Saturday, April 14, 2012

ఆంధ్రా దోపిడీ శక్తులను ఎదిరించాల్సిన అవసరం ఏమిటి?


తెలంగాణా వారి నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు దోపిడీకి గురికావడం అనేది ప్రత్యక్షంగా కనపడుతున్న, సమైక్య వాదులు కూడా కాదనలేని సత్యం. ఇలాంటి వాటిని రుజువులతో సహా చూపినప్పుడు, వీరు సమాధానం చెప్పలేక దాట వేసే ధోరణి లోకి దిగుతుంటారు.

"ఆ! ఏముంది లెండి! దోపిడీ ఎక్కడ లేదు? కాంగ్రేసు వారు మన ఒక్క రాష్ట్రమే నేమిటి? దేశం మొత్తమూ దోచుకుంటున్నారు. ఆ దోపిడీలో భాగమే ఈ దోపిడీ. దీంట్లో ప్రత్యేకంగా ఆంధ్రా వారు తెలంగాణా వారిని దోచుకుంటున్న దేమీ లేదు." అనేది వీరి వాదన.

అవును, దేశంలో రక రకాల దోపిడీలు, వివక్షలు కొనసాగు తున్నాయి. వీటిలో బాధిత వర్గాలు, బాధించే వర్గాలూ వున్నాయి. బాధిత వర్గాలు బాధించే వర్గాల పై ఎప్పుడూ పోరాటం చేస్తూనే వున్నాయి. పోరాటం వారి వారి బాధల నుండి విముక్తి కోసమే కాని, ఎదుటివారిని బాధించాలనే ఉద్దేశం ఎంతమాత్రం కాదు.

అలాగే బాధితులు తమ బాధల గురించి ఆలోచిస్తారు కాని, ఇంకో వర్గం వారు కూడా బాధ పడుతున్నారు కదా అని సంతృప్తి పడిపోయి సంతోషించరు. అవసరమైతే దమన కాండకు గురౌతున్న ప్రతి ఒక్కరినీ కలుపుకు పోవడానికి ప్రయత్నం చేస్తారు.

తెలంగాణా ప్రాంతం లోనే వున్న కొంతమంది భూస్వాములు, పెట్టుబడి దారులు ఆంధ్రా పెట్టుబడి దారుల మాదిరిగానే అవినీతి, ఆశ్రిత పక్ష పాతం, దోపిడీ మొదలైనవి చేస్తూ ఉండొచ్చు. అంతమాత్రాన ఆంధ్రా ప్రాంతం వలన తెలంగాణా ప్రాంతానికి జరిగిన దోపిడీ ఒప్పై పోదు.

రకరకాల దోపిడీలపై రకరకాల ఉద్యమాలు నడుస్తున్నాయి. దోపిడీ శక్తుల పై పైచేయి సాధించి తద్వారా వారి నుండి విముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాయి.

దోపిడీ శక్తులు ఎప్పుడూ మైనారిటీ గానే వుంటాయి. కాని అవి ప్రజలకు చేసే హాని మాత్రం అధికంగా, ప్రానాన్తకంగా వుంటుంది. ఉదాహరణకు దేశంలో అవినీతికి రారాజులుగా మారి కోట్లకు కోట్లు భోంచేసే వారు, ఆ అవినీతి వల్ల బాధకు గురయ్యే ప్రజలతో పోల్చినప్పుడు చాలా తక్కువ మందే. అలాగే తెలంగాణాపై సాగుతున్న ఆంధ్రా ప్రాంతీయ దోపిడీకి కూడా కారకులు కొంతమంది మాత్రమే. అయినా కూడా ఆ అవినీతి సామ్రాట్టుల పై ఉద్యమాలు చేసి పై చేయి సాధించ డానికి ప్రజలకు శక్తి సరిపోవడం లేదు. కాని అంతిమ విజయం మాత్రం ఎప్పుడైనా ప్రజలదే.

అలాగే కొంత కాలం తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమాలు పై చేయి సాధించి కఠినమైన చట్టాలను అమలులోకి తెచ్చినా, దాని వల్ల అన్ని సమస్యలు తీరుతాయనుకోవడం పొరబాటు. దళిత విముక్తి ఉద్యమాలు, బహుజన సాధికారతా ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు దేనికవిగా కొనసాగ వలసిందే. అలాగే ప్రాంతీయ ఉద్యమాలు కూడా. ప్రతీ ఉద్యమానికి స్పష్టమైన లక్ష్యాలున్నాయి.

