మా నాయన గారికి క్యాటరాక్టు ఆపరేషన్ చేయించాను. ఆ తర్వాత చూపులొ తేడా వస్తుంది కాబట్టి అద్దాలు మార్పించుకోవాలి. కాని ఎన్నిసార్లు అద్దాలు మార్పించడానికి వెళ్దామన్నా ఒకటే తంతు.
"బాపూ, దావఖానకు పోదాం, అద్దాలు మార్పించుకోవాలెగద!"
"ఎందుకుర? నడుస్తుందిగద నడువనియ్య రాదు!"
"ఆపరేషన్లన్ని చేసుకున్నంక అద్దాలకు వెనుకకు పోవుడెందుకు? ఒక్క పూట దావఖానకు వస్తివంటే, పాయింటు చూసుకున్నంక అద్దాలు నేనే పట్టుక వస్త."
"ఆ! యెందుకు? ఇప్పుడు నడుస్తనే వుంది గద. లేకపోతెమాయె తియ్యి."
"మరి చూపు కనబడు
తుందా బాపు?"
"టీవీ మంచిగనే కనబడుతుంది. కింది అక్షరాలు కూడ తెలుస్తున్నయి. గా పేపరే, చదువక పోతె యేంది? అన్ని టీవీలనే వస్తున్నయి గద! అవసరమైతె చూద్దాంలే"
ఇలా కొంతకాలం గడిచింది. ఎప్పుడూ నేను అద్దాల గురించి అడుగుడు, ఆయన వాయిదా వేసుడు మామూలుగా జరుగ సాగింది. కొన్నాళ్ళకు నేను అడగడమే మానివేశాను.
ఒక రోజు హటాత్తుగా బాపే అడిగిండు. "అద్దాలకు పోదామంటివి గదర!"
"ఆ, పోదాం"
"ఇప్పుడు పోదామా?"
"ఈ టైముల డాక్టరుండడు. రేప్పొద్దున పోదాం"
"సరే" ముఖంలో కొంచెం నిరాశ కనిపించింది.
నాకు ఆశ్చర్యమేసింది. ఇన్నాళ్ళు బయటికి రావడానికే నిరాకరించిన మనిషి ఈరోజు తనంత తానే అడిగాడేమిటా అని!
అప్పుడు చూశాను. చేతిలో కనపడింది... నమస్తే తెలంగాణా!