినట్టు ఇంకో అబద్ధాన్ని కూడా ఎలాంటి జంకూ గొంకూ లేకుండా చెప్పారు రాజగోపాల్. ఈ వార్త కూడా సీమాంధ్ర మీడియా సృష్టే. ఈ వార్త పచ్చి అబద్ధమని ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి రాంమాధవ్ అప్పట్లోనే ఖండించారు. బధిరాంధకారంలో మగ్గుతున్నవాడికి, అహంకారంతో కళ్లు మూసుకున్నవాడికి సత్యం తలకెక్కదు.

మన దేశంలో కొందరికి డబ్బు పిచ్చి పట్టుకుంది. వేల కోట్ల రూపాయలు దోచుకుని రాశులు పోసుకుంటున్నారు. వందల గదులతో ప్యాలెస్‌లు కట్టుకుంటున్నారు. వాటిని ఏం చేసుకుంటారు? కట్టుకుపోతారా?
-రాందేవ్ బాబాతో కలిసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

యోగి యోగిని కలిస్తే విలువ. యోగి భోగిని కలిస్తే నగుబాటు. రాందేవ్ బాబా అన్నాహజారేతో చేతులు కలిపితే అందరూ సంతోషించారు. అవినీతికి వ్యతిరేకంగా వీరిపోరాటానికి నైతికంగా మద్దతు ప్రకటించారు. అదే రాందేవ్ బాబా చంద్రబాబునాయుడును కలిసి అవినీతి వ్యతిరేక పోరాటం గురించి మాట్లాడినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. ఎందుకంటే అవినీతి విషయంలో చంద్రబాబుకు ఉన్న విశ్వసనీయత అటువంటిది. చంద్రబాబునాయుడు పాలిష్డ్ అవినీతికి పునాదులు వేశారు. రాజశేఖర్‌డ్డి దానిని కొత్త పుంతలు తొక్కించడమే కాదు, పరాకాష్ఠకు తీసుకెళ్లారు. కొందరు ఆస్తులు కూడ బెడతారు. మరికొందరు ప్యాలెస్‌లు కడతారు. అవినీతి ఒకటే, స్టైలే వేరు. అందుకే రాందేవ్ బాబా తప్పులో కాలేసి, అవినీతి వ్యతిరేక పోరాటం గాలి తీసేశారు. కొన్ని విషయాలపై కొందరిని కలవకపోతే మంచిది. కొందరిని కలిస్తే మంచిది. బాబా ఆ తేడాను పాటించలేదు.

- కట్టా శేఖర్‌రెడ్డి

No comments:

Post a Comment