ఒక ఉద్యమంలో మంచి ఫలితాలు వస్తే, అది మరో ఉద్యమానికి ప్రేరణ ఇవ్వవచ్చు తప్ప, మిగతా ఉద్యమాల లక్ష్యాలేవీ వాటంత అవే పరిష్కారమై పోవు. అంతే కాదు, ఒక విధమైన దోపిడీ శక్తులు అంతరించిన సందర్భంలో, మరో రకమైన దోపిడీ శక్తులు ఉద్భవించ వచ్చు కూడా.

అంటే, తెలంగాణా ఉద్యమం సఫలమై, తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రా దోపిడీ శక్తులు ఈ ప్రాంతంలో బలహీన పడి, తెలంగాణా భూస్వామ్య, పెట్టుబడిదారీ శక్తులు విజృంభించ వచ్చు. ఆ విషయం పై ప్రజలు ఎప్పుడైనా అప్రమత్తంగా ఉండ వలసిందే.

అంతమాత్రం చేత ఇప్పడు నడుస్తున్న ఆంధ్రా దోపిడీ శక్తులను ఎదిరించాల్సిన అవసరం ఏమిటి? అనే సందేహం రావచ్చు. దీనికి సమాధానం చెప్పడానికి సమస్యను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం వుంది.

దోపిడీ వివిధ రూపాలలో దేశమంతా వుందనే విషయం జగమెరిగిన సత్యం. వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరుగుతూనే వున్నాయి. కాని ఆ ఉద్యమాలలో దేని అంతిమ లక్ష్యం కూడా తెలంగాణా ప్రాంతం పై జరుగుతున్న దోపిడీ, విచక్షణలు కావు. ఆయా ఉద్యమాల సాఫల్యత పై తెలంగాణా సమస్యలు తీరే అవకాశం లేదు.

ఇంతకూ ముందే అనుకున్నట్టు, ఈ రకమైన ప్రాంతీయ దోపిడీకి కారకులు కొంతమందే. కాని దాని దుష్పరిణామాలు అనుభవించ వలసి వస్తున్నది మాత్రం తెలంగాణా ప్రజలే. అలాగే ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాభ పడుతున్నది మాత్రం ఆంధ్రా ప్రజలే. అందువల్ల సహజంగా ఆంధ్రా ప్రాంతపు ప్రజలు తమ ప్రాంత పక్షపాతిగా వ్యవస్తీకృతమైన రాష్ట్ర అధికార ప్రక్షాళనకు ముందుకు రారు, పైగా నిర్లిప్తత వహిస్తారు. మెజారిటీ ప్రజలు వారు కాబట్టి పదే పదే అదే రకమైన పక్షపాత పూరితమైన పాలన నెలకొల్ప డానికి కారకులవుతారు. ఇక తెలంగాణా ప్రజలకు మిగిలింది ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడడం తప్ప మరో మార్గం లేదు.

అలాంటప్పుడు, తెలంగాణాను దోపిడీ విముక్తం చేయడానికి ఎవరు ఉద్యమించాలి? ఖచ్చితంగా తెలంగాణా ప్రజలే. వారు ఇప్పుడు చేసేది కూడా అదే! తమ ప్రాంతం యొక్క అణచివేత పోరాటంలో విజయం సాధించిన తర్వాత, తప్పకుండా తెలంగాణా ప్రజలు దేశంలో కొనసాగుతున్న మిగతా ఉద్యమాలలో భాగస్వాములు కావడమే కాదు, వాటికి ప్రేరణ కల్పిస్తారు కూడా.
  

1 comment:

  1. Entanna, pennu power thagguthundhi. comments disable chesaavu. entanna bayapaduthunnava. nee venuka memuntaamu. nee post kosam edhuru chusthune unnanu. pranalne isthunnaru. manmu idina cheyyalema.
    JAI TELANGANA.
    venukadugu veyyaku. Neevu venukaku vellithe nenu mundhukostha. mundhuku parigedutha. D kodutha.

    ReplyDelete