Sunday, December 1, 2013

రాయల తెలంగాణా, సరికొత్త రాగం


రాష్ట్ర విభజన చివరి దశలో ఉన్న సమయంలో రాయల తెలంగాణా అంశం ముందుకొచ్చింది. కర్నూలు, అనంతపూరు జిల్లాల్లోని రాజకీయ నాయకులు అందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ ఇది ఎప్పటి నుండో కోరుతున్నారు. కేంద్ర కాంగ్రేస్  నాయకత్వం కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను అందుకు ఒప్పిస్తున్నట్టే కనిపిస్తుంది.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని ఆ రెండు జిల్లాల లోని ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయం ఇంకా తెలియడం లేదు. ఆ ప్రాంతపు నాయకులు మాత్రం తాము ప్రజల ఆకాంక్షలనె ప్రతిబింబిస్తున్నామని చెప్తున్నారు. తెలంగాణా ప్రాంతపు ప్రజాసంఘాలు, JAC లు మాత్రం తాము పది జిల్లాలతో కూడిన తెలంగాణకు తప్ప దేనికి ఒప్పుకోమని నిర్ద్వందంగా చెప్తున్నయి. 

ఒప్పుకోక పొతే హైదరాబాద్ ను UT చేస్తామనే బూచిని చూపి కేంద్రం తెలంగాణా వాదులను ఒప్పించ వచ్చు. సీమలోని ఆ రెండు జిల్లాలు కలవడం వలన శ్రీశైలం ప్రాజెక్టు నుండి వచ్చే నీటిని, కరెంటును వేరొక రాష్ట్రంతో పంచుకో వలసిన పరిస్థితి తప్పి పోతుంది. ఆ ప్రాజెక్టుపై, పరిసర కృష్ణ, తుంగభద్రా బేసిన్ పై పూర్తీ హక్కులు తెలంగాణా ప్రభుత్వానికి దాఖలు అవుతాయి. అనంతపురం జిల్లా దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంగా పేరొందింది. ఇక తెలంగాణా మొత్తం మెరక ప్రాంతమే. కాబట్టి ఇతర తెలంగాణా జిల్లాలతోబాటు అనంతపురం అభివృద్ధి బాధ్యతలు కూడా తీసుకోవడం దానికి శక్తికి మించిన బాధ్యత అవుతుంది. సస్య శ్యామల ప్రాంతమైన సీమాంధ్రకు అనంతపురం బాధ్యత తీసుకోవడం పెద్ద కష్టం కాక పోవచ్చు. కాని ఆ జిల్లా ఆంధ్రలో కలిపితే  మరింత అనాధ అయ్యే ప్రమాదం వుంది. గత అనుభవాల ప్రకారం చూస్తినట్టైతే ప్రాబల్యం కలిగిన కోస్తావారు తనకు మాలిన ధర్మంతో ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ జిల్లాని అభివృద్ధి పరుస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే ఆ రెండు జిల్లాలు తమను తాము ఆంధ్రరాష్ట్రంతో మమేకం చేసుకోలేక పోతున్నాయి!

గడిచిన ఐదు దశాబ్దాలుగా, అధిక జనాభా కలిగి, 175 అసెంబ్లీస్థానాలతో సీమాంధ్ర ప్రాంతం తెలంగాణాపై రాజకీయ ఆధిపత్యం సాధించి, తెలంగాణను ఒక వలస ప్రాంతంగా మార్చ గలిగింది. తెలంగాణా రాజకీయ మనుగడ కష్ట సాధ్యం అయింది. కాని కేవలం రెండు జిల్లాలను కలుపుకోవడం వల్ల తెలంగాణా రాజకీయ అస్తిత్వానికి కలిగే చేటు ఏమీ ఉండక పోవచ్చు. కేవలం రెండు జిల్లాల వారు పది జిల్లాల ప్రాంతంపై రాజకీయ ఆధిపత్యం సాధించే అవకాశం చాలా తక్కువ, వారి ఫ్యాక్షనిస్టు మూలాలను పరిగణ లోనికి తీసుకున్నప్పటికీ. 

కాని ఆ రెండు జిల్లాల ప్రజలు తెలంగాణా సంస్కృతి, వ్యవహారాలలో ఏవిధంగా మమేకం కాగలరు? అది ఆ రెండు జిల్లాల వారు వేసుకోవలసిన ప్రశ్న. వారు కలిసినంత మాత్రాన తమ సంస్కృతీ చిహ్నమైన 'తెలంగాణా' పదాన్ని 'రాయల తెలంగాణా' గా మార్చుకోవడానికి తెలంగాణా ప్రజలు ఏమాత్రం ఇష్టపడరు. కలిస్తే, గిలిస్తే వారు తెలంగాణా రాష్ట్రంలో భాగంగా కలవ వలసిందే, రాయల తెలంగాణాగా కాదు.  

ఇప్పుడు తెలంగాణలో కలుద్దామనుకుంటున్న రెండు జిల్లాల వారు, గడిచిన  కొన్ని దశాబ్దాలుగా తెలంగాణా ప్రజలు స్వరాష్ట్రం కోసం చేస్తున్న పోరాటాలపై ఏమాత్రం సానుభూతితో ప్రవర్తించ లేదు. పైగా వారి నాయకులు తెలంగాణా వాదులను అనేక మార్లు తూలనాడారు, హేళన చేశారు. ప్రతి సందర్భంలోనూ కోస్తా ప్రాంత పెట్టుబడి దార్లకు వంతపాడారు తప్ప, తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో దారుణంగా విఫలం చెందారు. అటువంటి వారు, ఇప్పుడు తెలంగాణాలో కలుస్తామని అడగడం ఎంతవరకు సమర్థనీయం? తెలంగాణా సమాజం ఏవిధంగా ఆదరించ గలదు?

No comments:

Post a Comment